logo

ఇవే మా సమస్యలు.. మీపైనే ఆశలు..

ఆశతో మీకు అందిస్తున్నాం. పరిష్కారం చూపండని పలువురు కలెక్టరేట్‌ స్పందనలో సోమవారం అధికారులకు గోడు

Updated : 29 Nov 2022 06:17 IST

అర్జీల్లో ఆవేదన రాశాం. ఆశతో మీకు అందిస్తున్నాం. పరిష్కారం చూపండని పలువురు కలెక్టరేట్‌ స్పందనలో సోమవారం అధికారులకు గోడు వినిపించారు. వారిని పలకరిస్తే ఆవేదన తెలిపారిలా..

న్యూస్‌టుడే, అమలాపురం(అల్లవరం)


పన్నెండేళ్లు దాటితేనే పింఛనంటున్నారు..

మాది కొత్తపేట మండలం అవిడి. నా కొడుకు సాయిగణేష్‌ బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. వైద్యులు తాత్కాలిక వైకల్యం 100 శాతం అని ఇచ్చారు. ఏడేళ్ల నా కొడుక్కి 12 ఏళ్లు వస్తేకానీ దివ్యాంగ పింఛను రాదంటున్నారు. కూలి చేసుకునే మేం వాడి మందులకు డబ్బుల్లేక యాతన పడుతున్నాం. పింఛను మంజూరుచేస్తే ఆసరాగా ఉంటుంది. కలెక్టర్‌ ఆదుకోవాలి.

విన్నా సత్య


కనికరం చూపడం లేదు..

ఐ.పోలవరం మండలం మురముళ్లకు చెందిన నాకు చిన్నప్పట్నుంచి కుడికన్ను కనిపించదు. డిగ్రీ చదువుతున్నా. సదరమ్‌లో 50శాతం వైకల్యమని ఇచ్చారు. దరఖాస్తు చేసినా దివ్యాంగ పింఛను ఇవ్వడం లేదు. కింది స్థాయి అధికారులు కనికరించడం లేదు. కలెక్టరు దయచూపాలి.

దూనబోయిన వీరవేణి


వితంతు పింఛను ఆపేశారు..

మాది అంబాజీపేట మండలం. నా భర్త చనిపోవడంతో 20 ఏళ్లుగా వితంతు పింఛను ఇస్తున్నారు. నా కొడుకు చిరుద్యోగం చేస్తున్నాడని.. రెండేళ్లనుంచి పింఛను ఆపేశారు. పింఛనుపైనే ఆధారపడి జీవిస్తున్నా.. అధికారులు న్యాయం చేయాలి.   

పిల్లా వెంకటరమణ


నివాసస్థలం ఇప్పించండి

 

మాది మామిడికుదురు మండలం పాశర్లపూడి బాడవ. అద్దె భరించలేక ఇంటి స్థలానికి సచివాలయంలో దరఖాస్తు చేసినా తిరస్కరిస్తున్నారు. స్పందనలో అర్జీ ఇచ్చాం. కలెక్టరు స్పందించి గూడు కల్పించాలి.

చల్లా సత్య వెంకటలక్ష్మి


అర్జీలపై క్షేత్రస్థాయి పరిశీలన

అమలాపురం(అల్లవరం), పట్టణం: స్పందనలో వస్తున్న అర్జీలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారమార్గం చూపాలని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జేసీ ధ్యానచంద్రతో కలిసి అర్జీలు స్వీకరించారు. 189 మంది అర్జీలిచ్చినట్లు ఆధికారులు తెలిపారు.
* తన కార్యాయలంలో ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 38 మంది అర్జీలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.


నిరాశ్రయులమయ్యాం..

అమలాపురం మండలం భట్నవిల్లిలో 2013లో జాతీయ రహదారి-216 విస్తరణలో 25 మంది నివాసాలు కోల్పోయాం. పూర్తిస్థాయి నష్టపరిహారం ఇవ్వలేదు. అందజేయలేదు. రోడ్డు పక్కన పాకలు వేసుకుని ఉంటున్నాం. ఉన్నతాధికారులు స్పందించి పరిహారం ఇప్పిస్తే మరోచోట ఇళ్లు కట్టుకుంటాం.

భట్నవిల్లి గ్రామస్థులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని