logo

మేం చెల్లిస్తామన్నారు.. చేతులెత్తేశారు

గడప గడపకు-మన ప్రభుత్వ కార్యక్రమం కింద నగర, పురపాలికల్లో అధికార యంత్రాంగం గుత్తేదారులపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ పనులు చేయించింది.

Updated : 22 Mar 2023 06:12 IST

పనులు చేసి రెండు నెలలైనా పైసా ఇవ్వలేదన్న గుత్తేదారులు

రాజీవ్‌గాంధీ కాలనీలో నిర్మించిన సిమెంటు రహదారి

ఈనాడు-అమరావతి : గడప గడపకు-మన ప్రభుత్వ కార్యక్రమం కింద నగర, పురపాలికల్లో అధికార యంత్రాంగం గుత్తేదారులపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ పనులు చేయించింది. నెలలు గడుస్తున్నా బిల్లులు మాత్రం చెల్లించకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. పనులు చేసి రెండు మాసాలు గడిచిపోయింది. వాటికి సంబంధించిన నిధులు పురపాలికల్లోనే ఉన్నా యంత్రాంగం మాత్రం చెల్లించడానికి మీనమేషాలు లెక్కిస్తోందని గుత్తేదారులు ఆరోపిస్తున్నారు. అసలు మంజూరు కావాలంటే ప్రొసీజర్‌ ప్రకారం ఇంజినీరింగ్‌ అధికారులు ఎంబుక్కు రికార్డు చేసి బిల్లులు ప్రతిపాదించాలి. అది చేయకుండా మొక్కుబడిగా బిల్లులు పెట్టారని అందువల్లే అవి సీఎఫ్‌ఎంఎస్‌-2 వెర్షన్‌లో అప్‌లోడ్‌ కావటం లేదని మున్సిపల్‌, పీఏఓ అధికారులకు సమన్వయం లేదని పర్యవసానంగా బిల్లులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉన్నాయని గుంటూరు నగరంలో పనులు చేసిన గుత్తేదారులు చెబుతున్నారు. రెండు మాసాల క్రితమే పనులు చేస్తే రెండు రోజుల కిందట సుమారు రూ.3 కోట్లకు బిల్లులు పెట్టారని అవి తప్పులు తడకగా ఉన్నాయని వాటిని పీఏఓ అధికారులు తిరస్కరించారని వినికిడి. గుంటూరు నగరపాలకలోనే కాదు మంగళగిరి-తాడేపల్లి నగరపాలక, తెనాలి, పొన్నూరు,.రేపల్లె, బాపట్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, పిడుగురాళ్ల, మాచర్ల, వినుకొండ పురపాలికల్లోనూ ఇదే పరిస్థితని అంటున్నారు.  పనులు చేసే వరకు ఎమ్మెల్యేలు, అధికారులు తమపై ఒత్తిడి తీసుకొచ్చారనీ తీరా పూర్తిచేశాక బిల్లుల చెల్లింపు గురించి అడుగుతుంటే సీఎఫ్‌ఎంఎస్‌, పీఏఓలోనే బిల్లులు పాస్‌ కావాలని సాధారణ నిధుల నుంచి ఇవ్వటానికి నిబంధనలు అంగీకరించటం లేదని చెప్పి తప్పించుకుంటున్నారని అంటున్నారు. అత్యధికంగా గుంటూరు నగరపాలకలో రూ.15 కోట్లకు పైగా పనులు చేశారు. మిగిలిన పురపాలికల్లో మరో రూ.6-7 కోట్ల వరకు చేసిన పనులు ఉంటాయని సమాచారం.

సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున.. సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులిస్తున్నామని ఆ విలువతో కూడిన పనులు పూర్తికాగానే తిరిగి చేస్తే మళ్లీ నిధులు ఇస్తామని ప్రభుత్వం పేర్కొనటంతో ప్రతి డివిజన్‌, వార్డులో రూ. 20 లక్షల నుంచి రూ.50-60 లక్షల వరకు పనులు జరిగాయి. కేటాయిస్తామని చెప్పిన రూ.20 లక్షల్లో 30 శాతం నిధులే తొలుత పురపాలికల ఖాతాలకు జమ చేశారు. అసలు ఇప్పటివరకు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులే సీఎఫ్‌ఎంఎస్‌కు ఎక్కలేదు.  

రాష్ట్రంలోనే గుంటూరు నగరపాలకలో గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమం కింద అత్యధిక పనులు చేశాం. వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం అధికారులు ఇవ్వటం లేదు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా నగరపాలక సాధారణ నిధుల నుంచి చెల్లిస్తాం. పనులు ప్రారంభించాలని నాడు కమిషనర్‌, పర్యవేక్షక ఇంజినీర్‌(ఎస్‌ఈ) నమ్మబలికారు. ప్రస్తుతం వారెవరూ నోరుమెదపడం లేదు.

గుంటూరుకు చెందిన ఓ గుత్తేదారు

14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల బిల్లులే ఇప్పటి వరకు చెల్లించలేదు. గడప గడపకూ మన ప్రభుత్వం కింద చేపట్టిన వాటికి చెలిస్తామంటే నమ్మశక్యం కావట్లేదు. అందుకే టెండర్లలో పాల్గొనలేదని చెబితే ఉన్నతాధికారి ఒకరు పిలిపించుకుని డబ్బులు ఇప్పించే బాధ్యత నాది అంటూ నాడు ప్రగల్భాలు పలికారు. ఆయన కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటి వరకు అసలు నిబంధనల ప్రకారం సీఎఫ్‌ఎంఎస్‌-2 వెర్షన్‌లో బిల్లులే పెట్టలేదు. ఎప్పుడు మంజూరవుతాయో తెలియని పరిస్థితి.

ఇదీ మరో గుత్తేదారుడి వేదన

చెల్లించని మాట వాస్తవమే

బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. చెల్లించాలంటే తొలుత చేసిన పనులకు సంబంధించి ఎంబుక్కు రికార్డు చేయాలి. ఇవేం లేకుండా బిల్లులు పెడితే వెంటనే తిరస్కరిస్తున్నారని ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఉమ్మడి గుంటూరులో ఏ పురపాలికలోనూ ఇప్పటివరకు చెల్లించిన దాఖలాలు లేవు. తామైతే నిధులకు సమస్యలేదని చెప్పి పనులు చేయించిన మాట వాస్తవమే. చేసిన పనులు ఎక్కువగా ఉండగా పురపాలికల్లో నిధులు తక్కువగా ఉన్నాయని అవి ఏ మూలకు సరిపోవని వెంటనే ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేస్తేనే అందరికీ ఇవ్వడం సాధ్యపడదని చెబుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని