logo

క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్‌

జిల్లాను క్షయ రహితంగా తీర్చిదిద్దేందుకు, బాధితులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్‌ మాధవీలత కోరారు.

Published : 21 Mar 2023 05:46 IST

జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

వి.ఎల్‌.పురం: జిల్లాను క్షయ రహితంగా తీర్చిదిద్దేందుకు, బాధితులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్‌ మాధవీలత కోరారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో వైద్యఆరోగ్య శాఖ ఆధర్యంలో నిర్వహించిన జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన, ప్రధానమంత్రి టీబీ ముక్త్‌భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఈ వ్యాధి వల్ల వచ్చే అనారోగ్య, ఆర్థిక, సామాజిక పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏటా మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నారు.  గ్రామసభలు నిర్వహించడం ద్వారా క్షయ వ్యాధిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రధాన మంత్రి టీబీ ముక్త్‌భారత్‌ అభియాన్‌- నిక్షయ్‌ మిత్ర కార్యక్రమం కింద ఆరు నెలల పాటు పౌష్టికాహారం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కలెక్టర్‌ కోరారు. ఇప్పటికే జిల్లాలో వ్యాధి బారిన పడిన కొంత]మందిని స్వచ్ఛంద సంస్థలు, దాతలు దత్తత తీసుకుని పౌష్టికాహాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. డీఆర్వో నరసింహులు, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరావు, జిల్లా ఎయిడ్స్‌, క్షయ నియంత్రణ అధికారి వసుంధర, డీసీహెచ్‌ఎస్‌ సనత్‌కుమారి, టూరిజం రీజనల్‌ మేనేజర్‌ స్వామినాయుడు, డీపీవో జగదాంబ తదితరులు పాల్గొన్నారు.


అర్జీల పూర్తిస్థాయి పరిష్కారానికి ఆదేశం

అర్జీదారుల సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ మాధవీలత ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమంలో డీఆర్వో నరసింహులు, ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 190 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందనలో అందిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. స్పందన అర్జీలను ఆన్‌లైన్‌ ద్వారా రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారని, జిల్లాలో వివిధ శాఖల వారీగా పరిష్కరించిన అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 383 స్పందన అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో 33 అర్జీలు తిరిగి వచ్చాయని కలెక్టర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని