logo

తాడేపల్లి వైకాపాలో వర్గ విబేధాలు

మంగళగిరి-తాడేపల్లి నగరపాలకసంస్థ పరిధిలోని వైకాపాలో శనివారం విభేదాలు భగ్గుమన్నాయి. తాడేపల్లి వైకాపా పట్టణ మహిళావిభాగం అధ్యక్షురాలు సంపూర్ణ పార్వతి వైఎస్సార్‌ సీపీ-జగన్‌ యువసేన అనే వాట్సాప్‌ గ్రూప్‌లో స్థానిక వైకాపా నేతలను అగౌరవపరిచేలా ఉండే ఆడియోను శుక్రవారం మధ్యాహ్నం పోస్టు చేశారు.

Published : 05 Feb 2023 04:32 IST

తాడేపల్లి సీఐకి ఫిర్యాదు చేస్తున్న మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ మహాలక్ష్మి, పార్టీ నేతలు  కేళి వెంకటేశ్వరరావు, గోరే బాబు

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-తాడేపల్లి: మంగళగిరి-తాడేపల్లి నగరపాలకసంస్థ పరిధిలోని వైకాపాలో శనివారం విభేదాలు భగ్గుమన్నాయి. తాడేపల్లి వైకాపా పట్టణ మహిళావిభాగం అధ్యక్షురాలు సంపూర్ణ పార్వతి వైఎస్సార్‌ సీపీ-జగన్‌ యువసేన అనే వాట్సాప్‌ గ్రూప్‌లో స్థానిక వైకాపా నేతలను అగౌరవపరిచేలా ఉండే ఆడియోను శుక్రవారం మధ్యాహ్నం పోస్టు చేశారు. ఇది స్థానిక వైకాపా నేతల్లో దుమారానికి కారణమైంది. ‘‘తాడేపల్లి మాజీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కొయ్యగూర మహాలక్ష్మిని ఛైర్‌పర్సన్‌ కుర్చీలో కూర్చొబెట్టి అధికారం మొత్తం మాజీ ఎంపీపీ వేమారెడ్డి చలాయించారు. ఆమె చేసింది ఏమీ లేదు. తాడేపల్లి వైకాపా పట్టణ గౌరవ అధ్యక్షుడు కేళి వెంకటేశ్వరరావు అటు ఇటు గ్యాంబ్లింగ్‌ ఆడుతున్నారు. నిర్మల, అబ్బూ, కేళి వెంకటేశ్వరరావు, గోరే బాబు ఒక ముఠాలాగా తయారై వేణు అన్నను ఇబ్బంది పెట్టాలని చూశారు. వైకాపా వాళ్లను తెదేపాలోకి తీసుకెళ్లడానికి తాడేపల్లి పట్టణ తెదేపా అధ్యక్షుడు వెంకట్రావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని జగన్‌ దృష్టికి తాడేపల్లి పట్టణ వైకాపా అధ్యక్షుడు వేణు తీసుకెళ్లారు. కరోనా సమయంలో వేమారెడ్డి మూడేళ్లు బయటికి రాకపోవడంతో జనం మర్చిపోయారు. జనం మర్చిపోయిన నాయకుడిని మీరు ఫోన్‌లు చేసి బతికిస్తున్నారు. వేమారెడ్డి వర్గం వారు తెదేపా, జనసేనకు వెళతామని బెదిరిస్తే వైకాపాలో ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నారు. వేమారెడ్డి విబేధించి పోయినప్పుడే ఎన్నికల్లో 10వేల మెజారిటీ తీసుకువచ్చి ఎమ్మెల్యేను గెలిపించుకున్నాం.’’ అని సంపూర్ణ పార్వతి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడిన ఆడియోను ఆమె పోస్టు చేసింది. ఇది సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయడంతో కేళి వెంకటేశ్వరరావు, తాడేపల్లి మాజీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కొయ్యగూర మహాలక్ష్మి తమను సంపూర్ణ పార్వతి అగౌరవపరిచేలా మాట్లాడారని ఆమెపై చర్యలు తీసుకోవాలని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  తాను ఎస్సీ సామాజికవర్గానికి చెందినందున చులకనగా మాట్లాడటంతోపాటు అవమానకరంగా వ్యాఖ్యలు చేసినందున సంపూర్ణ పార్వతిపై చర్యలు తీసుకోవాలని కొయ్యగూర మహాలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా తనను మోసగాడుగా పేర్కొనడంతోపాటు తనపై పలు ఆరోపణలు చేయడంతో మానసికంగా కుంగిపోయాయని ఇందుకు బాధ్యురాలైన సంపూర్ణ పార్వతిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తాడేపల్లి వైకాపా పట్టణ గౌరవ అధ్యక్షుడు కేళి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. అనంతరం వీరిద్దరూ విలేకరులతో మాట్లాడుతూ  పార్టీ పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకెళతామని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని