logo

ప్యారీ షుగర్స్‌లో మళ్లీ ప్రమాదం.. డ్రైవర్‌ మృతి

కాకినాడ జిల్లా వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్‌ రిఫైనరీ ఇండియా లిమిటెడ్‌ కంపెనీలో సోమవారం లోడింగ్‌ యంత్రం టైర్లకు గాలి పడుతుండగా టైర్‌ పేలిపోయి డ్రైవర్‌ దుర్మరణం చెందాడు.

Published : 21 Mar 2023 05:18 IST

శివకుమార్‌

సర్పవరం జంక్షన్‌: కాకినాడ జిల్లా వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్‌ రిఫైనరీ ఇండియా లిమిటెడ్‌ కంపెనీలో సోమవారం లోడింగ్‌ యంత్రం టైర్లకు గాలి పడుతుండగా టైర్‌ పేలిపోయి డ్రైవర్‌ దుర్మరణం చెందాడు. తూరంగి ప్రాంతంలోని మహాలక్ష్మినగర్‌కు చెందిన పెనుపోతు శివకుమార్‌ (34) తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గత ఎనిమిది నెలల కాలంలో జరిగిన మూడు ప్రమాదాల్లో అయిదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కాలం చెల్లిన యంత్రాలు, వాహనాల కారణంగా తాజాగా ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ పరిశ్రమ గేటు వద్ద మృతుని కుటుంబ సభ్యులతో కలిసి కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని నినాదాలు చేశారు. బాధితుల తరఫున మత్స్యకార సంఘాల నాయకులు తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మత్య్సకార, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేయడంతో డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి వారిని సముదాయించి కంపెనీ ప్రతినిధులతో చర్చలకు అవకాశం కల్పించారు. కంపెనీ యాజమాన్యం రూ.40 లక్షలు, వర్కుమెన్‌ కాంపన్షేషన్‌గా రూ.10 లక్షలు, గుత్తేదారు నుంచి రూ.5 లక్షలు మొత్తంగా రూ.55 లక్షల పరిహారంతో పాటు మృతుని భార్యకు కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. శివకుమార్‌ కంపెనీలో దాదాపు అయిదు సంవత్సరాలుగా డ్రైవర్‌ విధులు నిర్వహిస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యంతోనే...

అధికారుల నిర్లక్ష్యం, కర్మాగారంలో భద్రతా ప్రమాణాలు పాటించపోవడంతోనే ప్యారీ షుగర్స్‌లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని సామాజిక కార్యకర్త ప్రసాద్‌ ఆరోపించారు. కంపెనీ గేటు వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. కంపెనీలో రెండో ప్రమాదం  జరిగిన తర్వాత భద్రతా ఆడిట్‌ చేయించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీచేసినా ఎవరూ స్పందించలేదన్నారు. యంత్ర పరికరాలతో పాటు యంత్రాల భద్రతను కూడా తనిఖీ చేయించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో వరుసగా జరుగుతున్న ప్రమాదాల్లో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా యాజమాన్యాలు భద్రతా చర్యలు చేపట్టడం లేదని ఏఐఎఫ్‌టీయూ జిల్లా నాయకుడు రంబాల సతీష్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని