logo

మడమ తిప్పుడెందుకో!

పేదలకు ఇళ్ల స్థలాల పేరిట కాకినాడ శివారు దుమ్ములపేట వద్ద మడ అడవుల ధ్వంసం కేసులో యంత్రాంగం దాగుడు మూతలు ఆడుతోంది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆగ్రహానికి గురైన తర్వాత ఈ అంశంలో తెగ గోప్యత పాటిస్తోంది.

Published : 31 May 2023 04:57 IST

ఎన్జీటీ బృందం వచ్చి వెళ్లినా యంత్రాంగం గోప్యమే

మడ ప్రాంతంలో మ్యాప్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కృతికాశుక్లా, అధికారులు (పాత చిత్రం)

ఈనాడు, కాకినాడ: పేదలకు ఇళ్ల స్థలాల పేరిట కాకినాడ శివారు దుమ్ములపేట వద్ద మడ అడవుల ధ్వంసం కేసులో యంత్రాంగం దాగుడు మూతలు ఆడుతోంది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆగ్రహానికి గురైన తర్వాత ఈ అంశంలో తెగ గోప్యత పాటిస్తోంది. ఎన్జీటీ సంయుక్త కమిటీ బృందం మడ ధ్వంసం చేసిన ప్రాంతాన్ని రెండు రోజులు పరిశీలించి.. సమీక్షించినా విషయం పొక్కనీయలేదు.  

ఇళ్ల స్థలాలకంటూ మడను దెబ్బతీయడంతో విశాఖకు చెందిన పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ, రాజమహేంద్రవరానికి చెందిన డి.పాల్‌.. ఎన్జీటీని వేర్వేరుగా ఆశ్రయించారు. మధ్యంతర పరిహారం కింద ప్రభుత్వం రూ.5 కోట్లు చెల్లించాలని.. మడ ధ్వంసం చేసిన 58 ఎకరాల్లో నిపుణుల కమిటీ ప్రణాళిక రూపొందించాలని ఎన్జీటీ గత నవంబరులో సూచించింది. సొమ్ము జమైన మూడు నెలల్లో పర్యావరణ పునరుద్ధరణ ప్రారంభించాలని ఆదేశించింది. పరిహారాన్ని ఏపీ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీకి జమచేసినా..  పోర్టు, ఎన్‌హెచ్‌ఏఐ, ఇతర శాఖల భాగస్వామ్యంతో పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదు. కాకినాడ కార్పొరేషన్‌ పూర్వ కమిషనర్‌ హయాంలో.. మడ ప్రాంతంలో మెరకను తొలగించకుండా పైపైన మొక్కలు నాటి ట్యాంకర్లతో నీరు చిమ్మడంపై ఆక్షేపణ వ్యక్తమైంది. దీనిని ఎన్జీటీ తప్పుపట్టగా.. అది ట్రయల్‌ రన్‌ అని.. నిపుణుల కమిటీ నివేదిక అందిన తర్వాత పునరుద్ధరణ చేపడతామని తాజాగా పేర్కొన్నారు. మడ ప్రాంతాన్ని ఎన్జీటీ నియమించిన ఆరుగురు నిపుణుల కమిటీ ఈనెల 24, 25 తేదీల్లో పరిశీలించింది. అన్ని అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. 58 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత పరిస్థితి.. భవిష్యత్తులో చేపట్టాల్సిన పునరుద్ధరణ పనులపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వారు మరోసారి పర్యటించే అవకాశాలు ఉన్నాయి. నిపుణుల బృందం వచ్చిన తర్వాత ఈనెల 27న కలెక్టర్‌ కృతికా శుక్లా ఎన్జీటీకి చిత్రాలతో కూడిన నివేదిక అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని