logo

విత్తు ఘనం.. పూత ఘోరం

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో లక్ష హెక్టార్లల్లో మిర్చి సాగవుతోంది. ఇందులో సంకర విత్తనాలు(హైబ్రీడ్‌) సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మిర్చి విత్తన కంపెనీలన్నీ కర్ణాటక కేంద్రంగా విత్తన మిర్చి

Published : 21 May 2022 04:06 IST

ఆకర్షణీయ సంచులతో ఆకట్టుకుంటున్న కంపెనీలు

ఈనాడు, అమరావతి: ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో లక్ష హెక్టార్లల్లో మిర్చి సాగవుతోంది. ఇందులో సంకర విత్తనాలు(హైబ్రీడ్‌) సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మిర్చి విత్తన కంపెనీలన్నీ కర్ణాటక కేంద్రంగా విత్తన మిర్చి సాగుతోపాటు ప్యాకింగ్‌ చేసి ఇక్కడ సరఫరా చేస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కంపెనీలు సైతం గుంటూరు కేంద్రంగా విత్తనాలు విక్రయిస్తున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రం వ్యవసాయశాఖ అనుమతి లేకుండా ఆకర్షణీయ సంచులతో రైతులకు అంటగడుతున్నాయి. కొందరు విత్తన ఉత్పత్తిదారుల నుంచి బల్క్‌గా విత్తనాలు కొనుగోలు చేసి ప్రాసెస్‌ చేసి సొంత బ్రాండ్లతో విక్రయిస్తున్నారు. పూత, కాయ దశలో నాణ్యత లేని విత్తనాలను గుర్తించినా పంట తొలగించలేక దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నారు. అయితే కొన్ని కంపెనీలు అరకొరగా పరిహారం ఇచ్చి సమస్యను సద్దుమణిగేలా చేస్తున్నాయి. గతేడాది క్రోసూరు, పెదకూరపాడు ప్రాంతాల్లో ఒక ప్రముఖ కంపెనీని పోలిన విత్తనాలను గుర్తించారు. వ్యవసాయశాఖ రంగంలోకి దిగి ఆరా తీస్తే అమ్మిన, కొనుగోలు చేసిన రైతులు బంధువులు కావడంతో ఎక్కడి నుంచి తీసుకువచ్చారన్న విషయం ఇప్పటికీ తెలియలేదు. వ్యవసాయశాఖ యంత్రాంగం వెళ్లేటప్పటికీ ఆనవాళ్లు లేకుండా నారు దున్నేయడం, విత్తన సంచులు దాచేయడం గమనార్హం. నాలుగేళ్ల కిందట నరసరావుపేట, నకరికల్లు మండలాల్లోనూ నాణ్యత లేని విత్తనాలతో రైతులు నష్టపోయారు. గతేడాది బొబ్బర తెగులు, తామర పురుగుతో మిర్చి పంట దెబ్బతింది. ఈనేపథ్యంలో కొందరు వ్యాపారులు వైరస్‌ను తట్టుకునే రకాలు అంటూ రైతులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. రూ.లక్షల పెట్టుబడితో సాగు చేస్తున్న రైతులకు మిర్చి దిగుబడులు తగ్గితే ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగులుతోంది.

అప్రమత్తతతోనే అడ్డుకట్ట

మిర్చి విత్తనాలతోపాటు రైతులు నర్సరీల నుంచి నారు కొనుగోలు చేసి సాగు చేస్తారు. ప్రధాన కంపెనీల విత్తనాలు కిలో రూ.25వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం రాణిబెన్నూరు పరిసర ప్రాంతాలు మిర్చి విత్తన ఉత్పత్తికి కేంద్రాలు. ఇక్కడే ప్రముఖ కంపెనీల నుంచి చిన్న కంపెనీలు విత్తనోత్పత్తి చేస్తాయి. నర్సరీ నిర్వాహకులు కొందరు రాణిబెన్నూర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లి విత్తన ఉత్పత్తి కేంద్రాల నుంచి కొనుగోలు చేసి తెస్తున్నారు. వీటికి పరీక్షలు నిర్వహించకుండా నేరుగా నారు పోసి ప్రధాన కంపెనీల విత్తనాలతో పెంచిన మొక్కలనీ రైతులకు అంటగడుతున్నారు. వీటిని సాగుచేసిన రైతులు నష్టపోతున్నారు. నర్సరీ నిర్వాహకుల అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఉద్యానశాఖ నర్సరీ చట్టాన్ని అమలు చేస్తోంది. నర్సరీ నిర్వాహకులు ఉద్యానశాఖ నుంచి అనుమతులు తీసుకోవడంతోపాటు విత్తనాలు ఎక్కడి నుంచి, ఎంత పరిమాణంలో కొన్నారు? ఏరకాలకు చెందిన విత్తనాలతో నారు పెంచారు? విత్తన కొనుగోలుకు సంబంధించిన బిల్లులు, రైతులకు నారు విక్రయించినట్లు రికార్డుల్లో నమోదు వంటివి పక్కాగా అమలు చేయాలి. నర్సరీ నిర్వాహకులకు రైతులు విత్తనాలు ఇచ్చి నారు పెంచమని చెబితే ఆ వివరాలు రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయాలి.  రైతులు ప్రధానంగా తాము పెంచుకున్న నారు సరిపోనప్పుడు, పడి మొక్కల కోసం ఎక్కువగా నర్సరీలను ఆశ్రయిస్తారు. ఈ సమయంలో నర్సరీ నిర్వాహకుల వద్ద బిల్లులు, విత్తన ఖాళీ సంచులు తదితర వివరాలు చూసుకుని బిల్లులతో కొనుగోలు చేయాలి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఉద్యాన, వ్యవసాయశాఖకు సమాచారం ఇవ్వాలి. సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నర్సరీ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి పకడ్బందీగా చట్టాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఉద్యానశాఖ జిల్లా అధికారి సుజాత ‘ఈనాడు’కు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని