logo

రూ.29,486 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక

జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయేతర  పరిశ్రమలు, ఇతర ప్రాధాన్యత రంగాలకు సంబంధించి 2023-24 వార్షిక రుణ ప్రణాళిక రూ.29,486 కోట్లుగా నిర్ణయించారు.

Published : 10 Jun 2023 04:14 IST

రుణ ప్రణాళికను విడుదల చేస్తున్న కలెక్టర్‌, బ్యాంకర్లు, ఇతర అధికారులు

వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం): జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయేతర  పరిశ్రమలు, ఇతర ప్రాధాన్యత రంగాలకు సంబంధించి 2023-24 వార్షిక రుణ ప్రణాళిక రూ.29,486 కోట్లుగా నిర్ణయించారు. కలెక్టరేట్‌లో బ్యాంకర్ల జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లాస్థాయి సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. కౌలు రైతులకు సకాలంలో రుణాల మంజూరు, ఇతర పథకాల అమలుపై చర్చించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 4,48,234 మంది రైతులకు రూ.10,178 కోట్లు, సూక్ష్మ చిన్న, మధ్య తరగతి సంస్థలు (ఎంఎస్‌ఎం) యూనిట్లు 30,570 ఏర్పాటుకు రూ.2,887 కోట్లు, వ్యవసాయేతర ప్రాధాన్యత రంగంలో 5,30,565 మంది ఖాతాలకు రూ.13,782 కోట్లు, ఇతర ప్రాధాన్యేతర రంగాలకు రూ.2,639 కోట్లుగా ప్రతిపాదిస్తూ వార్షిక రుణ ప్రణాళికకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ వార్షిక రుణ ప్రణాళికలో ప్రతిపాదించిన లక్ష్యాలను సాధించడానికి బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు.  జిల్లాస్థాయిలో జరిగే బ్యాంకర్ల సమావేశానికి ఆయా బ్యాంకుల కంట్రోలర్స్‌ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఏపీ టిడ్కో గృహాలు 3,840 లక్ష్యంకాగా 2,649 పంపిణీ చేయడం, కొన్ని బ్యాంకులు దరఖాస్తులు తిరస్కరించడంపై  వివరణ ఇవ్వాలని సమావేశం కోరింది.

ఎవరేమన్నారంటే..

జిల్లాలో పీఎంఈజీపీ కింద 265 యూనిట్స్‌ గ్రౌండింగ్‌ చేసినట్లు యూనియన్‌ బ్యాంక్‌ ప్రాంతీయ అధికారి హరిబాబు తెలిపారు. నాబార్డు ద్వారా జీడిపప్పు, కూరగాయలు, కోకో అక్టివిటీ కింద నాబార్డ్‌, ఎస్‌ఎఫ్‌ఏసీ కింద నిధులు సమకూరుస్తున్నట్లు నాబార్డ్‌ అధికారి స్వామినాయుడు తెలిపారు. జగనన్న తోడు ఫేజ్‌-6 కింద 17,484 యూనిట్లకు రూ.17.49 కోట్లు ఇచ్చినట్లు డీఆర్‌డీఏ పీడీ ఎస్‌.సుభాషిణి తెలిపారు. మహిళా పారిశ్రామిక అభివృద్ధి కోసం 500 యూనిట్లు మంజూరు చేసేందుకు నిర్ణయించినట్లు సూక్ష్మ తరహా పరిశ్రమల అధికారి కె.శ్రీనివాసరావు తెలిపారు.  ఆర్బీఐ ప్రాంతీయ అధికారి నాగప్రవీణ్‌, ఎల్‌డీఎం డి.బి.ప్రసాద్‌, డీఐవోబీ వెంకటేశ్వరావు, తదితరులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని