Chandrababu: సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయి: చంద్రబాబు

రాష్ట్రంలో పోలీసులు కూడా సైకోలుగా తయారవుతున్నారా? అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారని అక్రమ కేసులు పెడుతూ

Updated : 10 Aug 2022 16:11 IST

అమరావతి: రాష్ట్రంలో పోలీసులు కూడా సైకోలుగా తయారవుతున్నారా? అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారని అక్రమ కేసులు పెడుతూ తెదేపా కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొంత మంది సైకో ప్రవర్తన ఉన్న పోలీసు అధికారులతో నిబంధనలకు వ్యతిరేకంగా టార్చర్‌ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పోరాటం పోలీసులపై కాదని.. వైకాపా పైనే అని స్పష్టం చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు వెంకటేశ్‌, సాంబశివరావు విషయంలో వ్యవహరించిన తీరు అమానుషమని ధ్వజమెత్తారు. తప్పుడు అధికారులను వదిలిపెట్టనని తేల్చిచెప్పారు. మళ్లీ అధికారంలోకి రాబోయే పార్టీ తెలుగుదేశమే అన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

‘‘సోషల్‌ మీడియాలో 600మందిపై కేసులు పెట్టారు. 41ఏ నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేస్తున్నారు. కొందరు అధికారుల ద్వారా తప్పుడు కేసులు పెడుతున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదు. అవసరమైతే పోలీస్‌ స్టేషన్‌కు నేను వెళ్తా. నా రాజకీయ జీవితంలో ఇలాంటి చెత్త పరిపాలన చూడలేదు.  పోలీసులు కూడా సైకోలుగా తయారవుతున్నారా? సాంబశివరావు, వెంకటేశ్‌ ఇళ్లకు వెళ్లి బెదిరిస్తారా? 41ఏ నోటీసు ఇవ్వాలంటే అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లాలా? ఇంటి గోడలు దూకి వెళ్లాలా.. లైట్లు పగలగొడతరా? ఇలాంటి కేసులను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయి. సుప్రీంకోర్టును సైతం లెక్క చేయని విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆయా అధికారులను చట్టం ముందు దోషులుగా నిలబెడతాం. ఇలాంటి పాలనలో బలిపశువులు కావొద్దని పోలీసులను కోరుతున్నా’’ అని చంద్రబాబు హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని