logo

ఎన్టీఆర్‌ పేరు తొలగింపు దారుణం: గోరంట్ల

ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం దారుణమని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 25 Sep 2022 01:52 IST

టి.నగర్‌: ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం దారుణమని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్‌కు కూడా పేరు మార్పు తెలియలేదన్నారు. జగన్‌ ప్రతిపక్షంలో ఉండగా రోడ్లకు అడ్డంగా వైఎస్సార్‌ విగ్రహాలు పెడితే మేము అడ్డగించలేదన్నారు. దేశం, రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో త్యాగధనులున్నా వారి పేర్లు ప్రభుత్వానికి గుర్తుకురావడం లేదన్నారు. శాసన సభలో మాట్లాడనివ్వడం లేదన్నారు. మా ఎమ్మెల్యేలను తిడుతుంటే స్పీకర్‌గారు ఆనందంగా చూస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై చర్చించమంటే మమ్మల్ని బయటకు గెంటేస్తున్నారన్నారు. 2.30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న జగన్‌, ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు. రెండు లక్షల మందిని వాలంటీర్లుగా నియమించి, వారిని పార్టీ సేవలకు వినియోగిస్తూ అవే ఉద్యోగాలు ఇచ్చానని గొప్పలు చెబుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ఏడు డీఎస్సీలు నిర్వహించి, 70 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం 50 వేల ఉపాధ్యాయ పోస్టులు, పోలీసు శాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 2016లో నిరుద్యోగ శాతం 17.9 శాతం ఉంటే... 2019లో 3.3 శాతం తగ్గిందన్నారు. అదే వైసీపీ పాలనలో నిరుద్యోగం 6.6 శాతానికి పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఓడ రేవులతోపాటు ఆదాయం వచ్చే కంపెనీలను అదానీకి కట్టబెడుతున్నారన్నారు. 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్‌ వృద్ధి రేటు 10.53 శాతం ఉండగా, వైసీపీ హయాంలో మైనస్‌ 3.26 శాతానికి చేరిందన్నారు. అభివృద్ధి పేరుతో అందరినీ మోసం చేస్తున్నారన్నారు. కుప్పంలో మూడున్నరేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందని, చంద్రబాబు వేసిన రోడ్లపై వెళ్లి ప్రచారం చేస్తున్నారన్నారు. పులివెందుల్లో రాజధాని పెట్టే ఆలోచన ఉందని, అందుకే అక్కడ ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. చంద్రబాబు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు ఉంటాయని చెప్పారన్నారు. పొత్తులు చివర్లో తేలతాయనీ, ఆ తర్వాత మార్పులు ఉంటాయని, అప్పటి వరకూ ఒంటరిగానే పోరాడుతున్నట్లు తెలిపారు. పార్టీలో ఒకప్పుడు యువతకు అవకాశం ఇద్దామనుకొన్నామని, గట్టి పోటీ నేపథ్యంలో సీనియర్లు ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని