logo

నేడు జడ్పీ సర్వసభ్యసమావేశం

ఉమ్మడి గుంటూరు జిల్లాపరిషత్తు సర్వసభ్య సమావేశాన్ని గుంటూరులోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఉదయం 10.30 గంటలకు ఏర్పాటు చేశారు

Published : 04 Feb 2023 06:32 IST

అజెండాలో 2023-24 బడ్జెట్‌

గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాపరిషత్తు సర్వసభ్య సమావేశాన్ని గుంటూరులోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఉదయం 10.30 గంటలకు ఏర్పాటు చేశారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షత వహించి సమావేశాన్ని నిర్వహించనున్నారు. 2023-24 వార్షిక సంవత్సరం అంచనా బడ్జెట్‌ని అజెండాలో చేర్చారు. రూ.1,154.47 కోట్ల అంచనా బడ్జెట్‌ని రూపొందించారు. వ్యయం రూ.1,152.96 కోట్లుగా, రూ.1.50 కోట్లు మిగులుగా అధికారులు చూపారు. జిల్లాపరిషత్తు సాధారణ నిధి వరకు 2023-24 అంచనా బడ్జెట్‌ రూ.61.26 కోట్లుగా.. వ్యయం రూ.60.85 కోట్లు కానున్నాయని అంచనా వేశారు. మిగులు రూ.40.71 లక్షలు చూపారు. జనవరి 29న జరిగిన ఒకటో స్థాయీ సంఘ సమావేశంలో జడ్పీ బడ్జెట్‌ తీర్మానాన్ని ఆమోదించారు. దీనిని అధికారులు జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టి సభ్యులు చర్చించిన తర్వాత ఆమోదం తీసుకోనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా ముందస్తుగా ఆమోదించిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు అజెండాలో చేర్చారు. బడ్జెట్‌ని ఆమోదించిన తర్వాత ప్రభుత్వ శాఖలపై చర్చను సభ్యులు కోరితే చర్చించే అవకాశం ఉంది.

అంకెల్లోనే నిధులు : జిల్లాపరిషత్తు బడ్జెట్‌ని రూ.1,154.47 కోట్లుగా చూపినప్పటికీ అందులో రూ.61.26 కోట్లు మాత్రమే జడ్పీ సాధారణ నిధికి జమయ్యేవి. మిగిలిన రూ.1,093.21 కోట్లు పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించినవి కావడం గమనార్హం. ఈ నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీరాజ్‌ శాఖకు విడుదల చేస్తున్నాయి. ఈ నిధులతో చేపట్టే పనులు పీఆర్‌ అధికారులు నేరుగా చేస్తున్నవే. కనీసం జిల్లాపరిషత్తు పాలకవర్గం, అధికారుల దృష్టికి తీసుకురాకుండానే పనులు చేస్తున్నారు. ఆ నిధులను జడ్పీ బడ్జెట్‌లో చూపడంతో అంకెల్లో భారీగా కనిపిస్తున్నాయి. బయటి నుంచి చూసే వారికి రూ.వందల కోట్ల నిధులు అందుబాటులో ఉన్నట్లు కనిపిస్తుంది. వాస్తవంగా చూస్తే జడ్పీకి ఎలాంటి పాత్ర లేదు. జడ్పీ బడ్జెట్‌లో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ నిధులను చూపడంపై అధికార వర్గాల్లో గందరగోళం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని