logo

ఏల్చూరు పంచాయతీలో రూ.36 లక్షల కుంభకోణం

ఏల్చూరు గ్రామ పంచాయతీలో రూ.36 లక్షల కుంభకోణం జరిగినట్లు స్థానిక ఎంపీటీసీ సభ్యులు ఓరుగంటి కోటిరెడ్డి, ఎం.రమాదేవి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు వి.అనంతరెడ్డి, బండికల్లు ఆదినారాయణ, షేక్‌ జానీబాషా, వి.నాగేశ్వరరావు, ఎ.ఆదాం ఆరోపించారు.

Published : 05 Feb 2023 04:32 IST

వైకాపా ఎంపీటీసీ, వార్డు సభ్యుల ఆరోపణ

ఏల్చూరు (సంతమాగులూరు), న్యూస్‌టుడే: ఏల్చూరు గ్రామ పంచాయతీలో రూ.36 లక్షల కుంభకోణం జరిగినట్లు స్థానిక ఎంపీటీసీ సభ్యులు ఓరుగంటి కోటిరెడ్డి, ఎం.రమాదేవి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు వి.అనంతరెడ్డి, బండికల్లు ఆదినారాయణ, షేక్‌ జానీబాషా, వి.నాగేశ్వరరావు, ఎ.ఆదాం ఆరోపించారు. ఏల్చూరులో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. 2021లో పంచాయతీలో రూ.14.88 లక్షల మేర అక్రమాలు జరిగినట్లు అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్‌, డీపీవో, ఉన్నతాధికారులకు స్పందన ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తరువాత జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు అప్పటి ఒంగోలు డీఎల్‌పీవో ఏల్చూరు పంచాయతీలో విచారణ చేసి, నివేదికను ఉన్నతాధికారులకు అందించారని చెప్పారు. దీనిపై 2022లో స్థానిక పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసరావు, షుకూర్‌, ఈవోపీఆర్డీ ప్రసాదరావుపై చర్యలు తీసుకోవాలని అప్పటి జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులిచ్చారని వెల్లడించారు. అయినప్పటికీ అప్పటి డీపీవో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో అక్రమ లావాదేవీలు జరిగిన బిల్లుల్ని 2022లో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసరావు, షుకూర్‌ లాగిన్‌ ద్వారా సర్పంచి మందా సూరిబాబు రూ.10.64 లక్షల నిధుల్ని డ్రా చేసినట్లు వెల్లడించారు. వీటిని పలువురి పేరిటి బిల్లులు సృష్టించినట్లు వారు తెలిపారు. వీటితోపాటు మొత్తం పంచాయతీలో రూ.36 లక్షల మేర అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు వివరించారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు వారు తెలిపారు. తాజాగా కోర్టు ఆదేశాల ప్రకారం అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తీర్పు వచ్చినట్లు వివరించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీకి మొత్తం సొమ్మును జమ చేసేలా చూడాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని