logo

అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష

జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తెనాలి సబ్‌కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎంఈవోలు, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్షించారు.

Published : 29 Sep 2022 04:40 IST

- కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే

జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డిని వివిధ జిల్లాల్లోని అసిస్టెంట్‌ కలెక్టర్‌లు బుధవారం ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో అసిస్టెంట్‌ కలెక్టర్లు శివనారాయణ శర్మ(గుంటూరు), పెద్దిటి ధాత్రిరెడ్డి(అనకాపల్లి), వై.మేఘాస్వరూప్‌(చిత్తూరు), ఫ్రఖార్‌జైన్‌(కాకినాడ), అసుతోష్‌శ్రీవాత్సవ(అల్లూరు సీతారామరాజు) అపూర్వభరత్‌(ఏలూరు), రాహుల్‌మీనా(వైఎస్సార్‌ కడప), సూరపాటి ప్రశాంత్‌కుమార్‌(అనంతపురం) ఉన్నారు.

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తెనాలి సబ్‌కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎంఈవోలు, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. పేదలందరికీ ఇళ్ల పథకంలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. లేఔట్లలో ఇళ్ల నిర్మాణాలకు ఎదురవుతున్న ఇబ్బందులను క్షేత్ర స్థాయిలోని అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల పంటల సాగుకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో డీఆర్‌వో కె.చంద్రశేఖర్‌రావు, ఉప కలెక్టర్‌ భాస్కర్‌నాయుడు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ బ్రహ్మయ్య పాల్గొన్నారు.

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు

కలెక్టరేట్‌(గుంటూరు): జిల్లాలో ప్రమాదకర రసాయనాలు ఉపయోగించే పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ముందస్తు భద్రత చర్యలు పక్కాగా అమలు చేసేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీసీ హాలులో బుధవారం జిల్లా క్రైసిస్‌ గ్రూప్‌ సమావేశం జరిగింది. జిల్లాలో వివిధ కేటగిరీల్లో ఉన్న పరిశ్రమలు, కార్మికుల వివరాలు, హజార్దౌస్‌(ప్రమాదకర రసాయనాలు వినియోగించే) పరిశ్రమల వివరాలను అధికారులు వివరించారు. కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదం జరిగినప్పుడు ప్రాణహాని లేకుండా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడంపై కార్మికులకు శిక్షణ అందించాలన్నారు. సమావేశంలో డీఆర్‌వో చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారిణి లలిత, ఫ్యాక్టరీస్‌ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌, జిల్లా అగ్నిమాపక అధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

1న ఉద్యోగుల సమస్యలపై అర్జీల స్వీకారం

కలెక్టరేట్‌: జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకునేలా ప్రతి నెలా మొదటి శనివారం సమీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ 1న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో సమీక్ష జరుగుతుందని, ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు వారికి సంబంధించిన సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయవచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని