logo

తెలుగుతమ్ముళ్ల విజయోత్సాహం

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌ నిర్వహించిన క్యాంపు రాజకీయాలను వైకాపా నాయకులే ఛీ కొట్టారని కాకినాడ జిల్లా తెదేపా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ అన్నారు.

Updated : 24 Mar 2023 05:23 IST

గండేపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నినాదాలు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌ నిర్వహించిన క్యాంపు రాజకీయాలను వైకాపా నాయకులే ఛీ కొట్టారని కాకినాడ జిల్లా తెదేపా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ అన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలుపొందడం గొప్ప విషయం అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నడూలేని విధంగా క్యాంపు రాజకీయాలకు తెరతీశారన్నారు. తాము ఎటువంటి ప్రలోభాలు, క్యాంపు రాజకీయాలు చేయలేదన్నారు. శాసన మండలి తమకు అవసరం లేదని అసెంబ్లీలో బిల్లు పెట్టి, ఇప్పుడు అదే ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపారంటూ జగన్‌ను విమర్శించారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తగిన బుద్ధి చెప్పారన్నారు. మొన్న గ్రాడ్యుయేట్లు బైబై జగన్‌ అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు తరిమి కొట్టారన్నారు. సామర్లకోట: ఎమ్మెల్యేల కోటాలో పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో సామర్లకోటలో తెదేపా పట్టణ అధ్యక్షుడు అడబాల కుమారస్వామి ఆధ్వర్యంలో స్థానిక మఠం సెంటర్‌లో భారీఎత్తున సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చారు. తీన్‌మార్‌ డప్పులతో నృత్యాలు చేశారు. నాయకులు బడుగు శ్రీకాంత్‌, కంటే జగదీస్‌మోహన్‌, యార్లగడ్డ రవిచద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

* జగ్గంపేట, తుని, ప్రత్తిపాడు తదితర నియోజకవర్గాల్లో తెదేపా శ్రేణులు సంబరాలు చేశాయి.


ఎమ్మెల్సీ విజయంతో నూతనోత్తేజం

కొవ్వూరులో కేకు కోస్తున్న ద్విసభ్య కమిటీ సభ్యుడు సుబ్బరాయచౌదరి, నాయకులు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: రాబోయే ఎన్నికల్లో తెదేపా విజయం తథ్యమని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చిందని ఆ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించిన నేపథ్యంలో నియోజకవర్గ కార్యాలయంలో గురువారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. కేక్‌ కోసి, మిఠాయిలు పంచారు. బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ పట్టణాధ్యక్షుడు దాయన రామకృష్ణ, మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగుతమ్ముళ్ల విజయోత్సాహం

మామిడికుదురులో మాజీ మంత్రి గొల్లపల్లి, తెదేపా నాయకులు

మామిడికుదురు, న్యూస్‌టుడే: పట్టభద్రుల ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా సాధించిన ఘన విజయాలతో వైకాపా పాలనపై అందరిలోనూ ఉన్న తీవ్ర వ్యతిరేకత స్పష్టమైందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. వైకాపా ఎమ్మెల్యేలకే ఆ పాలనపై నమ్మకం పోయిందన్న విషయం తేటతెల్లమవుతోందన్నారు. ఎమ్మెల్సీగా అనురాధ విజయం పట్ల మామిడికుదురులోని 216 జాతీయ రహదారి కూడలిలో గురువారం రాత్రి జరిగిన హర్షాతిరేకాల్లో ఆయన పాల్గొన్నారు. బాణసంచాతో సందడి చేశారు. అందరికీ మిఠాయిలు పంచారు. తెదేపా మండల అధ్యక్షుడు మొల్లేటి శ్రీనివాస్‌, నాయకులు ఈలి శ్రీనివాస్‌, బోనం బాబు, చుట్టుగుల్ల కిషోర్‌, జాలెం సుబ్బారావు, సుందరనీడి చిన్ని, తదితరులు పాల్గొన్నారు.

అమలాపురం పట్టణం: వైకాపా దుర్మార్గ పాలన త్వరలో కనుమరుగవుతుందని, వచ్చే ఎన్నికల్లో తెదేపా ఘనవిజయం సాధిస్తుందని అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఆనందరావు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయంతో అమలాపురం గడియారస్తంభం కూడలి వద్ద తెదేపా నాయకులు గురువారం రాత్రి హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేశారు. మిఠాయిలు పంచారు. డి.సత్తిబాబురాజు, అల్లాడ సోంబాబు, కౌన్సిలర్‌ బొర్రా వెంకటేశ్వరరావు, జిల్లా మహిళాధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, వలవల శివరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని