logo

గుళ్లపల్లిలో బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణం

స్థానికంగా బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలం, గుళ్లపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది.

Updated : 23 May 2022 06:00 IST

ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడే కారణం

మృతురాలి స్వస్థలం తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల


బొల్లి దివ్యవాణి (పాతచిత్రం)

గుళ్లపల్లి (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: స్థానికంగా బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలం, గుళ్లపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. చెరుకుపల్లి ఎస్సై డి.వెంకటకొండారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం, సిరిసిల్లకు చెందిన బొల్లి దివ్యవాణి (31) నగరం మండలం, మట్లాపూడిలోని ఇండియన్‌ బ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేసేవారు. ఐదేళ్లుగా ఆమె నగరం, అక్కడి నుంచి మట్లపూడి ఇండియన్‌ బ్యాంక్‌ శాఖల్లో పనిచేస్తూ బ్యాంకు నుంచి రూ.40లక్షల రుణం తీసుకున్నారు. ఆ రుణంతో గుళ్లపల్లిలో మూడంతస్తుల భవనం నిర్మించుకుని ఉప్పాల శ్రీనివాసరావుకు అద్దెకు ఇచ్చారు. అందులోనే ఒక గదిలో ఆమె నివసించేవారు. బ్యాంకులో పనిఒత్తిడి కారణంగా ఇబ్బందిగా ఉంటోందని ఇటీవల ఇంటికి వెళ్లినప్పుడు తల్లిదండ్రులకు తెలపగా వారు ఆమెను సముదాయించి పంపారు. దీనికి తోడు ఆర్థిక సమస్యలు మరింత ఇబ్బందికి గురిచేశాయి. శనివారం విధులు ముగించుకుని బ్యాంకు నుంచి వచ్చి తన గదిలో నిద్రించింది. ఆదివారం ఉదయం అద్దెకు ఉంటున్న శ్రీనివాసరావు చూసే సమయానికి ఓ గదిలో సీలింగ్‌కు చున్నీతో ఉరివేసుకొని కనిపించింది. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలపగా వారు ఘటనాస్థలికి చేరుకుని మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు సాయంత్రానికి గుళ్లపల్లి చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తె పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లి విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి తండ్రి లక్ష్మీనారాయణ, అన్న రామకృష్ణ ఉన్నారు. పొరుగు రాష్ట్రం యువతి స్థానికంగా తన సొంత భవనంలో బలవన్మరణానికి పాల్పడడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని