logo

రూ.కోట్ల పనులకు బాక్సు టెండర్లు!

గుంటూరు నగరపాలకలో కొందరు విభాగాధిపతులు ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి మాయాజాలంలో పడి పెట్టకూడని దస్త్రాలపైనా సంతకాలు పెట్టేసి చివరకు న్యాయస్థానాల ముంగిట నిలబడాల్సిన పరిస్థితి గతంలోనూ కొందరు కమిషనర్లకు ఎదురైంది.

Published : 03 Feb 2023 05:03 IST

నగరపాలక సంస్థలో విచిత్రం
ఇంజినీరింగ్‌ విభాగం తీరుపై విమర్శలు

ఈనాడు, అమరావతి: గుంటూరు నగరపాలకలో కొందరు విభాగాధిపతులు ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి మాయాజాలంలో పడి పెట్టకూడని దస్త్రాలపైనా సంతకాలు పెట్టేసి చివరకు న్యాయస్థానాల ముంగిట నిలబడాల్సిన పరిస్థితి గతంలోనూ కొందరు కమిషనర్లకు ఎదురైంది. తాజాగా ఎత్తురోడ్‌లో ఓ అపార్టుమెంట్‌ వద్ద డ్రైనేజీ నిర్మాణం విషయమై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే ప్రణాళికాధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి అక్కడ గోడను, డ్రైనేజీ కాల్వను ధ్వంసం చేయడంతో సంబంధిత స్థల యజమాని అధికారుల తీరుపై కోర్టుకెక్కారు. ఆ కేసులో నగరపాలక ఉన్నతాధికారిని నేరుగా విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిసింది. ఒక్క ప్రణాళిక విభాగంలోనే కాదు ప్రస్తుతం ఇంజినీరింగ్‌ విభాగంలోనూ చోటుచేసుకుంటున్న కొన్ని తప్పులకు చివరికి ఉన్నతాధికారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రూ.కోట్ల విలువైన పనులకు..

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమృత్‌-2 కింద చేపట్టాల్సిన పనులకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. ఇందులో భాగంగా గుంటూరు నగరపాలకలో తాగునీటి సరఫరా, పార్కులు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగు పనులకు ప్రణాళికలు రూపొందించే యోచనలో ఇంజినీరింగ్‌ వర్గాలు ఉన్నాయి. వీటి తయారీ బాధ్యతలను కన్సల్టెన్సీ కంపెనీలకు అప్పగించడానికి ఆ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు ఉత్సాహం చూపిస్తుంటే.. అదే విభాగానికి చెందిన కొందరు అధికారులు మార్గదర్శకాలకు విరుద్ధంగా పనులు ప్రతిపాదించి వాటిపై సంతకాలు కోరితే పెట్టలేమని కుండబద్ధలు కొట్టినట్లు తెలిసింది. ఇటీవల ఇంజినీరింగ్‌ విభాగం ఆ పనుల రూపకల్పనకు తొలుత డిజైన్లు, పని అంచనాల తయారీకి టెండర్లు పిలిచింది. ఈ పనులను ప్రైవేటు కన్సల్టెన్సీలు నిర్వహిస్తాయి. మొత్తం పని అంచనా విలువపై ఒక శాతం ఫీజు వాటికి చెల్లించాలి. అమృత్‌-2 కింద నగరానికి తొలి దశలో రూ.20-30 కోట్లు వస్తాయని ముందుగానే అధికారులు భావించి ఆ పనుల నిర్వహణకు అవసరమైన డీపీఆర్‌ల తయారీ కోసం కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తూ బాక్సు టెండర్‌లో బిడ్లు పిలిచారు. అయితే ఈ పనులన్నింటికి కన్సల్టెన్సీ ఛార్జీల చెల్లింపులు కోట్లలోనే ఉంటాయని, అలాంటి పనులకు ఆన్‌లైన్‌, ఈ ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లు పిలవాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా బాక్సు టెండర్లు పిలుస్తున్నారని కొందరు గుత్తేదారులు తాజాగా న్యాయస్థానానికి వెళ్లడానికి సిద్ధమైనట్లు ఇంజినీరింగ్‌ విభాగంలో  గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి ఈ విషయం తెలుసుకుని ఓ ఉన్నతాధికారి తాను బాక్సు టెండర్‌ దస్త్రంపై సంతకం చేయలేనని చెప్పినా పెట్టాల్సిందేనని పట్టుబడుతున్నారని తెలిసింది. ఒక్క డీపీఆర్‌ తయారీకి మాత్రమే కాదు కొన్ని పనులకు అధికార కార్పొరేటర్ల ఒత్తిళ్లకు తలొగ్గి టెండర్లు పిలవకుండా నామినేషన్లపై చేయిస్తున్నారు. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో రూ.50లక్షల పని ఐదు విభాగాలుగా విభజించి టెండర్లుకు వెళ్లకుండా అస్మదీయ గుత్తేదారులకు కట్టబెట్టి ఆ మేరకు వారి నుంచి కమీషన్లు తీసుకునే పనిలో కొందరు అధికారులు ఉన్నారని తెలిసింది. ఈ తప్పిదాలన్నింటిపై కోర్టులో కేసులు పడతాయి. వాటికి చివరకు ఉన్నతాధికారులే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఆ విషయం గుర్తెరిగి టెండర్లలో జరుగుతున్న మోసాలపై కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని