logo

ఆ పరిస్థితి వస్తే గృహిణిగా ఉండిపోతా!

రాజకీయాల్లో ఉన్నంత కాలం తాను వైకాపాలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డితోనే కొనసాగుతానని మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరులోని ఆమె నివాసంలో గురువారం ఆమె విలేకర్లతో మాట్లాడారు.

Published : 03 Feb 2023 05:03 IST

ఫోన్‌ ట్యాపింగ్‌ చేసినా నాకేం నష్టం లేదు

మాజీ హోం మంత్రి సుచరిత

గోరంట్ల(గుంటూరు), న్యూస్‌టుడే: రాజకీయాల్లో ఉన్నంత కాలం తాను వైకాపాలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డితోనే కొనసాగుతానని మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరులోని ఆమె నివాసంలో గురువారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. పార్టీ మారుతున్నానంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు సరికాదన్నారు. తనకు సంబంధించిన ఏదైనా విషయంలో వార్త రాయాలనుకుంటే తనను సంప్రదించవచ్చన్నారు. ఏపీ తొలి మహిళా హోంమంత్రిగా తనకు సీఎం జగన్‌ సముచిత స్థానం కల్పించారని, ఆ తర్వాత మార్పుల్లో తనను తొలగించడం కాస్త బాధనిపించిందన్నారు. ఆ తర్వాత సీఎంను కలిసి మాట్లాడిన తర్వాత నుంచి పార్టీలోనే కొనసాగుతున్నానని చెప్పారు. చివరి వరకు వైకాపాలోనే ఉంటానని, పార్టీ మారాల్సిన పరిస్థితులే వస్తే గృహిణిగానే ఉంటానన్నారు. తన భర్త దయాసాగర్‌కు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి ఇప్పటికి లేదని, మున్ముందు ఏమైనా ఆసక్తి ఉంటే.. ఆ విషయంపై సీఎం జగన్‌ను కలిసి మాట్లాడతామని తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేసుకుంటే.. తనకు వచ్చే నష్టమేమీ లేదన్న సుచరిత నియోజకవర్గ నాయకులతో ఫోన్‌లో స్థానికంగా ఉన్న విషయాలపై మాట్లాడుతుంటామని, అంతకుమించి అంతర్జాతీయ విషయాలేమీ ఉండవన్నారు. ఈ విషయంలో అధిష్ఠానంపై బురద జల్లాలని చూస్తున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ అమలు చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయని కోరుకోవడంలో తప్పులేదని, లోకేశ్‌ పాదయాత్ర తర్వాత.. వారు కూడా అన్ని సీట్లు కోరుకుంటారని, కొద్ది రోజుల తర్వాత పవన్‌ కల్యాణ్‌ కూడా ఇదే మాటంటారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని