logo

ప్రణాళిక ప్రకారం.. లక్ష్యాలు చేరుతాం..

ప్రభుత్వం అమలుచేసే వాటిలో నిధులు పుష్కలంగా ఉండి, కూలీలు, మెటీరియల్‌ కాంపొనెంట్‌తో పనులు ఎక్కువగా జరుగుతున్న వాటిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముఖ్యమైంది.

Published : 28 Jan 2023 03:05 IST

ముఖాముఖి

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: ప్రభుత్వం అమలుచేసే వాటిలో నిధులు పుష్కలంగా ఉండి, కూలీలు, మెటీరియల్‌ కాంపొనెంట్‌తో పనులు ఎక్కువగా జరుగుతున్న వాటిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముఖ్యమైంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ పరిధిలోకి తీసుకోవడంతో తొలుత సాంకేతికపరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినా.. తర్వాత గాడినపడింది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఏర్పడిన నేపథ్యంలో ప్రధానంగా వ్యవసాయాధారిత జిల్లా కావడంతో ఉపాధి హామీ పథకానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఓ వైపు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా పనులు చేపట్టడం, మరోవైపు కూలీలకు పని దినాలు కల్పించడం, లక్ష్యాలు చేరడం వంటివి ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాల్సిఉంది. ఈ అంశాలపై డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా  నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పథక సంచాలకులు మధుసూదన్‌ ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో అమలు తీరు వివరించారు.

న్యూస్‌టుడే: జిల్లాల పునర్విభజన జరిగి తొమ్మిది నెలలైంది. నూతనంగా ఏర్పడిన డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వ్యవసాయాధారితమైంది. కూలీలకు పని దినాల కల్పనతోపాటు రైతుల ప్రయోజనాలు ప్రధానమైనవే. ఎలా ముందుకు వెళ్తున్నారు.?

పీడీ: జిల్లాలో ఎక్కువగా వ్యవసాయమే ప్రధాన వనరు. దానికి తగ్గట్టుగా రైతులకు ప్రయోజనం చేకూరేలా ఉపాధి పనుల గుర్తింపునకు చర్యలు తీసుకుంటున్నాం. పంట కాలువలు, బోదెలు, మురుగుకాలువల్లో పూడిక తొలగింపు చేపడుతున్నాం. కూలీలకు పని దినాలు కల్పించగలుగుతున్నాం.

న్యూస్‌టుడే: జిల్లాలో జాబ్‌కార్డుల పరిస్థితి, ఈ ఏడాది ఇప్పటివరకు ఎన్ని పని దినాలు కల్పించారు..?

పీడీ: జిల్లాలోని 22 మండలాల్లోని 385 గ్రామాల్లో 2.84 లక్షల జాబ్‌కార్డులున్నాయి. వీటి పరిధిలో 4.9 లక్షల మంది కూలీలు ఉండగా 1.54 లక్షల జాబ్‌కార్డుల్లోని 2.28 లక్షల మంది కూలీలు ఉపాధిహామీ పనులకు వస్తున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ 9 వేలమంది కూలీలు పనులకు వస్తున్నారు. 47.29 లక్షల పనిదినాలు కల్పించాం. వేసవిలో సంఖ్య పెరుగుతుంది.

న్యూస్‌టుడే: కోనసీమ జిల్లాలో వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా ఉపాధి పథకం అమలెలా..?

పీడీ: జిల్లాలో పరిస్థితులకు అనుగుణంగా పని కల్పన ఛార్ట్‌ రూపొందించి లక్ష్యాలకు అనుగుణంగా కూలీలకు పని కల్పించడానికి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాం. రైతులకు ఉపయోగపడేలా కొబ్బరితోటల్లో చెట్ల చుట్టూ ట్రెంచ్‌(పల్లాలు) ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. అందుకు 1,872 మంది రైతులను గుర్తించాం.

న్యూస్‌టుడే: ఈ ఏడాది సగటు వేతనం ఎంత కల్పిస్తున్నారు. 100 రోజుల పనిదినాలు ఎన్ని కుటుంబాలకు కల్పించారు..?

పీడీ: ఉపాధి హామీ పథకంలో కూలీలకు సగటు వేతనం రూ.257 కల్పించాలి. జిల్లాలో సగటు వేతనం రూ.244 కల్పిస్తున్నాం. రాష్ట్రంలో మనమే మొదటిస్థానంలో ఉన్నాం. ఇప్పటివరకు 1,275 కుటుంబాలకు 100 రోజుల పనిదినాలు కల్పించాం.

న్యూస్‌టుడే: గతేడాది జిల్లాలో ఎందరికి పని కల్పించారు. ఎంత లబ్ధి చేకూరింది.?

పీడీ: ఉపాధి హామీ పథకంలో 2021-22లో 1,22,128 కుటుంబాల్లోని 1,73,696 మంది కూలీలకు 51,87,656 పని దినాలు కల్పించాం. వీటిలో 6648 కుటుంబాలకు 100 రోజులు పూర్తయ్యాయి. కూలీలకు రూ.121.25 కోట్ల వేతనాలు అందించాం.

న్యూస్‌టుడే: కూలీలకు వేతనాలు పరిస్థితి.. బకాయిలెంత..?

పీడీ: కూలీల వేతనాలకు సంబంధించి ఇబ్బందులేమీ లేవు. ఈ ఏడాది జనవరి 18వరకు చెల్లించాం.

న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకంలో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో రాగాస్‌ సాఫ్ట్‌వేర్‌ నుంచి ఎన్‌ఐసీకు వెళ్లారు. కూలీల మస్తర్ల నమోదు విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను ఎలా అధిగమిస్తున్నారు..?

పీడీ: పనుల గుర్తింపు నుంచి కూలీల మస్తర్లు, బిల్లుల చెల్లింపువరకు ఎన్‌ఐసీ పోర్టల్‌లోనే జరుగుతున్నాయి. గతంలో ఇబ్బంది ఏర్పడినా.. ప్రస్తుతం సవ్యంగానే జరుగుతోంది. నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సాఫ్ట్‌వేర్‌(ఎన్‌ఎంఎంఎస్‌) చరవాణి ద్వారా కూలీల మస్తర్లు అప్‌లోడ్‌ చేస్తున్నాం.

న్యూస్‌టుడే: కొవిడ్‌ నేపథ్యంలో సామాజిక తనిఖీలు గతంలో మాదిరిగా పారదర్శకంగా జరగడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం జిల్లాలో సామాజిక తనిఖీలు ప్రారంభించారా..?

పీడీ: సామాజిక తనిఖీలు పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తాం. 2021-22లో పనులకు సంబంధించి సామాజిక తనిఖీలు 14 మండలాల్లో జరగాల్సిఉంది. ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని