logo

ఆరుద్ర నిరవధిక దీక్ష భగ్నం

కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలేనికి చెందిన రాజులపూడి ఆరుద్ర, దివ్యాంగురాలైన ఆమె కుమార్తె సాయిలక్ష్మీచంద్ర నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

Published : 09 Jun 2023 03:40 IST

అర్ధరాత్రి దాటాక ఆసుపత్రికి తరలింపు

కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లిన దివ్యాంగుల జేఏసీ సంఘం నాయకులను అడ్డుకున్న పోలీసులు

కాకినాడ కలెక్టరేట్‌, మసీదు సెంటర్‌, న్యూస్‌టుడే: కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలేనికి చెందిన రాజులపూడి ఆరుద్ర, దివ్యాంగురాలైన ఆమె కుమార్తె సాయిలక్ష్మీచంద్ర నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆస్తి విషయంలో తమను ఇబ్బందులకు గురిచేసిన ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేయాలని, కుమార్తెకు వైద్యం అందించాలని కోరుతూ బుధవారం కాకినాడ ధర్నా చౌక్‌లో దీక్ష ప్రారంభించగా.. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో శిబిరం నుంచి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వారికి మద్దతుగా శిబిరంతో ఉన్న ముగ్గురు దివ్యాంగుల సంఘ ప్రతినిధులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆరుద్ర, ఆమె కుమార్తెను కాకినాడ జీజీహెచ్‌లో ఉంచగా, దివ్యాంగుల సంఘ ప్రతినిధులను గురువారం ఉదయం వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. బుధవారం రాత్రి 7 గంటల నుంచి ఆరుద్ర, ఆమె కుమార్తెను జీజీహెచ్‌కు తరలించడానికి పోలీసులు, వైద్యాధికారులు ప్రయత్నించినా, బ్లేడ్లుతో గొంతుకోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. అర్ధరాత్రి 2.30 గంటలకు పెద్దాపురం డీఎస్పీ కె.లతాకుమారి, కాకినాడ డీఎస్పీ పి.మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంబులెన్స్‌లో పోలీసు బందోబస్తు నడుమ జీజీహెచ్‌కు తరలించారు. ఆరుద్ర, ఆమె కుమార్తెను జీజీహెచ్‌లోని ప్రత్యేక వార్డులో ఉంచి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులు, ఆరుద్ర భర్త, బంధువులు, దివ్యాంగ సంఘ నాయకులు వారిని కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

అధికారులు హామీలను నిలబెట్టుకోలేదు..

మసీదుసెంటర్‌(కాకినాడ): జీజీహెచ్‌లో ఉన్న ఆరుద్ర, సాయిలక్ష్మీచంద్రలను చూసేందుకు వచ్చిన ఏపీ దివ్యాంగ సంఘాల జేఎసీ రాష్ట్ర అధ్యక్షుడు గుణతం చంద్రశేఖర్‌, ఇతర నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ విలేకరులతో మాట్లాడారు. కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉందని ఆరుద్ర సామాజిక మాధ్యమాల్లో ఉంచిన వీడియో చూసి చలించి న్యాయం చేసేందుకు గతనెల 29న కాకినాడ వచ్చి ధర్నాచౌక్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టామన్నారు. అదేరోజు పోలీసు అధికారుల సూచనలతో కలెక్టర్‌, ఎస్పీని కలవగా సాయిలక్ష్మీచంద్రకు ప్రభుత్వం వైద్యం అందిస్తామని, అన్నవరంలోని ఆరుద్ర ఇంటి విషయంలో అడ్డుపడ్డ పోలీసులపై చర్యలు తీసుకుంటామని, అమలాపురంలోని ఆస్తిని అమ్మేందుకు ఇబ్బందులు లేకుండా కలెక్టర్‌ చూస్తామని చెప్పారన్నారు. వారం రోజులు గడిచినా ఆ హామీలపై ఏ విధమైన చర్యలు చేపట్టలేదన్నారు. దీంతో ఈ నెల 7 నుంచి ధర్నాచౌక్‌ వద్ద తిరిగి నిరవధిక దీక్ష చేపట్టామన్నారు. అర్ధరాత్రి 150 మందికిపైగా పోలీసులు టెంట్‌ వద్ద మోహరించి దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించారన్నారు. తెల్లవారుజామున ఆరుద్రకు వైద్యపరీక్షలు చేస్తుండగా వీధి లైట్లు ఆపేసి ఒక్కసారిగా వచ్చి ఆరుద్ర, ఆమె కుమార్తెతో పాటు దివ్యాంగులను చొక్కాలు పట్టుకుని వ్యాన్‌లో వేసి తీసుకెళ్లారన్నారు. ఆరుద్ర భర్త భువనేశ్వర్‌ మాట్లాడుతూ.. అర్ధరాత్రి వీధిదీపాలు ఆపి దివ్యాంగులపై దౌర్జన్యం చేయడం దారుణమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని