logo

కనుపాపను కాపాడుకోవాలని..

చదువులో సరస్వతీ పుత్రిక.. మరో ఏడాదిలో చేతికి వచ్చే ఇంజినీరింగ్‌ పట్టా... క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఒకటి.. రెండు కాదు... నాలుగు సంస్థలకు ఎంపిక.. అమ్మాయి ప్రతిభ చూసి ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.. అంతా సరదాగా సాగిపోతున్న వేళ ఒక్కసారిగా తేరుకోలేని కుదుపు.

Published : 09 Jun 2023 03:40 IST

ఈనాడు, రాజమహేంద్రవరం

ఆసుపత్రిలో తల్లితో...

చదువులో సరస్వతీ పుత్రిక.. మరో ఏడాదిలో చేతికి వచ్చే ఇంజినీరింగ్‌ పట్టా... క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఒకటి.. రెండు కాదు... నాలుగు సంస్థలకు ఎంపిక.. అమ్మాయి ప్రతిభ చూసి ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.. అంతా సరదాగా సాగిపోతున్న వేళ ఒక్కసారిగా తేరుకోలేని కుదుపు. ఆమె మోముపై చిరునవ్వును దూరం చేసింది. ఉన్నత ఉద్యోగంలో అమ్మాయిని చూసి మురిసిపోదామని భావించిన ఆ తల్లిదండ్రులు... ఆమె పూర్తిగా కోలుకుని ఇంటికొస్తే అదే పదివేలని మొక్కని దేవుడు లేడు. ఆమెను కాపాడుకోవాలని ఉపాధినిస్తున్న లారీలు, నీడనిచ్చిన ఇల్లు, ఇతర ఆస్తులను విక్రయించినా ఇంకా చాలని పరిస్థితి. వైద్యం కోసం సుమారు రూ.20 లక్షలు అవసరమని చెబుతున్న ఆ దంపతులు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మున్సిపల్‌ కాలనీకి చెందిన పుట్టా వీరవెంకట లక్ష్మీనారాయణ, కుమారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సాయిదీపిక(22) భీమవరంలోని విష్ణు కళాశాలలో బీటెక్‌ చదువుతుండగా మూడో ఏడాదిలో నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో నాలుగు సంస్థలకు ఉత్తమ ప్యాకేజీలతో ఎంపికైంది. నాలుగో ఏడాది చివరిలో అనారోగ్య సమస్య తీవ్రమైంది. 2019లో ఇంజినీరింగ్‌ రెండో ఏడాది చదువుతున్న సమయంలోనే క్యూరో డెర్మ వ్యాధి ఉన్నట్టు గుర్తించి చికిత్స అందించామని తండ్రి పి.వి.వి.లక్ష్మీనారాయణ చెబుతున్నారు. 2021లో పొడి దగ్గు, తీవ్ర ఆయాసంతో బాధపడిన యువతిని ఆసుపత్రికి తీసుకెళ్తే ఊపిరితిత్తులు 20 శాతం గట్టిపడి, ర్యాషెస్‌ వచ్చినట్లు వైద్యులు చెప్పారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో రుమటాలజిస్ట్‌, పల్మనాలజిస్టులను సంప్రదించి చికిత్స అందించారు. 2021 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ప్రతి నెలా ఆసుపత్రికి తీసుకెళ్లి తెచ్చేవారు. ఈ క్రమంలో వైరల్‌ ఫీవర్‌, ఇన్‌ఫెక్షన్లు అయిదు సార్లు రాగా.. ఒక్కో దఫా సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చయ్యేది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సమస్య తీవ్రమవడంతో రాజమహేంద్రవరంలోని ఆసుపత్రిలో చూపించారు. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి మే 6న తరలించారు.

దెబ్బతిన్న ఊపిరితిత్తులు

యువతిని పరీక్షించిన వైద్యులు 65 శాతం మేర ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇందుకు రూ.55 లక్షల మేర అవుతుందని, రూ.20 లక్షల వరకు ఆసుపత్రి భరిస్తుందని, రూ.15 లక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా అందాయని, మిగతా మొత్తం సిద్ధం చేసుకోవాలని ఆసుపత్రి వర్గాలు సూచించినట్లు తండ్రి తెలిపారు.

సాయిదీపిక

దాతల సాయమే ఆధారం..

కుమార్తెను ఆరోగ్యంగా ఇంటికి తీసుకెళ్లాలనే ఒకే లక్ష్యంతో ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధపడ్డా. ఈ క్రమంలో ఉపాధి నిచ్చే నాలుగు లారీలు, ఇంటిని, ఓ నివాస స్థలాన్ని విక్రయించా. ఇంకా ఖర్చు చేసేందుకు నా ఆర్థిక స్థోమత సరిపోదు. నా కుమార్తెను రక్షించేందుకు దాతలు సాయం చేయాలని వేడుకుంటున్నా.

పుట్టా వీరవెంకట లక్ష్మీనారాయణ, రాజమహేంద్రవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని