logo

Andhra News: అధికారంలోకి వచ్చాక ‘అఖండ’ సినిమా చూపిస్తాం: యరపతినేని

వైకాపా నాయకులందరూ మాకు శత్రువులు కాదని, మా నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం, అవమానించడం, దౌర్జన్యాలు, దాడులు చేసిన వారికి తెదేపా అధికారంలోకి వచ్చాక ‘అఖండ’ సినిమా

Updated : 04 May 2022 07:37 IST

 వైకాపా నాయకులను హెచ్చరించిన తెదేపా మాజీ ఎమ్మెల్యే

మాచవరం, న్యూస్‌టుడే: వైకాపా నాయకులందరూ మాకు శత్రువులు కాదని, మా నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం, అవమానించడం, దౌర్జన్యాలు, దాడులు చేసిన వారికి తెదేపా అధికారంలోకి వచ్చాక ‘అఖండ’ సినిమా చూపిస్తామని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం మల్లవోలులో ‘పల్లె పిలుస్తోంది’ కార్యక్రం నిర్వహించారు. తాము అధికారంలోకి ఉన్నప్పుడు అందరినీ ఒకేలా చూశామన్నారు. రాష్ట్రంలో అరాచకం తప్పితే అభివృద్ధి లేదని పేర్కొన్నారు. వైకాపా నాయకుల అనుమతి ఉంటేనే గ్రామాల్లో పెళ్లిళ్లు, ఊరేగింపులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్ని పథకాలను రద్దు చేసి నవరత్నాలలో కలిపేశారని పేర్కొన్నారు.

రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూములపై మండలంలోని వైకాపా నాయకులు బినామీ పేర్లతో బ్యాంకులు, సొసైటీల్లో కోట్లాది రూపాయల రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. తెదేపా అధికారంలోకి వచ్చాక వాటిపై విచారణ నిర్వహించి అందరినీ జైలుకు పంపుతామని హెచ్చరించారు. పిన్నెల్లి, తురకపాలెం, మోర్జంపాడు గ్రామాల్లోని తెదేపా శ్రేణులపై చేసిన దాడులను మరిచిపోమని పేర్కొన్నారు. ఆనాడు ఎన్టీఆర్‌ ‘తెలుగుదేశం.. పిలుస్తోంది.. రా.. కదిలిరా..’ అంటూ ఇచ్చిన స్ఫూర్తితో, నేడు రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా గురజాల నియోజకర్గంలో ‘పల్లె పిలుస్తోంది’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని ఆయన చెప్పారు. అందరూ పట్టుదలతో పనిచేసి, పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

మృతిచెందిన, అనారోగ్యంతో బాధపడుతున్న తెదేపా కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రధాన కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. మండల కన్వీనర్‌ బడిగుంచల వెంకటేశ్వర్లు, గరిసెల మల్లికార్జునరావు, రామిశెట్టి శ్రీను, యడ్లపల్లి రామారావు, మాలపాటి మల్లయ్య, బేతంచర్ల రామయ్య, జక్కా వాసు, చింతల వెంకట నర్సయ్య, కొల్లి కృష్ణమూర్తి, దున్నా చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని