logo

జయ జయహే సిరివర్షిణీ

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజు దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చింది. ఉదయం నుంచి భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో భక్తుల సంఖ్య పెరిగింది.

Published : 02 Oct 2022 05:43 IST

శ్రీ మహాలక్ష్మీ రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ

ఈనాడు, అమరావతి: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజు దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చింది. ఉదయం నుంచి భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో భక్తుల సంఖ్య పెరిగింది. సుమారు లక్ష మంది శనివారం తరలివచ్చారు. ఆరు రోజుల్లో నాలుగు లక్షల మంది ఉత్సవాల్లో పాల్గొన్నారు. శనివారం రాత్రి 11 గంటల తర్వాత కేవలం రెండు గంటలు మాత్రమే అమ్మవారి అలంకారం కోసం దర్శనాలు ఆపారు. ఆదివారం మూలానక్షత్రం కావడంతో అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత నుంచే భక్తులను దర్శనాలకు అనుమతించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల మధ్య ఆలయానికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా దుర్గగుడిలో ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.

నగరోత్సవంలో ఊరేగుతున్న గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులు

నేడు సరస్వతీదేవి అలంకారం..
దసరా ఉత్సవాలు కీలకదశకు చేరుకున్నాయి. ఏడో రోజు ఆదివారం దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనుంది. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తనున్నారు. ఏటా రెండు లక్షల మందికి పైగా వస్తారని అంచనా. మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన తర్వాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలానక్ష్రత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీదేవిగా అలంకరిస్తారు. ఈ రూపంలో అమ్మను దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహం పొంది సర్వ విద్యల్లో విజయం సాధిస్తారని నమ్మకం. మూలానక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి దుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానజ్యోతిని వెలిగించే సరస్వతీదేవి దర్శనం.. అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకమని భక్తుల ప్రగాఢ నమ్మకం.


ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

కోలాట నృత్యం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని