logo

చెల్లిస్తారా... చర్యలు తీసుకోమంటారా!

గ్రామ పంచాయతీలపై ప్రభుత్వం విద్యుత్‌ బిల్లుల భారం మోపింది. గతంలో కరెంటు బిల్లుల బకాయి పేరుతో 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులను జమ చేసిన ప్రభుత్వం తాజాగా గ్రామ పంచాయతీల సాధారణ నిధుల నుంచి

Published : 30 Mar 2023 05:28 IST

సాధారణ నిధుల నుంచి విద్యుత్తు బిల్లులు చెల్లించాలట
పంచాయతీలపై భారం మోపేలా ఉన్నతాధికారుల ఆదేశాలు
న్యూస్‌టుడే, పొన్నూరు, ప్రత్తిపాడు, చేబ్రోలు

చేబ్రోలు మండల పరిధిలోని వీరనాయకునిపాలెం మైనర్‌ గ్రామ పంచాయతీలో 185 గృహాలకు ఇంటిపన్ను, నీటి పన్నుపై రూ.1.7లక్షలు ఆదాయం సమకూరుతుంది. 15వ ఆర్థిక సంఘం నిధులు కొంత విద్యుత్‌ బిల్లులు చెల్లించగా పోను వివిధ రకాల పనులకు ఖర్చు చేశారు. పన్ను వసూలు నూటికి నూరు శాతం వసూలు చేసినట్లు పంచాయతీ అధికారులు ప్రకటించారు. విద్యుత్‌ బిల్లులు రూ.8లక్షలు చెల్లించాల్సి ఉంది.


ప్రత్తిపాడు మేజర్‌ గ్రామ పంచాయతీలో 3300 గృహాలకు ఇంటి పన్ను, నీటి పన్ను ద్వారా రూ.44లక్షలు జమ అవుతుంది. ఇప్పటి వరకు రూ.29లక్షలు వసూలు చేశారు. విద్యుత్‌ బకాయిలు మాత్రం రూ.కోటి ఉన్నట్లు పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు.

పొన్నూరు మండలం సీతారామపురం గ్రామ సచివాలయం

గ్రామ పంచాయతీలపై ప్రభుత్వం విద్యుత్‌ బిల్లుల భారం మోపింది. గతంలో కరెంటు బిల్లుల బకాయి పేరుతో 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులను జమ చేసిన ప్రభుత్వం తాజాగా గ్రామ పంచాయతీల సాధారణ నిధుల నుంచి విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ బిల్లులు చెల్లిస్తారా, లేని పక్షంలో శాఖా పరమైన చర్యలు తీసుకోమంటారా అంటూ పంచాయతీ ఉన్నతాధికారులు స్థానిక పంచాయతీ యంత్రాంగంపై తీవ్రమైన ఒత్తిళ్లు తీసుకొచ్చారు. దీంతో కొంత మంది పంచాయతీ అధికారులు సాధారణ నిధుల నుంచి ఎంతో కొంత జమ చేసే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు సాధారణ నిధుల నుంచి కరెంటు బిల్లులు చెల్లిస్తే పంచాయతీ పరిపాలనపై భారం పడుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే క్లాప్‌ మిత్రలు, సచివాలయాల నిర్వహణ కోసం పంచాయతీ సాధారణ నిధుల నుంచి ఖర్చు చేయడంతో నిధులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. పంచాయతీల్లో చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కూడా నిధుల కొరత వెంటాడుతోందని పంచాయతీ అధికారులు ఆవేదన చెందుతున్నారు. ఇలాగైతే పంచాయతీ పరిపాలన పడకేయడం ఖాయమని సర్పంచులు కొంత మంది వాపోతున్నారు.

దీనిపై జిల్లా పంచాయతీ అధికారి కేశవరెడ్డిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కరెంటు బిల్లులు బకాయిలను గ్రామ పంచాయతీల సాధారణ నిధుల నుంచి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని