logo

రాజమహేంద్రవరం @ 46.5

భానుడు ఠారెత్తిస్తున్నాడు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజమహేంద్రవరంలో అత్యధికంగా 46.5 డిగ్రీలు, రామచంద్రపురంలో 45.0, జగ్గంపేటలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు.

Published : 10 Jun 2023 04:14 IST

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు
న్యూస్‌టుడే, కంబాలచెరువు (రాజమహేంద్రవరం)

రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలోని జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో చికిత్స పొందుతున్నవారు

భానుడు ఠారెత్తిస్తున్నాడు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజమహేంద్రవరంలో అత్యధికంగా 46.5 డిగ్రీలు, రామచంద్రపురంలో 45.0, జగ్గంపేటలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. అనపర్తి, గోపాలపురం, నిడదవోలు, రాజానగరం ప్రాంతాల్లో 44 డిగ్రీలు.. మండపేట, పి.గన్నవరం, రాజోలు తదితర ప్రాంతాల్లో 41 డిగ్రీలకు చేరడంతో జనం అల్లాడిపోయారు. పలు ప్రాంతాల్లో లోవోల్టేజీ సమస్యతో పంకాలు, కూలర్లు, ఏసీలు పనిచేయలేదు.

ఆసుపత్రులకు పెరుగుతున్న ఓపీ

వేడిగాలుల తీవ్రత వల్ల నిర్జలీకరణ(డీహైడ్రేషన్‌) సమస్యతో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కాకినాడ జీజీహెచ్‌లోని సాధారణ వైద్య విభాగానికి శుక్రవారం 630 మంది వస్తే అందులో సుమారు 150 మంది డీహైడ్రేషన్‌, తీవ్ర నీరసం, తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు, విరేచనాలు వంటి వడదెబ్బ లక్షణాలతో వచ్చినవారే. రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలోని జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో మొత్తం 150 వరకు ఓపీ ఉంటే శుక్రవారం 25 శాతం మంది వడదెబ్బ లక్షణాలతో చికిత్స తీసుకున్నారని వైద్యులు తెలిపారు. బీపీ, మధుమేహం, క్యాన్సర్‌ రోగులు ..వృద్ధులు, చిన్నారులు సొమ్మసిల్లి వస్తున్నారని.. రెండురోజులు ఐవీ ఫ్లూయిడ్స్‌ వంటివి ఇచ్చి చికిత్స అందించడంతో కోలుకుంటున్నారని చెబుతున్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం జియాలజీ విభాగ ఆచార్యులు వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని భూభాగం కాంక్రీటు జంగిల్‌గా మారుతుండడం, చెట్ల నరికివేత, మొక్కల సమతుల్యత లోపించడం అధిక ఉష్ణోగ్రతలకు ఓ కారణమన్నారు. ఏటా రాజమహేంద్రవరం, రాజానగరం, కాకినాడ, పెద్దాపురం, అమలాపురం తదితర చోట్ల వివిధ రకాల తోటలు లేఅవుట్లగా మారిపోతున్నాయన్నారు. పదేళ్ల క్రితం జూన్‌ మొదటి వారంలో ఎండలు తగ్గుముఖం పడితే ఇప్పుడు అధికంగా ఉన్నాయన్నారు.

11 వరకు ఇంతే

పి.గన్నవరం: ఈ నెల 11 వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కేఎల్‌ యూనివర్సిటీ వాతావరణ విభాగ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గుబ్బల చినసత్యనారాయణ తెలిపారు. తూర్పు పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావటంతో ఎలినోఇయర్‌ నడుస్తోందన్నారు.  చెట్లు నరికేయటం, జల కాలుష్యం, ప్లాస్టిక్‌ వినియోగం వంటివి వాతావరణ సమతుల్యత దెబ్బతినటానికి కారణమన్నారు. భౌగోళిక సహజస్థితిని పాడుచేయకుండా రక్షించుకోవలసిన బాధ్యతను విస్మరించరాదన్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని నియంత్రించుకుని మొక్కలు విరివిగా పెంచాలన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు