logo

పౌష్టికాహార లోపం తలెత్తకుండా ఐసీడీఎస్‌ సేవలు

గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఐసీడీఎస్‌ పీడీ కొండా ప్రవీణ పేర్కొన్నారు.

Published : 27 Jan 2023 05:31 IST

ముఖాముఖి

కాకినాడ(వెంకట్‌నగర్‌), న్యూస్‌టుడే: గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఐసీడీఎస్‌ పీడీ కొండా ప్రవీణ పేర్కొన్నారు. దీంతోపాటు పెళ్లయిన కొన్నాళ్లకే భార్యాభర్తలు గొడవలు పడుతున్న వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించడం, పెంచలేక వదిలేస్తున్న పిల్లల సంరక్షణ,  గృహహింసకు గురైన మహిళలకు రక్షణ కల్పించడం వంటి సేవలు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా చేపడుతున్నట్లు చెప్పారు. కాకినాడ జిల్లాలో ఐసీడీఎస్‌ పరిస్థితులపై ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో ఆమె వివరాలు వెల్లడించారు.

న్యూస్‌టుడే: జిల్లాలో రక్తహీనత నివారణకు చేపడుతున్న చర్యలు ?

పీడీ: రక్తహీనతపై ఎప్పటికప్పుడు సర్వే చేస్తున్నాం. సమస్య ఉన్న గర్భిణులు, బాలింతలను గుర్తించి వారిపై మరింత శ్రద్ధ చూపుతున్నాం. గర్భిణుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖ, సచివాలయానికి సైతం అందిస్తాం. మాతో పాటు వారు సర్వే చేసి ఆర్‌సీహెచ్‌ పోర్టల్‌లో నమోదు చేస్తారు. తద్వారా వారి ఆరోగ్యస్థితిని సమీక్షించి తగు జాగ్రత్తలు చెబుతాము. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనం అమలవుతోంది. గతం కంటే కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. రోజూ పాలు, గుడ్డు ఇస్తాము. శనివారం న్యూట్రిషన్‌ డే గా ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కింద ఆరు రకాల పోషక పదార్థాలు అందజేస్తున్నాం. గర్భిణులను ఏఎన్‌ఎమ్‌లు పరీక్షించి తల్లి బిడ్డ ఆరోగ్యానికి అవసరమైన సూచనలు చేస్తున్నారు.

డీవీసీకి వచ్చే కేసుల పరిస్థితి ఏంటి?

కొత్తగా పెళ్లయినా జంటలే ఎక్కువగా వస్తున్నాయి. వారి మధ్య మనస్పర్థలు లేకపోయినా అర్థం చేసుకోకపోవడం, కొత్త వాతావరణానికి అలవాటు పడకపోవడంతోనే సమస్యలన్నీ. ఇప్పుడు ఉన్న సమాజంలో ఎవరికి వారు స్వతహాగా జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఒకరికొకరు ఆలోచనలకు పొంతన ఉండటం లేదు. వాటిని సర్దిచెప్పి కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. డీవీసీ ద్వారా 992 జంటలకు పైగా కలిపాము. మరికొన్ని రాజీ అవుతున్నాయి. లీగల్‌, సోషల్‌ కౌన్సిలర్లు చాలా వరకు విడిపోకుండా కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరిపైనా ఉంది.

జిల్లాలో అనాథ పిల్లల సంరక్షణకు చేపడుతున్న చర్యలు?

శిశుగృహలో నలుగురు పిల్లలు ఉన్నారు. పిల్లలను సంరక్షించలేనివారు, అవాంఛిత గర్భం వచ్చిన శిశువులను కాలువల్లో, తుప్పల్లో పడేస్తున్నారు. అలా చేయకుండా ఉండేందుకు జీజీహెచ్‌, పీహెచ్‌సీల్లో ఉయ్యాలలు ఏర్పాటుచేశాం. వదిలివెళ్లిపోయిన వారు తమ వివరాలను తెలియజేయాల్సిన అవసరం లేదు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, జీజీహెచ్‌లో ఆరోగ్య పరీక్షలన్నీ చేశాక శిశు సంరక్షణ కేంద్రాలకు తరలిస్తారు. తర్వాత సీడబ్ల్యూసీకు సమాచారం ఇస్తాం.

అనాథ పిల్లల దత్తతకు తీసుకుంటున్న జాగ్రత్తలు?

ముందుగా పిల్లల వివరాలను సెంట్రల్‌ అడాప్షన్‌ రీసోర్స్‌ అథారిటీ (కారా) వెబ్సైట్‌లో నమోదు చేస్తాం. పిల్లలు కావాలనుకునే వారు కూడా కారాలో పూర్తి వివరాలతో నమోదు చేసుకోవాలి. తద్వారా హెచ్‌ఎస్‌ఆర్‌ - హోమ్‌ స్టడీ రిపోర్టు వారు విచారణ చేసి కోర్టు ద్వారా కానీ, కలెక్టర్‌ ద్వారా దత్తత ప్రక్రియ పూర్తి చేస్తారు. ప్రస్తుతం నలుగురు పిల్లలు మాత్రమే ఉన్నారు.

కరోనాతో మరణించిన తల్లిదండ్రులు లేని పిల్లల పరిస్థితి?

కరోనాలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆర్థిక సహకారం అందించాయి. వారు చదువుకునేందుకు కేంద్రీయ విద్యాలయాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు. విద్య, వైద్యానికి సంబంధించిన బాధ్యతలను ప్రభుత్వమే చూసుకుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు