logo

మహిళా సంఘాల అభ్యున్నతికి యాప్‌

మహిళల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. మహిళా సంఘాలను ఏర్పాటుచేసి వారంతా ఆర్థికంగా నిలదొక్కుకునేలా భరోసా కల్పిస్తున్నాయి.

Published : 24 Mar 2023 04:36 IST

అమలాపురంలో సమావేశానికి హాజరైన మహిళా సంఘాల సభ్యులు

న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

మహిళల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. మహిళా సంఘాలను ఏర్పాటుచేసి వారంతా ఆర్థికంగా నిలదొక్కుకునేలా భరోసా కల్పిస్తున్నాయి. ముఖ్యంగా సంఘాల్లోని మహిళలకు చేయూత, స్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా పలు రుణాలు అందించడమేకాకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పొదుపు సంఘాల సభ్యుల ప్రగతిని ఆరా తీసేందుకు లఖ్‌పతి దీదీ యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌లో మహిళా సంఘాల ప్రగతి ఏ విధంగా ఉంది.? లక్ష్యాలు ఏ మేరకు చేరారనే అంశాలను నమోదు చేస్తున్నారు. ఈ వివరాల ఫలితాలను ఆధారంగా చేసుకుని భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించే పనుల్లో నిమగ్నమయ్యారు.


అంచనా వేసే పనిలో కేంద్రం

మహిళా సంఘాల ప్రస్తుత పరిస్థితులను కేంద్రం అంచనా వేసేందుకు ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. జాతీయ జీవనోపాధుల మిషన్‌(ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) ఆధ్వర్యంలో యాప్‌ రూపొందించడంతో వివరాలన్నీ నమోదు చేస్తున్నారు. ఈ యాప్‌లో నమోదుచేసిన వివరాల ప్రకారం ఆయా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదగాలంటే భవిష్యత్తులో ఎలాంటి పథకాలు అమలు చేయాలనే అంశంపైనా దృష్టి సారించనున్నారు.


పొదుపు సంఘాల ప్రగతిపై ఆరా..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 1090 గ్రామ సమాఖ్యలున్నాయి. వీటి పరిధిలో 38,455 సంఘాలు ఉండగా.. 3,98,970 మంది సభ్యులుగా ఉన్నారు. వీరికి సంబంధించిన వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. పొదుపు సంఘంలో చేరకముందు వారి పరిస్థితి ఏంటి, చేరాక ఆర్థిక స్థితి ఏ విధంగా ఉందనే అంశాలపై క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నిసార్లు బ్యాంకు లింకేజీ రుణాలు తీసుకున్నారు. రుణ వాయిదాల చెల్లింపులు సక్రమంగా చేస్తున్నారా.. లేదా.. తదితర అంశాలను యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. వీటితోపాటు ఏదైనా యూనిట్లు నెలకొల్పితే ఎంత పెట్టుబడితో ప్రారంభించారు. ఆదాయం ఎలాఉందనేది తెలుసుకుంటున్నారు.


నమోదు చేస్తున్నారు..

లఖ్‌పతి దీదీ యాప్‌లో మహిళా సంఘాల సభ్యుల వివరాలు, ప్రగతిని ఏ విధంగా నమోదుచేయాలో వీవోఏలకు అవగాహన కల్పించాం. క్షేత్రస్థాయిలో యాప్‌లో పేర్కొన్న అంశాలను పరిశీలించి వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ వివరాల నమోదుతో సంఘాలు ఆర్థిక పరిస్థితి తెలుసుకునేందుకు అవకాశం ఉండటంతోపాటు అవి మరింత మెరుగుపడనున్నాయి.

వి.శివశంకరప్రసాద్‌, డీఆర్‌డీఏ పీడీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని