logo

1 నుంచి రబీ ధాన్యం కొనుగోలు

ప్రస్తుత రబీ సీజన్‌లో జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని వచ్చే నెల 1 నుంచి కొనుగోలు చేసేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని, దీనికి సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌(జేసీ) తేజ్‌భరత్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published : 28 Mar 2023 05:35 IST

అధికారులతో సమీక్షిస్తున్న జేసీ తేజ్‌భరత్‌

వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం): ప్రస్తుత రబీ సీజన్‌లో జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని వచ్చే నెల 1 నుంచి కొనుగోలు చేసేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని, దీనికి సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌(జేసీ) తేజ్‌భరత్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ నుంచి దూరదృశ్య సమావేశం ద్వారా ధాన్యం సేకరణ కార్యాచరణ, పదోతరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు, వేసవిలో తాగునీటి సరఫరా సమస్యలు తదితర అంశాలపై జిల్లా, డివిజన్‌, మండలస్థాయి అధికారులతో చర్చించారు. జిల్లాలో ముందుగా కోతలు జరిగే అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, చాగల్లు, తాళ్లపూడి తదితర మండలాల్లో సమన్వయ అధికారులు షెడ్యూల్‌ ప్రకారం రోజువారీ ఎంత ధాన్యం వస్తుందనే అంచనాతో ఉండాలన్నారు. జిల్లాకు 70 లక్షల గోనెసంచులు అవసరమవుతాయని, ఏ మండలానికి ఎన్ని అవసరమో అన్ని సంచులను ముందుగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుత రబీ సీజన్‌లో 4,55,845 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. 18 మండలాల పరిధిలోని 233 ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 147 మిల్లులకు అనుసంధానం చేశామన్నారు. ఆయా కేంద్రాలకు నియమించిన సాంకేతిక సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ యంత్రసేవా పథకం లక్ష్యాలను కూడా వేగవంతం చేయాలన్నారు.


తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి

వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ అమలు చేయాలని అధికారులను జేసీ ఆదేశించారు. ఏ గ్రామంలో అయినా చెరువులు, బోరుపంపులు మరమ్మతు చేయించకుంటే యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. పశువులకు తాగునీటి కోసం ఏర్పాట్లు చేయాలని, పశువుల కోసం గుర్తించిన 128 తాగునీటి ప్రదేశాల్లో తక్షణం మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఈసారి వడగాడ్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున దాతల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.


పదోతరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష

వచ్చే నెల 3 నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షల ఏర్పాట్లపై జేసీ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఫర్నీచర్‌, ఫ్యాన్లు, విద్యుత్తు దీపాలు, తాగునీరు వంటి సౌకర్యాలు ఉండేలా చూడాలని ఆదేశించారు.


బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి

ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బంది బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరిగా వేయాలని జేసీ ఆదేశించారు. సచివాలయాల్లో పౌరసేవలు కూడా పెంచాలన్నారు. ప్రతి సచివాలయంలో రోజూ 20 రకాల సేవలు ప్రజలకు అందించాలన్నారు. భూమి రీసర్వేకు సంబంధించి ఫేజ్‌-2లో చేపట్టిన సర్వే పనులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను
ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని