logo

అందని నీటి తడి.. ఆక్రమణలతో సరి

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు పది లక్షల ఎకరాలకు సాగునీరందించే గోదావరి డ్రెయిన్లు ఆక్రమణల కోరల్లో చిక్కుకుంటున్నాయి.

Published : 02 Jun 2023 04:54 IST

ఖరీఫ్‌లోనూ రైతన్నకు తప్పని అవస్థ
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, ముమ్మిడివరం, ఆత్రేయపురం

ఆత్రేయపురం మీడియం డ్రెయిన్‌కు ఆనుకుని నిర్మాణాలు

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు పది లక్షల ఎకరాలకు సాగునీరందించే గోదావరి డ్రెయిన్లు ఆక్రమణల కోరల్లో చిక్కుకుంటున్నాయి. భారీ వర్షాలు కురిసినా, వరదలు వచ్చినా సజావుగా నీటి ప్రవాహం సాగక రైతులు ముంపు సమస్య ఎదుర్కొంటున్నారు. జలాల లభ్యత తక్కువ ఉన్న సమయాల్లోనూ గ్రావిటీ స్థాయిలో వెళ్లేందుకు అవకాశం లేక పొలాలకు నీటి తడులు అందని పరిస్థితి. కాలువల ఆక్రమణలను గతంలో అధికారులు గుర్తించినా తొలగింపునకు రాజకీయ అడ్డంకులు ఎదురవడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి.

నాలుగు వేలకు పైగా గుర్తించినా...

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1,047 ప్రధాన, మధ్య, చిన్న తరహా రెవెన్యూ డ్రెయిన్లు 2,826 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. నీటి పారుదల కాలువలు, స్థలాలు ఆక్రమణ చెరలో చిక్కుకుపోతున్నాయి. గట్లపై ఏకంగా నిర్మాణాలు, దుకాణాలు, పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. గతంలో ఆక్రమణలపై అధికారులు సర్వే చేయగా నాలుగు వేలకు పైగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించి.. కొన్నిచోట్ల నోటీసులు కూడా ఇచ్చారు. తర్వాత వాటి సంగతి మరిచారు.

పి.గన్నవరం మండలం పోతవరంలో చిన్న తరహా మురుగు కాలువపై ఆక్రమణ

రెండు సీజన్లలో పంట విరామం

ముమ్మిడివరం మండలం అయినాపురంలో నక్కల కాలువ కొంతమేర రెవెన్యూ, మరికొంత జల వనరుల శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఈ డ్రెయిన్‌ను ఆక్రమించుకుని పక్కా భవనాలు నిర్మించారు. ఇరుమండ డ్రెయిన్‌ పరిస్థితి అంతే. అయినాపురంలో ఈ డ్రెయిన్‌ను ఆక్రమించుకుని కొబ్బరి తోట సాగు చేస్తున్నారు. ఇలా చాలాచోట్ల డ్రెయిన్ల వెంబడి భారీగా ఆక్రమణలున్నాయి. ముంపు సమస్యతో ఇక్కడి రైతులు 2021, 2022 ఖరీఫ్‌ సీజన్లలో పంట విరామం ప్రకటించి సాగుకు స్వస్తి పలికారు.

నాలుగేళ్లుగా తట్టమట్టి తీయలేదు..

డ్రెయిన్ల ఆధునికీకరణకు ఏటా నిధులు కేటాయిస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. నాలుగేళ్ల నుంచి ఇప్పటి వరకు ఒక్క మురుగు కాలువలోనూ మట్టి తీయని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఆక్రమణలు. ఏదైనా డ్రెయిన్‌కు సంబంధించి పొడవు, వెడల్పు వంటి కొలతలు డ్రెయిన్స్‌, రెవెన్యూ రికార్డుల్లో పక్కాగా ఉన్నాయి. వీటి ఆధారంగా డ్రెయిన్ల తవ్వకాలు చేపడితే ఎంతమేరకు ఆక్రమణలకు గురయ్యాయో తెలుస్తుంది.

శివారుకు ఏటా కష్టాలే

* బొబ్బర్లంక ప్రధాన కాలువ చెంతన వెలిచేరు వద్ద 30 సెంట్ల కాలువ గట్టును ఆక్రమించి హోటల్‌ నిర్మించారు. నిబంధనలతో ప్రమేయం లేకుండా అధికారులు విద్యుత్తు కనెక్షన్‌ ఇచ్చారు. ః నిబంధనల ప్రకారం పంట కాలువ సమీపంలో చేపల చెరువులు ఉండకూడదు. ఇక్కడ మాత్రం పంట కాలువ భూములను ఆక్రమించి రొయ్యల సాగు చేస్తున్నారు. అధికారులకు పట్టుబడిన సమయంలో చెరువులోని కలుషిత నీరు కాలువల్లోకి విడిచిపెడుతున్నారు. అవసరమైన సందర్భాల్లో నిబంధనలకు విరుద్ధంగా మోటార్లతో కాలువల్లోని సాగు నీటితో చెరువులు నింపేస్తున్నారు. * గన్నవరం కుడి కాలువ గట్టుపై పశువుల పాకలు, విశ్రాంత మందిరాలు నిర్మించారు. ఆత్రేయపురం మధ్యతరహా డ్రెయిన్‌ వెంబడి అనేక అక్రమ కట్టడాలు వెలిశాయి. * రావులపాలెం మండలంలో ముక్తేశ్వరం కాలువ గట్టు ఊబలంక, అమలాపురం రహదారి వరకు కాలువ గట్లు పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయి. * ముమ్మిడివరం మండలం కొమానపల్లి-గాడిలంక డ్రెయిన్‌ చాలాచోట్ల ఆక్రమణల చెరలో ఉంది. * ఐ.పోలవరం మండలం కేశనకుర్రులోని పెరుమాళ్లరాజుకోడు గట్టుపై పక్కా నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ ఆక్వా చెరువుల్లోని పూడికను డ్రెయిన్‌లోకి డ్రెడ్జింగ్‌ చేయడంతో కాలువ పరిధిలోని భూములు ముంపునకు గురై రైతులు నష్టపోతున్నారు.

వెలిచేరు వద్ద మధ్య డెల్టా ప్రధాన కాలువలో బోరు

అస్తవ్యస్తంగా  స్లూయిజ్‌లు

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ గోదావరి ఫ్లడ్‌ బ్యాంకులపై ఉన్న అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లు మురుగు దిగడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. వీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో తుప్పుపట్టడం.. పని చేయకపోవడం వంటి పరిస్థితుల్లో ముంపు నీరు దిగడం లేదు. గోదావరి వరదల సమయం, సముద్ర ఆటు పోట్లుకు నీరు ఎగువకు వచ్చి వరి చేలను ముంచెత్తుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటి ఆధునికీకరణ కీలకం.చర్యలు చేపడతాం...
ఇటీవల కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో కాలువ గట్లపై నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించగా అడ్డుకున్నాం. ఇతర చోట్ల జరిగిన అక్రమణలకు సంబంధించి స్థానిక పంచాయతీ, రెవెన్యూ, పోలీసుల సహకారంతో చర్యలకు ముందుకెళ్తాం.

శ్రీనివాసరావు, ఎస్‌ఈ, జలవనరుల శాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని