logo

అడుగేస్తే.. ఆక్రమణే

పురపాలక సంఘాల్లోని ప్రభుత్వ స్థలాలపై కొందరు అక్రమార్కులు కన్నేసి పాగా వేస్తున్నారు. పెద్దల సహకారంతో దర్జాగా కబ్జా చేస్త్తున్నారు.

Published : 06 Feb 2023 05:11 IST

న్యూస్‌టుడే, పిఠాపురం, సామర్లకోట

పురపాలక సంఘాల్లోని ప్రభుత్వ స్థలాలపై కొందరు అక్రమార్కులు కన్నేసి పాగా వేస్తున్నారు. పెద్దల సహకారంతో దర్జాగా కబ్జా చేస్త్తున్నారు. కళ్లెదుట ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుంటున్నా.. పురపాలక ఆదాయానికి గండిపడుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడం లేదు. సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం పురపాలికల్లో భూకబ్జాలపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం.

సామర్లకోట: నీలమ్మ చెరువు గట్టుపై భవనాలు

ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు అనువైన స్థలాలను పురపాలక అధికారులు గుర్తించి సంబంధిత శాఖకు బదలాయిస్తారు. అలాంటి స్థలాలు, చెరువు గట్లను అక్రమార్కులు ఆక్రమిస్తున్నారు. అందులో శాశ్వత భవనాలు నిర్మిస్తున్నారు.  వీటికి అనుమతి లేకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అదే గూడు లేని పేదలు ప్రభుత్వ స్థలంలో చిన్న పాక వేసుకుంటే అధికారులు వెంటనే పీకిపారేస్తారు. పట్టణాల్లో పెరుగుతున్న భూ ఆక్రమణలు, అధికారుల తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

సామర్లకోట పట్టణంలో పురపాలక సంఘ ఖాళీ స్థలాలు, బహిరంగ మరుగుదొడ్లు స్థలాన్ని, చెరువు గట్లను ఆక్రమించి భవనాలు నిర్మించారు. ఈ పట్టణ నడిబొడ్డున ఉన్న నీలమ్మ చెరువు నీటిని పూర్వం తాగునీటికి వినియోగించేవారు. ఈ చెరువు గట్టుపై నడక దారి, పచ్చదనంతో ఉద్యానంగా అభివృద్ధికి రూ.లక్షల్లో నిధులు వెచ్చించినా, ఆ దిశగా ప్రగతికి నోచుకోలేదు. అక్రమార్కుల చర్యలతో రోజరోజుకు చెరువు గర్భం మూసుకుపోతోంది. గట్టు ఆక్రమణకు గురవుతోంది. ఇక్కడ గట్టు చుట్టూ లయన్స్‌క్లబ్‌, వివేకానంద, సొసైటీ, పాఠశాల భవనాలు నిర్మించారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద రైతు భవనం, కల్యాణ మండపం నిర్మించారు.

పెద్దాపురం పాత బస్టాండు సమీపంలోని చెరువు ఆక్రమణకు గురైంది. దీని పక్కన ఉంటున్న వ్యక్తి తన స్థలంతో పాటు చెరువును ఆనుకుని ఉన్న సుమారు వెయ్యి గజాల స్థలాన్ని ఆక్రమించి చుట్టూ ప్రహరీ నిర్మించాడు. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. పట్టణంలో ఆర్‌అండ్‌బీ రహదారి పక్కన చాలా చోట్ల ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయి.

పిఠాపురం: జగ్గయ్యచెరువులో రోడ్డుపక్క ప్రభుత్వ స్థలాల్లో వ్యాపారాలు

పిఠాపురం పట్టణంలో రోడ్ల పక్కన ప్రభుత్వ స్థలాలు ఆక్రమార్కుల గుప్పెట్లోకి వెళ్తున్నాయి. రెండేళ్ల క్రితం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆక్రమణలు పూర్తి స్థాయిలో తొలగించారు. మార్కెట్‌ సెంటర్‌ నుంచి జగ్గయ్య చెరువు వరకూ దుకాణాలు, ఇళ్లు కూల్చేశారు. మళ్లీ ఏడాదిలో ఆక్రమణలు పెరిగిపోయాయి. జగ్గయ్యచెరువులోని బీఎంఆర్‌ ప్రభుత్వ బాలికల పాఠశాల పక్కన గతంలో దుకాణాలు తొలగించగా.. ప్రజాప్రతినిధుల అండతో కిరాణా, కూరగాయలు, అల్పాహార దుకాణాలు వెలిశాయి. రథాలపేట సెంటర్‌, ఆర్టీసీˆ కాంప్లెక్స్‌ ఏరియా ప్రాంతాల్లోనూ దుకాణాలు ఏర్పాటు చేసి, అద్దెకు ఇచ్చేశారు.  జాతీయ రహదారి వెంబడి ప్రభుత్వ స్థలాల్లోనూ దుకాణాలు వెలిశాయి.


ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు తొలగిస్తాం..

ఎన్‌వీవీ సత్యనారాయణరావు, పురపాలక ప్రాంతీయ సంచాలకుడు, రాజమహేంద్రవరం

పురపాలక స్థలాలు ఆక్రమించడం, భవనాలు నిర్మించడం నేరం. పట్టణంలో ఆక్రమణలు తొలగిస్తున్నాం. కొందరు దౌర్జన్యంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. సర్వే చేసి చర్యలు తీసుకుంటాం. సేవా ముసుగులో అద్దెలు వసూలు చేసే సంస్థలపై విచారణ చేపడతాం. పురపాలక ఆస్తులు పరిరక్షిస్తాం. ఆదాయానికి గండిపడితే సహించం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని