logo

ఆరోగ్య పరీక్షలకు అశ్రద్ధ వద్దమ్మా..

సాధారణంగా ప్రైవేటు ఆసుపత్రులు, పరీక్ష కేంద్రాల్లో క్యాన్సర్‌ పరీక్ష చేయించుకోవాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పని. దాంతో చాలామంది దానిని అశ్రద్ధ చేయడం, ఇబ్బంది వచ్చినప్పుడు చూద్దాంలే అనే ధోరణి కనిపిస్తోంది.

Published : 05 Feb 2023 05:55 IST

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం

క్యాన్సర్‌ పరీక్ష నివేదిక పరిశీలిస్తున్న సాంకేతిక నిపుణురాలు

సాధారణంగా ప్రైవేటు ఆసుపత్రులు, పరీక్ష కేంద్రాల్లో క్యాన్సర్‌ పరీక్ష చేయించుకోవాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పని. దాంతో చాలామంది దానిని అశ్రద్ధ చేయడం, ఇబ్బంది వచ్చినప్పుడు చూద్దాంలే అనే ధోరణి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో మహిళల కోసం కొద్ది నెలల క్రితం ప్రారంభించిన క్యాన్సర్‌ ఓపీ సేవలు సత్ఫలితాలిస్తున్నాయి. నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజ్‌(ఎన్‌సీడీ) గుర్తింపులో భాగంగా ఆసుపత్రిలోని ఏఆర్‌టీ కేంద్రం ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నారు. రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌ లక్షణాలను గుర్తించి మెరుగైన చికిత్స అందించేందుకు వీలుగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.7 లక్షలు వెచ్చించి క్యాన్సర్‌ లక్షణాలను గుర్తించే పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏఆర్‌టీ కేంద్రానికి వచ్చే రోగులతోపాటు సాధారణ ఓపీ ద్వారా వచ్చే వారిని సైతం పరీక్షించి సూచనలు చేస్తుండడంతో మహిళలకు ఉపయుక్తంగా ఉంటోంది.

ముందుగా గుర్తిస్తే మెరుగైన చికిత్స..

ప్రభుత్వాసుపత్రుల్లో పరీక్షలు లేకపోవడంతో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌కు ఇంతవరకు మహిళలు దూరంగా ఉంటున్నారు. పరికరాలు అందుబాటులోకి రావడంతో అవసరమున్న మహిళలు పరీక్షలు చేయించుకోడం వల్ల వ్యాధి ముదరకముందే గుర్తించేందుకు వీలుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముందే గుర్తించడం వల్ల ప్రమాదం లేకుండా బయటపడొచ్చని పేర్కొంటున్నారు.

రోజుకు పదిమందికి పైగా..

రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో గతేడాది నవంబరులో ఈ సేవలను ప్రారంభించినా కేవలం ఏఆర్‌టీ కేంద్రం వైద్యులు పంపిన హెచ్‌ఐవీ రోగుల మాత్రమే సేవలు పొందేవారు. ప్రస్తుతం సాధారణ ఓపీతోపాటు ఆసుపత్రిలోని ఏ వైద్యులు రిఫర్‌ చేసినా ఇక్కడ రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. వచ్చిన ప్రతిఒక్కరికీ రెండు రకాల స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. గతంలో ఈ పరీక్షలకు రోజుకు నలుగురు వస్తే గత నెల మొత్తం సగటున 250 మంది క్యాన్సర్‌ పరీక్షలు చేయించుకున్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌.రమేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఓ సంస్థ ప్రతినిధులు క్యాన్సర్‌ పరీక్షలకు సంబంధించి సేవలందిస్తున్నారన్నారు. ఈ పరీక్షల్లో ఏ మహిళలకైనా లక్షణాలున్నట్లు నిర్ధారణ అయితే వారిని మెరుగైన చికిత్స అందించడంతోపాటు వ్యాధి ఏ దశలో ఉందో తెలుసుకుని తదుపరి చికిత్సలను వివరిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని