Chandrababu: వైఎస్‌ వివేకా హత్య.. జగన్‌ ఇప్పుడు తప్పించుకోలేరు: చంద్రబాబు

సొంత పార్టీలో ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు తమ ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని రోడ్డెక్కిన పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్‌ కచ్చితంగా సమాధానం చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Published : 02 Feb 2023 20:40 IST

అమరావతి: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్‌ ఇప్పుడు తప్పించుకోలేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తాజా పరిణామాలతో అన్ని వేళ్లూ ఆయన కుటుంబం వైపు చూపుతున్నాయన్నారు. సొంత పార్టీలో ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు తమ ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని రోడ్డెక్కిన పరిస్థితిపై ముఖ్యమంత్రి కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహణ, పార్టీ సభ్యత్వ నమోదు, ఓటర్‌ వెరిఫికేషన్‌తో పాటు పలు అంశాలపై నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ముఖ్యనేతలతో ఆయన సమీక్షించారు. 

అప్పర్‌ భద్ర ప్రాజెక్టుతో రాయలసీమకు తీవ్ర నష్టం

ప్రతిపక్షాలను అణచివేసేందుకు జీవో నెంబరు 1 తేవడం, రాజకీయ పక్షాలపై ఆంక్షలు, కేసులు, ఫోన్‌ ట్యాపింగ్‌ వంటి వ్యవహారాలు తప్ప ముఖ్యమంత్రి జగన్‌కి రాష్ట్రం గురించి పట్టడం లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. కర్ణాటక రాష్ట్రం తలపెట్టిన ‘అప్పర్‌ భద్ర ప్రాజెక్టు’ నిర్మాణంతో సాగునీటి పరంగా రాయలసీమ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఈ విషయంలో జగన్‌ కనీస స్పృహ లేకుండా ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్‌ అడుగడుగునా రాజీ పడుతున్నారని ఆక్షేపించారు. వైకాపా ఎంపీలు పనిచేసేది సొంత లాబీయింగ్‌ కోసమే కానీ, రాష్ట్రం కోసం కాదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కరవు జిల్లాలకు నిధులు సహా ఒక్క అంశంలో కూడా కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని అందరు రాజకీయ నాయకుల కంటే ధనికుడైన జగన్‌.. పేదల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్‌ స్కీమ్‌ పెట్టాడంటే అందులో సొంత స్కామ్‌ ఉంటుందని ఆరోపించారు. జే బ్రాండ్‌ మద్యం, ఇసుక విధానం అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. పార్టీ నేతలు రాష్ట్రంలో నిలిచిపోయిన ప్రాజెక్టుల వద్దకు వెళ్లి వైకాపా పాలన వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని