logo

ఉగాదికి గృహప్రవేశం లేనట్టే!

మూడేళ్ల నుంచి జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం సాగుతూనే ఉంది. గృహ ప్రవేశాలకు పెడుతున్న ముహూర్తాలు దాటిపోతున్నా ఇళ్ల నిర్మాణాలు, వసతుల కల్పన పూర్తిస్థాయిలో జరగడం లేదు.

Published : 21 Mar 2023 05:56 IST

సీతానగరం: చినకొండేపూడిలో పునాదుల దశలోనే నిర్మాణం

న్యూస్‌టుడే-సీతానగరం: మూడేళ్ల నుంచి జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం సాగుతూనే ఉంది. గృహ ప్రవేశాలకు పెడుతున్న ముహూర్తాలు దాటిపోతున్నా ఇళ్ల నిర్మాణాలు, వసతుల కల్పన పూర్తిస్థాయిలో జరగడం లేదు. తాజాగా ఉగాదికి కొందరు లబ్ధిదారులకు  గృహప్రవేశం కల్పిస్తామని లక్ష్యం నిర్దేశించుకున్నా అదీ పూర్తికాని పరిస్థితి.

‘నవరత్నాలు-పేదలందరికీ’ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పట్టా తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం ప్రభుత్వమే చేస్తుంది... గృహ ప్రవేశాలు చేసుకుంటే చాలని ముందుగా చెప్పినా... ఆ తర్వాత లబ్ధిదారులే సొంతంగా నిర్మించుకుంటే నాలుగు విడతలుగా బిల్లు చెల్లిస్తామన్నారు. 2021 జూన్‌ తర్వాత ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. 2022 మార్చికి పూర్తిచేస్తామన్నారు. ఆశించిన స్థాయిలో నిర్మాణాలు లేకపోవడంతో గడువు పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు గృహప్రవేశాలు వాయిదా పడగా నాలుగోసారి ఈ నెల 22న బుధవారం ఉగాది రోజున భారీ సంఖ్యలో గృహప్రవేశాలు చేసేలా నిర్ణయించారు. ఈ ఉగాదికి కూడా గృహప్రవేశాలు లేవని మరోసారి వాయిదా పడిందని లబ్ధిదారులకు గృహనిర్మాణశాఖ అధికారులు ఇప్పటికే సమాచారమిచ్చారు. ఏప్రిల్‌ రెండో వారంలో గృహప్రవేశాలు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.


ఎందుకిలా..

ఉమ్మడి జిల్లాలో 1,40,000 పైగా ఇళ్లు మంజూరుచేశారు. మూడేళ్లు నుంచి 40,929 ఇళ్లను మాత్రమే పూర్తిచేయగలిగారు. లేఔట్లు కనీస సదుపాయాలకు దూరంగా ఉండడంతో నివాసానికి లబ్ధిదారులు మొగ్గుచూపడం లేదు. రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్‌ పరిధిలో పరిశీలిస్తే... 298 లేఔట్ల వద్ద ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన భూములు కొనుగోలు చేశారు. ఇందులో 70 శాతానికి పైగా భూములు నిర్మాణాలకు అనుకూలంగా లేవు. చాలాచోట్ల ఊరికి దూరంగా ఉన్నాయి. వ్యవసాయ భూములు కావడంతో పునాదులు తీస్తుంటే ఊట నీరు వస్తుండడంతో నిర్మాణాలు వదిలేశారు. రెండేళ్ల క్రితం భూసేకరణ చేసిన వాటికి పరిహారం అందని పరిస్థితి.


ఇదీ పరిస్థితి...

ఉగాది నాటికి కచ్చితంగా పూర్తిచేసేలా ఆయా మండలాల అధికారులకు గతేడాది డిసెంబరులోనే లక్ష్యాలను నిర్దేశించారు. వీటిని పూర్తిచేసేలా గ్రామసచివాలయం, మండల పరిషత్‌ కార్యాలయం ఉద్యోగులను గృహ నిర్మాణ శాఖలో భాగస్వామ్యం చేశారు. లక్ష్యాన్ని పూర్తిచేయడంలో ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చారు. పలువురు ఇంజినీరింగ్‌ సహాయకులపై వేటు వేయడంతోపాటు గృహనిర్మాణ శాఖ సిబ్బందికి మెమోలిచ్చారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలపై అవగాహన పెంచేలా అధికార యంత్రాంగం ముందుకొచ్చిన సమయంలో వారంతా సమస్యలను ఏకరవు పెడుతున్నారు. రహదారులు, విద్యుత్తు, తాగునీరు అవసరాలు పెంచకుండా నిర్మాణాలు ఎలా పూర్తిచేయాలంటున్నారు.


నీటికీ కష్టాలే...

జగనన్న కాలనీల్లో శాశ్వత మంచినీటి పథకాల నిర్మాణాలకు గానూ జల్‌జీవన్‌ మిషన్‌లో రూ.కోట్ల నిధులతో పనులు కేటాయించి రెండేళ్లు దాటింది. ఏ లే ఔట్‌లోనూ పూర్తిస్థాయిలో పనులు జరగలేదు. తూర్పు గోదావరి జిల్లాలో పరిశీలిస్తే... 306 లే ఔట్‌ల్లో రాజమహేంద్రవరం డివిజన్‌లో 100 తాగునీటి పథకాలకు రూ.5,208.12 కోట్లు, కొవ్వూరు డివిజన్‌లో 168 పనులకు గానూ రూ.1,749.80 కోట్లు కేటాయించారు. ప్రతి చోటా 20 వేల లీటర్ల సామర్థ్యం నుంచి 40 వేల లీటర్ల నిల్వలు చేసే నీటి ట్యాంకులతోపాటు పైపులైన్‌ పనులు ఇతరత్రా పనులు చేసేలా నిధులు కేటాయించారు. రెండేళ్ల నుంచి ఈ పనులన్నీ టెండర్ల దశలోనే ఉండిపోయాయి. ప్రస్తుతం మూడోసారి టెండర్లు పిలిచేందుకు చూస్తున్నారు.

* ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, మిగతా రూ.30 వేలు ఉపాధి హామీ పథకంలో వేతనాల రూపంలో బిల్లులిస్తున్నారు.


వాయిదా పడింది..
- పరశురామ్‌, పథక సంచాలకుడు, జిల్లా గృహనిర్మాణశాఖ

ఈ నెల 22న చేయాల్సిన గృహప్రవేశాలు వాయిదాపడ్డాయి. ఇచ్చిన లక్ష్యాలను పూర్తిచేసేందుకు అంతా కలిసి కృషిచేస్తున్నాం. నిర్మాణాలకు అవసరమైన సామగ్రి కూడా సిద్ధం చేశాం. జిల్లాలో ప్రస్తుతం రూఫ్‌ లెవెల్‌ దశలో 1,791 ఇళ్లు ఉన్నాయి. వీటిని పూర్తిచేసేందుకు కొన్ని పనులు చేపడితే సరిపోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని