logo

నేర వార్తలు

కొవ్వూరు పురపాలక సాధారణ, బడ్జెట్‌ సమావేశాలు ఛైర్‌పర్సన్‌ భావన రత్నకుమారి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.

Published : 28 Jan 2023 03:05 IST

‘పలు విభాగాల్లో అవినీతి జరుగుతోంది’

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: కొవ్వూరు పురపాలక సాధారణ, బడ్జెట్‌ సమావేశాలు ఛైర్‌పర్సన్‌ భావన రత్నకుమారి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఎక్స్‌అఫీషియో సభ్యురాలిగా హోంమంత్రి తానేటి వనిత హాజరయ్యారు. ఇందులో 22వ వార్డు (వైకాపా) కౌన్సిలర్‌ కంఠమణి రమేష్‌ మాట్లాడుతూ బాక్సు టెండర్ల నిర్వహణ తీరుపై గత కౌన్సిల్‌లో ప్రశ్నించామని,    0.001 శాతానికి టెండరు వేసి పనులు ఎలా చేస్తారని అడగ్గా ఈసారి 24 శాతం లెస్‌కు వేశారన్నారు. రూ.లక్షకు రూ.76 వేలతో పనులు జరుగుతాయా అన్నారు. నోటీస్‌ బోర్డులో ఉంచడం, బయటి కాంట్రాక్టర్లు, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖలకు తెలియజేయాలన్నారు. ఈ అంశంపై అదే పార్టీకి చెందిన పదో వార్డు కౌన్సిలర్‌ బత్తి నాగరాజు మాట్లాడుతూ కార్యాలయ ఉద్యోగులే బాక్సు టెండర్లు వేస్తున్నారని, దీనిపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. పలు విభాగాల్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. కమిషనర్‌ బి.శ్రీకాంత్‌ అంశాల వారీగా సమాధానమిచ్చారు.

అవినీతిపై సహించను: వీరు చేసిన ఆరోపణలపై మంత్రి మాట్లాడుతూ పౌరసేవల్లో అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. టెండర్లు, సేవల విషయంలో ఆధారాలు ఉంటే తనకు ఇవ్వాలన్నారు.


యాప్‌ అప్‌డేట్‌ పేరిట ఆన్‌లైన్‌ మోసం

రాజమహేంద్రవరం నేరవార్తలు: బ్యాంకు లావాదేవీలకు వినియోగిస్తున్న యాప్‌ను వెంటనే అప్‌డేట్‌ చేయకుంటే మీ ఖాతా బ్లాక్‌ అవుతుందని వచ్చిన ఫోన్‌కు స్పందించి రూ.లక్షకు పైగా పోగొట్టుకున్న ఘటన రాజమహేంద్రవరం బొమ్మూరు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ఆర్‌.విజయ్‌కుమార్‌ వివరాల మేరకు.. వీఎల్‌పురం ప్రాంతానికి చెందిన షేక్‌ మదీనా మన్వర్‌ అనే వృద్ధుడు ప్రైవేటు సంస్థలో పనిచేసి ఇటీవలే ఉద్యోగ విరమణ చేశాడు. తన బ్యాంకు నగదు లావాదేవీలన్నీ ఫోన్‌లోని యాప్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. ఆయనకు గత ఏడాది నవంబరు 23న ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. మీరు వినియోగిస్తున్న యాప్‌ అప్‌డేట్‌ చేయాలని, లేకుంటే బ్యాంకు ఖాతా బ్లాక్‌ అవుతుందని చెప్పాడు. సదరు వ్యక్తి మాయ మాటలు నమ్మిన మన్వర్‌ బ్యాంకు వివరాలతోపాటు పాన్‌ కార్డు, తన ఫోన్‌కి వచ్చిన ఓటీపీ సందేశాలను ఆ వ్యక్తికి చెప్పారు. అనంతరం గంటల వ్యవధిలో మన్వర్‌ ఖాతాలోని రూ.1.24 లక్షల నగదు పలు దఫాలుగా చోరీకి గురయింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితుడు శుక్రవారం పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


అయిదు ఆలయాల్లో చోరీ

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: మండలంలోని సూర్యారావుపాలెంలో అయిదు ఆలయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు గురువారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. సాయిబాబా, కనకదుర్గమ్మ, పుంతముసలమ్మ, వినాయకుడు తదితర ఆలయాల్లో హుండీలు బద్దలగొట్టి సొమ్ము కాజేశారు. ఆయా ఆలయాల నిర్వాహకులు శుక్రవారం ఉదయం విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దమ్మెన్ను, వేలివెన్ను పరిధిలో కొండాలమ్మ ఆలయంలో చోటు చేసుకున్న చోరీకి సంబంధించి సీసీ కెమెరా వీడియోలను పరిశీలించారు. దొంగ ముసుగు వేసుకుని లోపలకు ప్రవేశించినట్లు గుర్తించారు. ఎంత మొత్తం చోరీకి గురైందో తెలియలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని