logo

బడి ట్యాబ్‌ల్లో అన్నీ లభ్యం

ఎనిమిదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్స్‌లో మీ చదువులకు సంబంధించిన అంశాలు మినహా వాటిల్లో మిగిలినవి ఏవీ లభ్యం కావు. అలాంటి వాటికి ముందుగానే మీ మేనమామ(సీఎం) కత్తెరేసి వాటిని మీకు అందిస్తున్నారు.

Published : 22 Mar 2023 05:26 IST

అవాక్కవుతున్న ఉపాధ్యాయులు
యూట్యూబ్‌ నుంచి అశ్లీల చిత్రాలు డౌన్‌లోడ్‌
మేలుకన్నా నష్టం జరుగుతుందని టీచర్ల ఆందోళన

ఈనాడు-అమరావతి : ఎనిమిదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్స్‌లో మీ చదువులకు సంబంధించిన అంశాలు మినహా వాటిల్లో మిగిలినవి ఏవీ లభ్యం కావు. అలాంటి వాటికి ముందుగానే మీ మేనమామ(సీఎం) కత్తెరేసి వాటిని మీకు అందిస్తున్నారు.

ట్యాబ్‌ల పంపిణీ సందర్భంగా చుండూరు మండలం యడ్లపల్లిలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలివి.

కానీ ఆచరణలో ఆ మాటలు వట్టిపోయాయి. విద్యార్థులు చూడకూడని పాటలు, సినిమాలు, అశ్లీల చిత్రాల సహా ప్రతిదీ ట్యాబ్‌ల్లో లభ్యమవుతుండటంతో ఉపాధ్యాయులే అవాక్కవుతున్నారు. గుంటూరు నగరంలో ఓ పాఠశాల విద్యార్థి ఇలాంటివి డౌన్‌లోడ్‌ చేసి పెట్టడానికి సహచర విద్యార్థుల నుంచి రూ.50 చొప్పున వసూలు చేసి వాటిని వారి ట్యాబ్‌ల్లో ప్రవేశపెట్టారు. పల్నాడు జిల్లాలోని ఓ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు అశ్లీల చిత్రాలు చూస్తూ ఏకంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులకే పట్టుబడ్డారు. వారు అంతటితో సరిపుచ్చలేదు. వాటిని పదేపదే చూస్తుండటంతో ఇది అంతిమంగా విద్యార్థులకు నష్టం చేస్తుందని చెప్పి ఓ టీచర్‌ బాధ్యులైన పిల్లల తల్లిదండ్రులను కలుసుకుని జరిగిన విషయం చెప్పి వారికి భయం చెప్పాలని కోరారు. దీన్నిబట్టి ట్యాబ్‌ల్లో అన్ని లభ్యమవుతున్నాయనేది స్పష్టమవుతోంది.

ప్రపంచంతో పోటీపడాలని..

మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలంటే పాఠశాల విద్యలోనే పిల్లలకు కంప్యూటర్‌ విద్యపై అవగాహన ఉండాలి. తద్వారానే పోటీ ప్రపంచంలో నెట్టుకొస్తారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులు, విద్యాసంస్థల్లో చోటుచేసుకునే ఆవిష్కరణలు ఇలా అనేక విషయాలను విద్యార్థులు అవగాహన చేసుకోవడానికి ట్యాబ్స్‌ ప్రత్యామ్నాయం. అందుకే బోలెడంత ఖర్చుపెట్టి వాటిని విద్యార్థులకు అందిస్తున్నాం. వాటిని సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలు, ప్రతిభా సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మొదలుకుని ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ వల్లెవేస్తున్నారు. అయితే వాటిని ఉపయోగించుకుని కొందరు తమకు తెలియని విషయాలు, అర్థంకాని పాఠ్యాంశాలను అందులో చూసి నేర్చుకుంటున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ట్యాబ్‌ల్లో లేనిపోనివి చూసి తమ విలువైన సమాయాన్ని వృథా చేసుకుంటూ ఎందుకు పనికి రాకుండా పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాబ్‌లు దుర్వినియోగం చేస్తున్నారని విద్యార్థులకు మేలు జరగాలని భావిస్తే నష్టం జరుగుతోందని కొందరు టీచర్లు అంటున్నారు. ప్రతి విద్యార్థి నిత్యం ట్యాబ్‌లో ఎన్ని వీడియోలు చూశారు, సిలబస్‌కు సంబంధించిన పాఠ్యాంశాలు ఏం చూశారు, కొత్త అంశాలు ఏం నేర్చుకున్నారని ప్రతి వారం విద్యార్థుల వారీగా విశ్లేషిస్తున్నారు. 8వ తరగతి బోధించే ఉపాధ్యాయులను ఈ వివరాలు కోరుతున్నారు. దీంతో ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుడు నిత్యం ట్యాబ్‌ చూడక తప్పటం లేదు. ప్రతి రోజు ఏదో ఒక సబ్జెక్టు గంట పాటు ట్యాబ్‌లోనే బోధించాలని తప్పనిసరి చేశారు. ప్రతి విద్యార్థి వద్ద ట్యాబ్‌లు ఉంటున్నాయి. ఇదే అదనుగా చూడకూడని అంశాలను చూస్తున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు.

కోడ్‌ మార్చేసి..

విద్యార్థులకు అందజేసిన ట్యాబ్స్‌లో బైజూస్‌, శాంసంగ్‌ కంటెంట్‌ రెండు ఐచ్ఛికాలున్నాయి. బైజూస్‌లో విద్యార్థులకు పాఠ్యాంశాలు, వీడియోలు మాత్రమే లభ్యమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కంప్యూటర్‌ నాలెడ్జి, సాంకేతిక విషయాలు తెలుసుకోవడానికి శాంసంగ్‌ కంటెంట్‌లోకి ప్రవేశిస్తున్నారు. అందులో యూట్యూబ్‌లోకి వెళ్లి వారికి ఏది కావాలంటే అది చూస్తున్నారని శాంసంగ్‌ కంటెంట్‌లో ఏదిపడితే అది రాకుండా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఆ ట్యాబ్‌ల్లో అనవసరమైనవి విద్యార్థులకు అందుబాటులో లేకుండా నియంత్రించొచ్చని ఉపాధ్యాయులు సలహానిస్తున్నారు. ప్రతి విద్యార్థి ట్యాబ్‌ ఆన్‌ చేయడానికి పాస్‌వర్డు కేటాయించారు. విద్యాశాఖ ఇచ్చిన పాస్‌వర్డును కాదని కొందరు విద్యార్థులు అసలు ట్యాబ్‌ల్లో ఏయే అంశాలు ఉన్నాయోనని చెప్పి వారే సొంతంగా కోడ్‌ క్రియేట్‌ చేసుకుని ఇలాంటివి చూస్తున్నారని ఉపాధ్యాయుడొకరు చెప్పారు. టెక్నాలజీ వినియోగంలో విద్యార్థులు బాగా ముందంజలో ఉండటం వల్లే వారు ఏదైనా చూడగలుగుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు అనవసరమైన సమాచారం లభ్యం కాకుండా ఆయా అంశాలకు లాక్‌ పెట్టాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని