అతీగతీ లేని రవాణా స్మార్ట్‌ కార్డులు

రవాణా శాఖలో వాహనాల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(ఆర్సీ), డ్రైవింగ్‌ లైసెన్సు(డీఎల్‌), స్మార్ట్‌ కార్డుల జారీలో ఎడతెగని జాప్యం కనిపిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా కార్డుల ముద్రణ, జారీ ప్రక్రియ పునరుద్ధరించలేదు.

Updated : 04 Jun 2023 05:53 IST

రాజమహేంద్రవరంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం): రవాణా శాఖలో వాహనాల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(ఆర్సీ), డ్రైవింగ్‌ లైసెన్సు(డీఎల్‌), స్మార్ట్‌ కార్డుల జారీలో ఎడతెగని జాప్యం కనిపిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా కార్డుల ముద్రణ, జారీ ప్రక్రియ పునరుద్ధరించలేదు. కార్డుకు రూ.200 చొప్పున చోదకుల నుంచి ముందుగానే వసూలు చేస్తున్న రవాణా శాఖ, వీటి జారీకి చొరవ చూపడంలేదు. ఎప్పటికప్పుడు తయారీ సామగ్రి సరఫరా కాక ముద్రణ నిలిపేయడంతో సమస్య మొదటికొస్తోందని అధికారులు చెబుతున్నారు. ఒరిజినల్‌ ఆర్‌సీ, డీఎల్‌ కార్డులు ఎప్పటి నుంచి ఇవ్వగలుగుతారనేది మాత్రం చెప్పడం లేదు. రవాణా సేవలు నిరుడు మే నుంచి కొత్త పోర్టల్‌లోకి మారినా పరిస్థితిలో మార్పులేదు. చిప్‌తో కూడిన స్మార్ట్‌కార్డుల బదులు క్యూఆర్‌ కోడ్‌తో పీవీసీ ప్లాస్టిక్‌ కార్డులు ఇవ్వాలని ఇటీవల రవాణా శాఖ అధికారులు నిర్ణయించినా కార్యరూపం దాల్చలేదు. వేలాది మంది వాహనచోదకులు వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న తాత్కాలిక పత్రాలతో నెట్టుకొస్తున్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడి కార్యాలయం ప్రాంతీయం నుంచి జిల్లా స్థాయికి మారింది. 19 మండలాల పరిధిలోని వాహనచోదకులకు జారీ చేయాల్సిన ఆర్సీ, డీఆర్‌ కార్డులు ఇంకా 25 వేల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో ఏపీ ఈ-ప్రగతి పోర్టల్‌ ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, డ్రైవింగ్‌ లెసెన్సుల జారీ ప్రక్రియ జరిగేది. రవాణా సేవలన్నీ నిరుటి నుంచి కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్వహించే వాహన్‌, సారథి పోర్టల్‌లోకి మారాయి. ఆ ఏడాది మే 20 నుంచి వాహన్‌ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు, జూన్‌ 16 నుంచి సారథి పోర్టల్‌ ద్వారా డ్రైవింగ్‌ లైసెన్సు సేవలు ప్రారంభించారు. ఇంతవరకు 25 వేల ఒరిజనల్‌ కార్డుల ముద్రణ జరగాల్సి ఉంది. కొత్త పోర్టల్‌కు సాఫ్ట్‌వేర్‌ పూర్తిగా అభివృద్ధి చేయకపోవడమే సమస్యగా చెబుతున్నారు. స్మార్ట్‌ కార్డు చిప్‌లోని వివరాలు రీడ్‌ చేసే యంత్రాలు పోలీసు, రవాణా అధికారుల వద్ద లేకపోవడంతో క్యూఆర్‌ కోడ్‌తో కూడిన పీవీసీ ప్లాస్టిక్‌ కార్డులు ప్రవేశపెట్టాలని రవాణా శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు యోచించారు. వారి నిర్ణయం కూడా కార్యరూపం దాల్చలేదు. స్మార్ట్‌ కార్డులు, పీవీసీ కార్డులలో వేటిని జారీ చేయాలో అధికారులకు స్పష్టత లేదు. తాత్కాలిక పత్రాల వల్ల కొన్నిసార్లు పోలీసులతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు చోదకులు చెబుతున్నారు.

కార్డుల ముద్రణ యంత్రం

డీటీవో ఏమంటున్నారు?

ఒరిజనల్‌ కార్డులు వచ్చేవరకు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రాలు చెల్లుబాటు అవుతాయని, ఇవి దగ్గర పెట్టుకుని వాహనాలపై తిరిగినా పోలీసు, రవాణా సిబ్బంది ఎవరూ అభ్యంతరం తెలపరని జిల్లా రవాణాధికారి(డీటీవో) కృష్ణారావు అంటున్నారు. ఆర్సీ, డీఎల్‌ కార్డుల ముద్రణ, జారీకి సంబంధించి సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు. నేరుగా తపాలా ద్వారా చోదకుల ఇంటి చిరునామాకే ఒరిజనల్‌ కార్డులు పంపిస్తామని ఆయన చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని