logo

పోతే పోనీ యంత్రాల్‌.. వస్తేరానీ రోగులకు కష్టాల్‌!

ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి విశాఖ మన్యం ప్రాంత వాసులకు ఆరోగ్య ప్రదాయినిగా పేరుగాంచిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పలు వ్యాధి నిర్ధారణ యంత్రాలు మొరాయించాయి.

Published : 30 Nov 2022 03:25 IST

న్యూస్‌టుడే, కాకినాడ(మసీదుసెంటర్‌)

ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి విశాఖ మన్యం ప్రాంత వాసులకు ఆరోగ్య ప్రదాయినిగా పేరుగాంచిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పలు వ్యాధి నిర్ధారణ యంత్రాలు మొరాయించాయి. ఈ కారణంగా రోగులకు అవస్థలు తప్పడం లేదు. నిత్యం సుమారు మూడు వేల మంది ఓపీ,  రెండు వేలమంది ఇన్‌పేషెంట్లుగా ఇక్కడ చికిత్స పొందుతుంటారు. కొన్ని నెలలుగా పలు వైద్య పరికరాలు పనిచేయకున్నా.. స్పందన కరవైంది. దీంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించి చేతి చమురు వదిలించుకుంటున్నారు. మరోవైపు రూ. లక్షల విలువగల వైద్య పరికరాలు చిన్న మరమ్మతులకు గురైనా.. వదిలేయడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి.


ఎంఆర్‌ఐ యంత్రం....

జీజీహెచ్‌లో ఎంఆర్‌ఐ యంత్రం 13 ఏళ్ల క్రితం ఏర్పాటుచేశారు. దీన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో నిర్వహిస్తున్నారు. విలువ సుమారు రూ.13 కోట్లు. రోజూ 25-30 మంది రోగులకు ఎంఆర్‌ఐ స్కానింగ్‌లు చేస్తుంటారు. ఏడాదిన్నర నుంచి ఈ యంత్రం పనిచేయడం లేదు. దీంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లి రూ. 5 నుంచి రూ.8 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏడాది క్రితమే ఆసుపత్రికి కొత్తయంత్రం మంజూరైనా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. పాతది పనిచేయక.. కొత్తది వినియో గించక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.


రక్తపరీక్షలు ఎలా..?

జీజీహెచ్‌లోని అంబానీ 24 గంటల రక్తపరీక్షల ల్యాబ్‌లోని బెక్‌మెన్‌-ఏయూ 480 రక్తపరీక్షల యంత్రం పది నెలలుగా పని చేయడంలేదు. దీంతో వైద్య సిబ్బంది మాన్యువల్‌గానే పరీక్షలు చేస్తున్నారు. దీని ద్వారా రోజుకు సుమారు 300 పరీక్షలు చేసే అవకాశం ఉండగా.. మాన్యువల్‌గా 100 నుంచి 150 మాత్రమే చేస్తున్నారు. రక్తపరీక్షల ఫలితాల వెల్లడిలో జాప్యమవుతుంది.


థైరాయిడ్‌ నిర్ధారణ పరికరం

జీజీహెచ్‌లోని 24 గంటల ల్యాబ్‌లో ఏడాదిన్నర నుంచి థైరాయిడ్‌ నిర్ధారణ యంత్రం మరమ్మతులకు గురైంది. ఈ పరీక్ష ఒక్కోసారి సాధారణ రోగులతో పాటు గర్భిణులకు చేయాల్సి ఉంటుంది. ఒక్కో పరీక్షకు రూ.500 వరకు బయట వ్యయం చేయాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు.


లిఫ్ట్‌ ఇవ్వండి ప్లీజ్‌..

మెడికల్‌ వార్డులో ఉన్న లిఫ్ట్‌ ఆరు నెలల నుంచి పనిచేయడం లేదు. ఈ భవనంలో రెండంతస్తులు ఉండగా, అత్యవసర వైద్యం అవసరమైన రోగులు ఈ వార్డుకు వందల సంఖ్యలో వస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది నడవలేని, అపస్మారక స్థితిలో ఉంటారు. అటువంటి విభాగంలో నెలలుగా లిఫ్ట్‌ పనిచేయకపోవడం ఏమిటని రోగుల సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను సైతం స్ట్రెచర్‌పై కిందకు మోసుకుంటూ వస్తున్న దుస్థితి నెలకొంది.


వార్మర్లు, వెంటిలేటర్లు

పిడియాట్రిక్స్‌ ఐసీయూ వార్డులోని చిన్నారుల కోసం ఉపయోగించే వెంటిలేటర్లు, వార్మర్లు, ఫొటోథెరఫీ వంటి పరికరాలు కొన్ని మరమ్మతులకు గురయ్యాయి. వాటిని అందుబాటులోకి తీసుకొస్తే ఒకేసారి ఎక్కువమంది పిల్లలు వచ్చినా సమస్య లేకుండా చికిత్స అందించే అవకాశం ఉంటుంది. అధికారులు ఆ దిశగా దృష్టి సారించాలి. ప్రస్తుతం ఉన్నవాటితోనే చికిత్స అందిస్తున్నారు.


మంచాల కొరత..

ఆసుపత్రిలోని గైనిక్‌ వార్డులో మూడు యూనిట్లు ఉండగా 180 పడకలు అందుబాటులో ఉన్నాయి. ప్రసవాలకు వచ్చే వారిని ఒక మంచంపై ఇద్దరు చొప్పున ఉంచుతూ చికిత్స అందిస్తున్న పరిస్థితి నెలకొంది. కొన్నేళ్ల క్రితం ఆసుపత్రి ప్రాంగణంలో ఎంసీహెచ్‌ బ్లాక్‌ నిర్మాణం చేపట్టారు. నిధుల కొరతతో సగంలోనే ఆగిపోయింది.


పరిష్కారానికి కృషి చేస్తాం..

ఆసుపత్రిలో పలు రకాల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నాం. ఇప్పటికే వీటిని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం. సీఎస్‌ఆర్‌ నిధులతో యంత్రాలకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. ఎంసీహెచ్‌ భవన నిర్మాణాన్ని వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం. లిఫ్ట్‌కు త్వరలోనే మరమ్మతులు చేయిస్తాం. మంచాల సంఖ్యను పెంచి రోగులకు మెరుగైన చికిత్సని అందిస్తున్నాం.

డాక్టర్‌ హేమలతాదేవి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని