logo

నాడు ఎక్కడో.. నేడు అక్కడే

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, సకల సౌకర్యాలు కల్పించి కార్పొరేట్‌ విద్యాలయాలకు తీసిపోని రీతిలో తీర్చిదిద్దుతామని సర్కారు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.

Updated : 09 Jun 2023 06:58 IST

పాఠశాలల్లో అసంపూర్తి పనులు
కొద్దిరోజుల్లో మోగనున్న బడి గంట
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, వెంకట్‌నగర్‌, పిఠాపురం

సాలిపేట బాలికోన్నత పాఠశాలలో అసంపూర్తి పనులు

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, సకల సౌకర్యాలు కల్పించి కార్పొరేట్‌ విద్యాలయాలకు తీసిపోని రీతిలో తీర్చిదిద్దుతామని సర్కారు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో విడత నాడు-నేడు పనులకు సంబంధించిన నిధులు తొలినాళ్లలో సకాలంలో అందలేదు. గతేడాది ఆగస్టులో జమ కావాల్సినవి ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో విడుదలయ్యాయి. పనులు ప్రారంభించేందుకు ప్రధానోపాధ్యాయులు సిద్ధమవగా ప్రభుత్వ గోదాముల్లో సిమెంటు నిల్వలు లేక ఇంజినీరింగ్‌ అధికారులు చేతులెత్తేశారు. మొదటి విడత నాడు-నేడులో మంజూరై పాఠశాలల్లో మిగిలిన సిమెంటు వినియోగించుకోవాలని ఉచిత సలహాలిచ్చినా.. అది గడ్డ కట్టుకుపోయి నిరుపయోగంగా ఉంది. ఏప్రిల్‌ చివరి వారంలో సిమెంటు సరఫరా చేయడంతో పనులు ప్రారంభమైనా.. ఇతర నిర్మాణ సామగ్రి మాత్రం సరఫరా కాలేదు.

నమోదు చేసినా రాలేదు

నిర్మాణ సామగ్రి కొనుగోలు చేసే వెసులుబాటు హెచ్‌ఎంలకు ఇవ్వలేదు. చలువ రాతి పలకలు (టైల్స్‌), విద్యుత్తు సామగ్రి, గృహోపకరణాలు (బల్బులు, పంకాలు), శానిటరీ సామగ్రికి నాడు-నేడు యాప్‌లో ఇండెంట్‌ పంపాలి. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన 14 రోజుల్లో సామగ్రి అందిస్తామని అధికారులు చెప్పారు. నెలలు గడుస్తున్నా అవి చేరకపోవడంతో పనులు నిలిచిపోయాయని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు.

సరిపడా గదులు  లేక

* కాకినాడ జిల్లాలో తొలుత 1,700 అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని అనుకున్నా తరువాత ఆ సంఖ్య 1,200కు పరిమితం చేశారు.

* కాకినాడ సాలిపేట బాలికోన్నత పాఠశాలలో సుమారు 1,500 మంది విద్యార్థులున్నారు. అవసరమైన మేర గదులు లేక కొన్ని తరగతులు ఉదయం, మరికొందరికి మధ్యాహ్నం నిర్వహించే పరిస్థితి ఉండేది. స్మార్ట్‌సిటీ నిధులతో గతేడాది నాలుగు గదులు నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న రీత్యా అదనపు తరగతి గదుల నిర్మాణానికి నాడు-నేడు రెండో విడతలో గుర్తించి పనులు చేపట్టగా అవి నత్తనడకన సాగుతున్నాయి.

కొత్తపల్లి మండలం వాకతిప్పలో అసంపూర్తిగా..

కాకినాడ జిల్లాలో..

* పిఠాపురం నియోజకవర్గం పరిధిలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. 56 పనులకు రూ.20.12 కోట్లు మంజూరవగా, రూ.10 కోట్ల విలువైనవి జరిగాయి. ఏ పాఠశాలలోనూ పూర్తిస్థాయిలో జరగలేదు.

* గొల్లప్రోలులో రెండో దశ నాడు-నేడు కింద రూ. 4.04 కోట్లు మంజూరైతే రూ.3.22 కోట్ల పనులు జరిగాయి.

* కొత్తపల్లిలో 36 పనులకుగాను రూ.20.55 కోట్లు మంజూరవగా, రూ.4.46 కోట్లు ఖర్చు చేశారంటే పురోగతి ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు.

* గొల్లప్రోలు జడ్పీ బాలికోన్నత పాఠశాలలో అయిదు అదనపు గదుల నిర్మాణానికి గతయేడాది మార్చి 28న ఎమ్మెల్యే పెండెం దొరబాబు శంకుస్థాపన చేసినా ఇప్పటికీ పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. ఇక్కడ సుమారు 300 మంది చదువుతుండగా.. ఇరుకు గదుల్లో బోధన సాగుతోంది.

గొల్లప్రోలు జడ్పీ బాలకోన్నత పాఠశాలలో పిల్లర్ల దశలో నిలిచిన నిర్మాణం

విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. తరువాత ప్రాధాన్య క్రమంలో అదనపు తరగతి గదులు, రక్షణ గోడల నిర్మాణం చేపడతాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన సామగ్రికి సంబంధించి ఉన్నతాధికారులతో చర్చిస్తాం. స్థానిక సమస్యల వల్ల కొన్నిచోట్ల పనులు ప్రారంభం కాని పరిస్థితిపై డీఈవోలు, ఎంఈవోలతో సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ఏపీసీలు సైతం నిరంతరం పర్యవేక్షించేలా తగిన ఆదేశాలిస్తాం.

నాగమణి, ఆర్‌జేడీ, పాఠశాల విద్య

‘విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి నాడు-నేడు రెండో విడత కింద పాఠశాలల్లో ప్రారంభించిన ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తాం. కార్పొరేట్‌కు మించిన వసతులు కల్పిస్తాం’

ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతీ సందర్భంలో చెప్పే మాట.

‘జూన్‌ 12 కల్లా అన్ని పాఠశాలల పనులు పూర్తిచేయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలకు వెనుకాడేది లేదు’

ఎంఈవోలు, హెచ్‌ఎంలకు రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారుల స్పష్టీకరణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని