logo

ముగ్గురి ఉసురు తీసిన విద్యుత్తు తీగలు

ఆయిల్‌పామ్‌ తోటలో సబ్‌మెర్సిబుల్‌ పంపు మరమ్మతులు చేస్తుండగా ఇనుపగొట్టాలు పైనున్న 11 కేవీ విద్యుత్తు తీగలకు తగిలి విద్యుదాఘాతంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Published : 24 Sep 2023 06:26 IST

ఘటనాస్థలంలో మృతదేహాలు

గండేపల్లి, జగ్గంపేట, జగ్గంపేట గ్రామీణం, కిర్లంపూడి, న్యూస్‌టుడే: ఆయిల్‌పామ్‌ తోటలో సబ్‌మెర్సిబుల్‌ పంపు మరమ్మతులు చేస్తుండగా ఇనుపగొట్టాలు పైనున్న 11 కేవీ విద్యుత్తు తీగలకు తగిలి విద్యుదాఘాతంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గండేపల్లి మండలం ఉప్పలపాడు పరిధిలో శనివారం ఉదయం 8.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో జగ్గంపేట మండలం సీతారాంపురానికి చెందిన రైతు గళ్లా నాగరాజు అలియాస్‌ బాబి (26), జగ్గంపేటకు చెందిన కిల్లి నాగేశ్వరరావు అలియాస్‌ నాగు (45), కిర్లంపూడి మండలం బూరుగుపూడికి చెందిన బుదిరెడ్డి సూరిబాబు (40) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రైతు నాగరాజు తోటలో మోటారు మరమ్మతులు చేయడానికి బోరుకు మూడు వైపులా గొట్టాలను అమర్చుతుండగా పైనున్న 11 కేవీ విద్యుత్తు తీగలకు ప్రమాదవశాత్తు తగిలాయి. విద్యుదాఘాతంతో ముగ్గురూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. గ్రామస్థులు ఆందోళనకు దిగి ఎలక్ట్రికల్‌ ఏడీఈ, ఏఈలను నిలదీశారు. బాధితులను ఆదుకోవాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ డిమాండ్‌ చేశారు.  

మూడు గ్రామాల్లో విషాదం

ముగ్గురి మృతితో సీతారాంపురం, జగ్గంపేట, బూరుగుపూడిలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయిల్‌పామ్‌ తోటలో మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. జగ్గంపేటకు చెందిన నాగేశ్వరరావు బోర్ల మరమ్మతులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కుమారుడు గణేష్‌, కుమార్తె రమాదేవిని డిగ్రీ వరకు చదివించారు. మృతదేహంపై పడి పిల్లలు, భార్య లక్ష్మి బోరున విలపించారు.  

కుటుంబ బాధ్యతలు మోస్తూ..

సీతారాంపురానికి చెందిన గళ్లా నాగరాజు తండ్రి అప్పారావు పదేళ్ల క్రితం మృతిచెందగా తల్లి నాగమణి కుటుంబ బాధ్యతలు స్వీకరించి ఇద్దరు కొడుకులు, కుమార్తెలను పెద్ద చేసింది. చిన్న కుమారుడు నాగరాజు చదువుకుంటూనే కుటుంబ బాధ్యతలతో తల్లికి చేదోడువాదోడుగా నిలిచేవాడు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సీతారాంపురంలో అన్నదానం ఏర్పాటు చేయడంతో బోరు మరమ్మతులను వాయిదా వేయాలని అనుకున్నారు. మెకానిక్‌ ఆటోలో పరికరాలను తీసుకురావడంతో వారితో పాటు పొలం వెళ్లి మృత్యువాతకు గురయ్యారు.

పెద్దదిక్కును కోల్పోయి...

కిర్లంపూడి మండలం బూరుగుపూడికి చెందిన బొద్దిరెడ్డి సూరిబాబు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అతడికి భార్య గంగ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆటో కిరాయికి వెళ్లి సామాన్లు దించేసి రాకుండా పరోపకారంతో అక్కడున్న వారికి సాయపడే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్థులు చెబుతున్నారు. పిల్లలకు దిక్కెవరంటూ భార్య గంగ రోదిస్తున్న తీరు అక్కడున్నవారిని కలచివేసింది.      

బాధితుల ఆందోళన..

పెద్దాపురం: బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ పెద్దాపురం ప్రభుత్వాసుపత్రి ఎదుట జనసేన, ఏపీ రైతు కూలీ సంఘం, సీపీఎం నాయకులు బైఠాయించారు. రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని విద్యుత్తు శాఖ డీఈఈ రత్నాలు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడం, తహసీల్దార్లు సత్యనారాయణ, జితేంద్ర ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. సీఐలు సూర్యఅప్పారావు, షేక్‌ అబ్దుల్‌ నబీ పరిస్థితిని పర్యవేక్షించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు