logo

వలపు వల.. బైక్‌ మెకానిక్‌ విలవిల!

‘మీరు చాలా అందంగా ఉన్నారు. చాలా మంచి వారులా కనిస్తున్నారు. నా భర్త తాగి వచ్చి కొడుతున్నాడు. అతని బాధలు భరించలేకున్నా.

Updated : 07 Feb 2023 06:15 IST

నెహ్రూనగర్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ‘మీరు చాలా అందంగా ఉన్నారు. చాలా మంచి వారులా కనిస్తున్నారు. నా భర్త తాగి వచ్చి కొడుతున్నాడు. అతని బాధలు భరించలేకున్నా. ఆయనకు విడాకులిచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటూ’ ఓ వృద్ధుడికి వలపు వల విసిరి నిలువ దోపిడీ చేసిన వైనంపై బాధితుడు సోమవారం పోలీసు కార్యాలయంలో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ‘పొన్నూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి అక్కడ బైక్‌ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అతని భార్య ఎనిమిదేళ్ల కిందట మృతి చెందింది.  ఈ క్రమంలో ఓ వివాహిత అతనికి సెల్‌ఫోన్‌ నంబర్‌ సేకరించి మాట్లాడింది. తన ద్విచక్ర వాహనం రిపేరు చేయాలంటూ కొద్దిసేపు మాట్లాడి ఆ తర్వాత మీరు బాగా మాట్లాడుతున్నారు.. మంచి వారంటూ మాటలు కలిపింది. అలా కొద్ది రోజులు ఫోన్‌లో ముచ్చట్లు చెబుతూ ఆకట్టుకుంది.  అంతటితో ఆగకుండా తన అమ్మతో మాట్లాడమని ఫోన్‌ ఇచ్చింది. కిలాడీ లేడీ అమ్మ ఇంకొంచెం మాయచేస్తూ.. ‘మా అల్లుడు చెడ్డవాడు. అతనికి రూ.3 లక్షలు ఇస్తే తెగతెంపులు చేసుకుంటాం. మూడు నెలల్లో విడాకులు ఇచ్చేస్తాం. ఆ తర్వాత మా అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటుంద’ని నమ్మించింది. వాళ్ల మాటలు నమ్మిన మెకానిక్‌ తన వద్ద ఉన్న రూ.లక్ష ఇచ్చాడు. కొద్ది రోజుల తర్వాత కుమార్తె మెకానిక్‌కు ఫోన్‌ చేసి ‘నా భర్త కొడుతున్నాడు. గొంతు నులిమి చిత్రహింసలు పెడుతున్నాడని వగలమారి ఏడుపు ఏడ్చింది. నా భర్తకు డబ్బులు ఇచ్చి విడాకులు తీసుకుందామని మా బంధువు వద్దకు వెళితే అతను తన కోరిక తీర్చమంటున్నాడంటూ కొత్త నాటకం ఆడింది. నీవు మరో రూ.రెండు లక్షలు ఇస్తే నా మొగుడికి ఇచ్చేసి రేపు తెల్లాసరికల్లా నీ దగ్గరకు వచ్చేస్తా. నీకు భార్యను అయిపోతానంటూ మాట్లాడింది. ఒంటరి జీవితం గడుపుతున్న ఆ వృద్ధుడు ఆ కిలాడీ లేడీ మాటలకు కరిగిపోయి అప్పు చేసి రూ.1.20 లక్షలు ఇచ్చాడు. అవి తీసుకొని బాధపడకు తనకు బ్యాంకు అధికారులు తెలుసు రూ.5 లక్షలు లోన్‌ ఇప్పిస్తానంటూ అక్కడ నుంచి పలాయనం చిత్తగించింది. రోజులు గడచినా ఆమె రాలేదు. పైగా ఇంకా డబ్బులు కావాలంటూ కొత్త నాటకం ఆడటంతో అనుమానం వచ్చి విచారిస్తే తల్లి, కుమార్తెలు కలిసి ఇలా నాటకాలు ఆడి నగదు దోచుకుంటుంటారని తెలుసుకున్నాడు. ఆ మహిళ తన భర్తతో హాయిగా కలిసి ఉంటూ తల్లితో పాటు అందరూ మద్యం తాగడం, బిర్యానీ తింటూ జల్సాలు చేస్తూ ఒంటరిగా ఉండే మగవాళ్లను మోసగిస్తుంటారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని