logo

కోడింగ్‌ తెలిస్తే కొలువే..!

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు కొలువుల జాతర మొదలైంది. ఒక్కో విద్యార్థికి కనీసం మూడు నుంచి ఐదు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. రూ.4 లక్షల నుంచి రూ.45 లక్షల వరకూ ప్యాకేజీ అందుకుంటున్నారు. 250 నుంచి 300 ఐటీ సంస్థలు ఈ సారి కొలువులను అందించేందుకు పోటీ పడుతున్నాయి. గతంలో

Updated : 24 May 2022 06:27 IST

రూ.4 లక్షలు - రూ.45 లక్షల వరకు ప్యాకేజీ
పోటీ పడి ఇస్తున్న ఐటీ సంస్థలు
ఈనాడు, అమరావతి

మ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు కొలువుల జాతర మొదలైంది. ఒక్కో విద్యార్థికి కనీసం మూడు నుంచి ఐదు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. రూ.4 లక్షల నుంచి రూ.45 లక్షల వరకూ ప్యాకేజీ అందుకుంటున్నారు. 250 నుంచి 300 ఐటీ సంస్థలు ఈ సారి కొలువులను అందించేందుకు పోటీ పడుతున్నాయి. గతంలో కళాశాలకు ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు నిర్వహించేవారు. కొవిడ్‌ తర్వాత ఆ పంథా మార్చారు. ఆన్‌లైన్‌లోనే పరీక్ష, ఇంటర్వ్యూలు పూర్తి చేస్తున్నారు. ఆయా సంస్థలు ఆన్‌లైన్‌ లింక్‌ను ఇచ్చి.. దానిలో విద్యార్థులే నేరుగా తమ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతి ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా సంస్థలు అడిగే అర్హతల ఆధారంగా పరీక్షలకు హాజరు కావొచ్చు.

కొవిడ్‌కు ముందు వరకూ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులై బయటకొచ్చే వారిలో 15 నుంచి 20 శాతం మందికి మాత్రమే కొలువులు వచ్చేవి. ఈ ఏడాది ఆయా సంస్థల పరీక్షలను రాస్తున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలొస్తున్నాయి. కంపెనీలు నిర్వహించే పరీక్షల్లో విద్యార్థులు చూపించే ప్రతిభ ఆధారంగానే ప్యాకేజీలు ఇస్తున్నారు. ఇంజినీరింగ్‌లో గ్రూపులతో సంబంధం లేకుండా ప్రధానంగా అర్హత పరీక్షలో కోడింగ్‌ స్కిల్స్‌ ఆధారంగా కంపెనీల ప్యాకేజీలు ఉంటున్నాయి. కోడింగ్‌ ఉంటే రూ.3.6 లక్షలు, మీడియం రూ.7 లక్షలు, హైకోడింగ్‌కు రూ.10 లక్షలు ఇస్తున్నారు. గతంలో ఇంగ్లిష్‌ పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ లాంటి వాటిని అర్హతగా చూసేవారు. ప్రస్తుతం అంతా కోడింగ్‌ ఆధారంగానే నడుస్తోంది.

ఒక్కొక్కరికీ 3-4 అవకాశాలు
ప్రస్తుతం పెద్ద ఐటీ సంస్థల మధ్య కూడా పోటీ పెరిగింది. ఒక్కో విద్యార్థికి కనీసం మూడు నుంచి ఐదు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు రావడంతో ఎక్కువ ప్యాకేజీలు ఇచ్చే వారి వైపు వెళుతున్నారు. దీంతో విద్యార్థులను ఆకర్షించేందుకు గతంలో ఇచ్చే ప్యాకేజీలను కంపెనీలు ప్రస్తుతం పెంచాయి. గతంలో కనీస ప్యాకేజీ రూ.2.4 లక్షలుండేది.. ప్రస్తుతం రూ.4 లక్షలకు పెరిగింది. విద్యార్థి ఎంపికవగానే.. వర్క్‌ ఫ్రం హోంకు అవసరమైన ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ పంపించేస్తున్నాయి. ఫర్నిచర్‌ కోసం మరో రూ.11 వేలు ఇస్తున్నారు. వచ్చే ఆగస్టు నుంచి కంపెనీలకు వచ్చి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని ప్రస్తుతం విద్యార్థులకు లెటర్లు వచ్చాయి.

పాత వారికి..
రెండు జిల్లాల్లోని విద్యాసంస్థల్లో గత రెండేళ్లలో 25 వేల నుంచి 30 వేల కొలువులు వచ్చాయి. 2021, 2022, 2023 ఏడాదిలో చదివిన వారికి ఎక్కువగా అవకాశాలొస్తున్నాయి. ఒకసారి కళాశాల నుంచి ఇంజినీరింగ్‌ పూర్తిచేసి వెళ్లిపోయిన వారిని మరుసటి ఏడాది పిలిచి కొలువు ఇవ్వడం గతంలో జరిగేది కాదు. కానీ ప్రస్తుతం ఎక్కువ మంది ఉద్యోగులు కావాల్సి ఉండడంతో గత ఏడాది పూర్తిచేసిన వారిని, వచ్చే ఏడాది బయటకు రాబోతున్న వారిని కూడా తీసుకుంటున్నారు.  


ఉద్యోగాలతో కంపెనీలు ఎదురుచూస్తున్నాయ్‌
- ఎన్‌.వి.సురేంద్రబాబు, ఏపీటీపీవో కన్సార్టియం ప్రధాన కార్యదర్శి

ఉమ్మడి కృష్ణా, గుంటూరుల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రస్తుతం కొలువుల జాతరే ఉంది. విప్రో, టీసీఎస్‌, అమెజాన్‌, గూగుల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ లాంటి అనేక సంస్థలు విద్యార్థుల కోసం అవకాశాలతో ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం మూడో ఏడాది చదువుతున్న వారికి కూడా ఇచ్చేస్తున్నారు. వీరికి కళాశాలలో ఉండగానే శిక్షణ పూర్తిచేయించి, వారు బయటకు రాగానే ఉద్యోగంలో చేరిపోయేలా ప్రణాళికతో వెళుతున్నాయి. కళాశాలల ప్రాజెక్ట్‌ వర్క్‌గా, ఇంటర్న్‌షిప్‌గా సదరు కంపెనీల్లోనే పూర్తిచేసేలా ముందే విద్యార్థులకు రూ.20 వేల వరకూ అందజేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలోనే కంపెనీలకు ప్రాజెక్ట్‌లు అధికంగా రావడంతో మన విద్యార్థులకు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. మెకానికల్‌ చదివే విద్యార్థులకు ఐటీ కంపెనీల్లో కనీసం రూ.4 లక్షల ప్యాకేజీతో ఈ ఏడాది ఉద్యోగాలు రావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని