logo

రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కళకళ

జిల్లాలోని రిజిస్ట్రార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు బుధవారం కళకళలాడాయి. సోమ, మంగళవారాల్లో సాంకేతిక కారణాలతో పలుచోట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో క్రయవిక్రయ లావాదేవీల నమోదుకు వచ్చిన పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated : 01 Jun 2023 05:48 IST

కాకినాడలో 170కి పైగా నమోదు

రాత్రి వరకూ కొనసాగిన కార్యకలాపాలు

ఆన్‌లైన్‌లో ఈకేవైసీ చేయించుకుంటూ..

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని రిజిస్ట్రార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు బుధవారం కళకళలాడాయి. సోమ, మంగళవారాల్లో సాంకేతిక కారణాలతో పలుచోట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో క్రయవిక్రయ లావాదేవీల నమోదుకు వచ్చిన పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారిక సమాచారం ప్రకారం గురువారం నుంచి భూములు, ఆస్తుల విలువలు భారీగా పెరగనున్నాయి. ఈనేపధ్యంలో ధరలు పెరగడానికి ముందే క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునేందుకు కొనుగోలు, అమ్మకందారులు తరలివచ్చారు.

వారిదే హవా..

రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు భారీగా తరలిరావడంతో పలువురు ప్రైవేట్‌ వ్యక్తులు, లేఖర్లు తమ క్లయింట్ల కోసం కార్యాలయంలో పడిగాపులు కాశారు. కొందరు లేఖర్లు వ్యక్తిగత పనులు పూర్తి చేయించుకున్నారు. కాకినాడ జిల్లాలోని తొమ్మిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఉదయం నుంచి రాత్రి వరకూ సందోహం కొనసాగింది. జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయ ప్రాంగణంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ 1, 2 కార్యాలయాల్లో బుధవారం ఒక్క రోజే 170కి పైగా లావాదేవీలకు అధికారిక ముద్ర వేశారు. వీటిలో ఎక్కువగా సెటిల్‌మెంట్‌ దస్తావేజులు ఉండటం విశేషం. గురువారం నుంచి భూముల ధరలు పెరగనుండటంతో అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు, తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు రాతపోతలు చేశారు. ఈకేవైసీ చేసే కంప్యూటర్‌ వద్ద సైతం ఎక్కువ మంది నిరీక్షించారు.

భూముల ధరలు పెంచుతూ..

గురువారం నుంచి ప్రభుత్వపరంగా భూముల ధరల పెరగనున్నాయి. నగర పరిధిలో ముప్పై నుంచి అరవై శాతం వరకూ ఆయా ప్రాంతాల్లో ధరలు పెరుగుతాయని, కాకినాడ గ్రామీణ పరిధిలోని పలు గ్రామాల్లో 70 శాతం వరకూ ధరలు పెరుగుతాయని సమాచారం. కాకినాడ సమీపంలోని మేడలైన్‌ ప్రాంతంలో ఇటీవల కాలంలో కొనుగోలు, అమ్మకాలు జోరుగా సాగుతుండటం, అక్కడ స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడటంతో భూముల ధరలు 90 శాతం వరకూ పెంచినట్లు తెలిసింది. పెరగనున్న ధరలను కార్యాలయ అధికారి సురేష్‌ కంప్యూటర్‌లో ఎక్కించే పనిలో పడ్డారు. ఈ ధరల అమలును మరో రెండు మూడు రోజుల పాటు వాయిదావేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై బుధవారం అర్ధరాత్రిలోగా అధికారులు ఒక కొలిక్కివచ్చి నిర్ణయించే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు