Pawan kalyan: ఫోన్‌ ట్యాపింగ్‌.. ప్రాణభయంతో వైకాపా ఎమ్మెల్యేలు: పవన్‌ కల్యాణ్‌

ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డికి తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఏపీ డీజీపీని కోరారు. డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తామని తెలిపారు.

Updated : 02 Feb 2023 18:23 IST

అమరావతి: నెల్లూరు జిల్లా వెంకటగిరి వైకాపా ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డికి రక్షణ సిబ్బందిని తగ్గించారని, ఆయన ప్రాణ రక్షణ బాధ్యత డీజీపీ తీసుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానని తెలిపారు. శాసనసభ్యులే ప్రాణహానితో భయపడే పరిస్థితులు వచ్చాయన్నారు. ఈ మేరకు గురువారం ట్విటర్‌లో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘రాష్ట్రంలో పరిస్థితిని కేంద్ర హోంశాఖకు తెలియజేస్తాం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాణభయంతో ఉన్నారు. వారు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. సీఎం జగన్‌ ఆయన కార్యాలయంపై అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు చేస్తే బాధ్యత కలిగిన డీజీపీ, హోం మంత్రి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రాణ హాని ఉందని, ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఆనం రాంనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి’’ అని పవన్‌ కల్యాణ్ అన్నారు. ఫోన్‌లు ట్యాప్‌ చేస్తున్నారని, భద్రత తగ్గించారని, తన కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. భౌతికంగా అంతమొందించేందుకు కుట్రలు చేస్తున్నారని ఇటీవల ఆనం రాంనారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని