logo

పరదాలు అడ్డుపెట్టి.. వేడికి మస్కా కొట్టి..

ఎండకు బయటకెళ్లలేక.. వేడికి ఇంట్లో  ఉండలేక చెమటలు కక్కుతున్నారు. ఉపశమనానికి గదుల్లో ఏసీలు బిగించుకునే స్థోమత అందరికీ ఉండదు.

Updated : 01 Jun 2023 05:35 IST

ఎండకు బయటకెళ్లలేక.. వేడికి ఇంట్లో  ఉండలేక చెమటలు కక్కుతున్నారు. ఉపశమనానికి గదుల్లో ఏసీలు బిగించుకునే స్థోమత అందరికీ ఉండదు. తక్కువ ఖర్చుతో.. అసలు ఖర్చే లేకుండా ఇంటిని చల్లగా మార్చేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

 *  వేసవిలో గాలి వస్తుందని కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం చాలా మందికి అలవాటు. గాలితో పాటు వేడి సైతం ఇంట్లోకి వస్తుంది. మొదటగా వేడికి అడ్డుకట్ట వేయాలి. కిటికీలు, తలుపులకు పరదాలు వేయాలి. కిటికీల వద్ద ఉన్న బ్లైండ్స్‌లను మూయాలి. ప్రత్యేకించి ఉత్తరం, పశ్చిమ వైపు ఉన్న కిటికీల నుంచి వేడి రాకుండా ముదురు రంగు పరదాలతో మూయాలి. వెలుతురు తగ్గితే లైట్లు వేసుకోవచ్చు. దీంతో చాలావరకు వేడి తగ్గిపోతుంది.

 *   కిటికీల్లో పూలు, అలంకరణ మొక్కలను పెంచుకోవడం ద్వారా వేడి నేరుగా ఇంట్లోకి రాకుండా జాగ్రత్తపడొచ్చు. మేడపైన తోట పెంచుకోవడం ద్వారా గ్రీన్‌రూఫ్‌గా మార్చుకోవచ్చు.

 * అపార్ట్‌మెంట్‌ బాల్కనీల్లో ప్రస్తుతం స్లైడ్‌ డోర్లు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ బాల్కనీల్లోంచి నేరుగా ఎండ, వేడి గాలి లోపలికి రాకుండా సమ్మర్‌ షేడ్‌ మ్యాట్‌లను ఉపయోగించవచ్చు. ప్రస్తుతం వెదురుతో సహా రకరకాల సామగ్రితో అందంగా తయారు చేసిన చాపలు దొరుకుతున్నాయి. ఇవి చాలావరకు వేడిని అడ్డుకుంటాయి. ఈ చాపలను నీటితో తడిపితే చల్లని గాలి లోపలికి వస్తుంది. సైడ్‌డోర్లు మూయాల్సిన పని ఉండదు. వేసవిలోనే కాదు వర్షాకాలంలో వాననీరు లోపలికి రాకుండా ఉపయోగపడుతుంది. ఇవేవి లేకపోయినా.. ఇంట్లో పాతబెడ్‌షీట్‌ను సైతం అడ్డుగా వేసుకోవచ్చు.  

 * వేసవిలో ఇంట్లో ఫ్యాన్లు 24 గంటలూ తిరుగుతుంటాయి. ఎక్కువ వేగంతో తిరిగితే మరింత వేడి గాలే వస్తుంది. అందుకే కావాల్సిన వేగంతో పెట్టుకోవాలి. మధ్యమధ్యలో ఆపి తిరిగి వేసుకోవాలి.

 *  సాయంత్రం ఉష్ణోగ్రతలు తగ్గగానే కిటికీలు, తలుపులు తెరవడం ద్వారా బయటి నుంచి చల్లనిగాలి ఇంట్లోకి వస్తుంది. ఈ సమయంలో ఇంట్లో ఉక్కపోత ఎక్కువ కాబట్టి గంటసేపు ఆరుబయట గడపడం మేలు.

 *  మేడపైన చల్లదనానికి కూల్‌ పెయింట్స్‌ వేసుకోవచ్చు.

 *  తెలుపు రంగు ఎల్‌ఈడీలు మేలు. వానాకాలం, శీతాకాలంలో వామ్‌ వైట్‌ లైటింగ్‌ను వినియోగించుకోవచ్చు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని