logo

నచ్చినంత తవ్వేయ్‌.. వచ్చినంత దోచేయ్‌!

గోదావరి పరివాహక ప్రాంతాల్లో బినామీల పేరుతో ఇసుక తోడేస్తున్నారు. తవ్వకాలు, విక్రయాలు జేపీ సంస్థకు అప్పగించామని ప్రభుత్వం చెబుతున్నా అధికార పార్టీ పెద్దలు నేరుగా రంగంలోకి దిగి బినామీతో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు.

Published : 06 Feb 2023 05:11 IST

న్యూస్‌టుడే, టి.నగర్‌ (రాజమహేంద్రవరం)

గాయత్రి ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో ఇసుక తవ్వకం

గోదావరి పరివాహక ప్రాంతాల్లో బినామీల పేరుతో ఇసుక తోడేస్తున్నారు. తవ్వకాలు, విక్రయాలు జేపీ సంస్థకు అప్పగించామని ప్రభుత్వం చెబుతున్నా అధికార పార్టీ పెద్దలు నేరుగా రంగంలోకి దిగి బినామీతో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా యంత్రాంగం కన్నెత్తి చూడడం లేదు. ప్రస్తుతం గోదావరి పరివాహకంలో 21 ర్యాంపులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రాజమహేంద్రవరం గ్రామీణంలోని ధవళేశ్వరం పరిధిలో తొమ్మిది, కాతేరులో తొమ్మిది, కోటిలింగాల రేవులో 1, 2, 3 ర్యాంపులు ఉన్నాయి. ప్రభుత్వ ఒప్పందం మేరకు గతంలో జేపీ సంస్థ తవ్వకాలు చేసేది. ప్రస్తుతం జేపీ సంస్థ సబ్‌ లీజ్‌కు ఇచ్చిందని కొందరు ప్రభుత్వ పెద్దలు నేరుగా రంగంలోకి దిగారు.

వేమగిరిలో గోదావరి నదిలోకి వేసిన బాట

రాత్రిపూట తవ్వకాలు

జేపీ సంస్థను పక్కన పెట్టిన తర్వాత నేతలు బరితెగించారు. నేరుగా 15 నుంచి 20 యూనిట్లు బోట్లను రంగంలోకి దించారు. రాత్రి 8 గంటల నుంచి ఈ బోట్లు గోదావరిలోకి వెళ్తున్నాయి. నేరుగా డ్రెడ్జింగ్‌ చేస్తూ ఇసుకను తోడేస్తున్నాయి. తెల్లారేసరికి ర్యాంపుల వద్ద ఇసుక గుట్టలు పేరుకుపోతున్నాయి. ఆ తర్వాత ప్రొక్లెయిన్లు వాడి నేరుగా 12 చక్రాల లారీల్లో ఇసుకను తరలించేస్తున్నారు. రోజుకు 800 నుంచి వెయ్యి ట్రిప్పుల లారీ ఇసుక బయటకు వస్తోంది. గతంలో 200 లారీల ఇసుక బయటకు వస్తే గగనంగా ఉండేదని సొసైటీ నిర్వాహకులే ఆశ్చర్యపోతున్నారు.

భారీ లారీల్లో ఇసుక రవాణా

చక్రం తిప్పుతున్నారు..

ధవళేశ్వరం, కాతేరు ర్యాంపులు గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి నిర్వహిస్తున్నారు. ఈయన రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ మంత్రికి బినామీగా చెబుతున్నారు. ఈ ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు చేస్తూ కోట్లలో ఆర్జిస్తున్నారు.

వేమగిరి ఓపెన్‌ రీచ్‌లలో వైకాపా ప్రభుత్వంలో కీలక నేత అల్లుడి భాగస్వామ్యమునట్లు తెలుస్తోంది. గతంలో స్థానికంగా ఓ ప్రజాప్రతినిధి నిర్వహణలో కొవ్వూరులో ఒక ర్యాంపు, ఇక్కడ ఓపెన్‌ ర్యాంపులు పంచుకోగా, ఈసారి కీలక నేత అల్లుడికీ వాటా కల్పించారు. వీరి పర్యవేక్షణలో తవ్వకాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ఇదే విషయంపై మూడు నెలల కిందట వేమగిరికి చెందిన ఇసుక సొసైటీ నిర్వాహకులు తిరగబడిన విషయం తెలిసిందే.

అనధికార చెక్‌పోస్టులు దాటాల్సిందే..

డ్రెడ్జింగ్‌ జరిగే ర్యాంపుల్లో అధికార నేతల ప్రైవేటు సైన్యం కాపలాగా ఉంటోంది. రాత్రీపగలు షిఫ్ట్‌ల్లో గస్తీ ఉంటున్నారు. వారికి చెందిన మనుషులు తప్ప మిగిలిన వారెవరినీ లోపలకు అనుమతించరు. వేమగిరి ఓపెన్‌ రీచ్‌కు చేరాలంటే అనధికారికంగా రెండు, మూడు చెక్‌ పోస్టులు దాటి వెళ్లాల్సిన
పరిస్థితి ఏర్పడింది.

కన్నెత్తి చూడరే

ఇంత జరుగుతున్నా యంత్రాంగం కన్నెత్తి చూడడం లేదు. ఇష్టానుసారం తవ్వకాలతో నదిపై వంతెనలకు ప్రమాదంగా మారింది. ప్రధానంగా కాతేరు నాలుగో వంతెన వద్ద పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. నిరుడు కలెక్టర్‌ మాధవీలత నిర్వాహకులతో సమావేశం పెట్టి  వంతెన వద్ద 500 మీటర్ల వరకు ఎటువంటి తవ్వకాలు చేయకూడదని హెచ్చరించినా ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు.

ప్రభుత్వ ఆదాయానికి గండి

గతంలో జేపీ సంస్థ నిర్వహణలో టన్ను ఇసుక ధర రూ.625గా నిర్ణయించారు. ప్రస్తుతం అంతా టన్ను రూ.550కే విక్రయిస్తున్నారు. వాస్తవానికి ఈ రేటు గిట్టుబాటు కాదు. ఎక్కడా వరస బిల్లులు లేకపోవడంతో ఈ లోటును భర్తీ చేస్తున్నారు. ప్రభుత్వం ముద్రించి అందించిన బిల్లులతో రోజుకు ఎన్ని లారీలు బయటకెళ్లిందీ లెక్క తెలిసేది. ప్రస్తుతం జేపీ సంస్థ నేరుగా ముద్రించిన బిల్లు బయటకు రావడంతో లారీలకు లెక్కలేకుండా పోయింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. గతంలో ఎన్ని లారీలు ఇసుక బయటకు వస్తే అన్ని బిల్లులకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాటా ఖజానాలో జమ చేయాల్సి వచ్చేది. రేటు తగ్గడంతో ఇసుక సొసైటీ నిర్వాహకులు తవ్వకాలపై నోరు మొదపడం లేదు. వే బ్రిడ్జి బిల్లు, సీరియల్‌ నంబర్లతో లేని బిల్లులు వాడుకలోకి రావడంతో అంతా అనుకున్నట్లు సాగుతోంది.  స్థానిక అవసరాలకు దగ్గర్లో ఉన్న వాటికి సొసైటీలు ఇసుక అందిస్తుండగా, బినామీలు మాత్రం 12 చక్రాల లారీలతో ఒకేసారి 15 టన్నుల ఇసుకను దూరప్రాంతాలకు, రాష్ట్రం దాటి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.


పరిశీలించి, చర్యలు తీసుకుంటాం..

నరసింహారెడ్డి, గనుల శాఖ, డీడీ

ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నాం. డ్రెడ్జింగ్‌ ఆరోపణల నేపథ్యంలో రాత్రి సమయంలో గస్తీ పెంచాం. గనుల శాఖతోపాటు సెబ్‌ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. అనధికారిక తవ్వకాలు చేస్తే సంబంధిత బాధ్యులపై కచ్చితంగా చట్ట ప్రకారం కఠిన చర్యలు
తీసుకుంటాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు