logo

నిజాంపట్నం సహకార సంఘ సీఈవో అక్రమాలెన్నెన్నో!

నిజాంపట్నం సహకార సంఘం సీఈవోగా పనిచేసి సస్పెన్షన్‌కు గురైన మోపిదేవి నాగేశ్వరరావు నిర్లక్ష్యవైఖరి రైతుల పాలిట శాపంగా మారింది.

Published : 28 Mar 2023 05:57 IST

ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న వైనం

నిజాంపట్నం, న్యూస్‌టుడే : నిజాంపట్నం సహకార సంఘం సీఈవోగా పనిచేసి సస్పెన్షన్‌కు గురైన మోపిదేవి నాగేశ్వరరావు నిర్లక్ష్యవైఖరి రైతుల పాలిట శాపంగా మారింది. ఆయన హయాంలో రుణం తీసుకున్న రైతుల పట్టాదారు పాస్‌ పుస్తకాలు కనిపించకుండా పోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తమ పుస్తకాలు లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక సతమతం అవుతున్నారు. సీఈవో అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.  
* నిజాంపట్నంకు చెందిన దాసరి శ్రీనివాసరావు తన పొలానికి సంబంధించిన పాసు పుస్తకాలు హామీగా ఉంచి రుణం తీసుకున్నారు. నగదు చెల్లిస్తాను.. పాస్‌ పుస్తకాలు ఇవ్వమని సీఈవోను కోరితే పుస్తకాలు పోయాయని, కొత్త వాటికి దరఖాస్తు చేసుకోమని ఉచిత సలహా ఇచ్చారని వాపోతున్నారు.
*  గోకర్ణమఠం గ్రామానికి చెందిన మోకా కృష్ణ తనకున్న పొలంపై పంట రుణం తీసుకున్నారు. అదే పొలంపై సీసీ లోన్‌ మంజూరు చేయిస్తానని నాగేశ్వరరావు రూ.5 వేలు లంచం తీసుకోవడమే కాక, పాస్‌ పుస్తకాలు పోయాయి. కొత్త వాటికి దరఖాస్తు చేసుకోవాలంటూ సమాధానం చెప్పారు.
*  ఇదే గ్రామానికి చెందిన నిజహ్తనిస్సా తనకున్న 2.5 ఎకరాలపై సొసైటీలో రుణం తీసుకుని చెల్లించారు. పట్టాదారు పట్టాదారు పాస్‌ పుస్తకం ఇవ్వమని నెలలుగా తిరుగుతున్నారు. ఆమెకు పుస్తకం పోయిందనే సమాధానమే ఎదురైందని వాపోతున్నారు.
దీనిపై నిజాంపట్నం సహకార సంఘం ఛైర్‌పర్సన్‌ మరకా శ్రీనివాసరావును వివరణ కోరగా రైతుల పాస్‌ పుస్తకాలు అప్పగించే బాధ్యత సొసైటీదే. సస్పెన్షన్‌కు గురైన నాగేశ్వరావుపై కేసు నమోదు చేయిస్తాం. రైతులతో పాస్‌ పుస్తకాలకు దరఖాస్తు చేయించి ఇప్పిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని