logo

పండగ పూట విషాదం

వారిద్దరూ శ్రీరాముడి కల్యాణ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు.. భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు.. అనంతరం స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు.

Published : 31 Mar 2023 05:34 IST

ఈతకు వెళ్లి ఇద్దరు ఇంటర్‌ విద్యార్థుల మృత్యువాత
పల్నాడు  జిల్లాలో ఘటన

అమరావతి, న్యూస్‌టుడే: వారిద్దరూ శ్రీరాముడి కల్యాణ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు.. భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు.. అనంతరం స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన గురువారం సాయంత్రం పల్నాడు జిల్లా అమరావతిలో చోటుచేసుకుంది. పెదకూరపాడు మండలం 75త్యాళ్లూరుకు చెందిన మల్లికార్జునరెడ్డి(17), రాజశేఖరరెడ్డి(17) గుంటూరులోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తి చేశారు. ఇటీవలే పరీక్షలు రాసి సొంతూరికి వచ్చారు. గురువారం శ్రీరామ నవమి సందర్భంగా గ్రామంలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. అందరికీ పానకం, వడపప్పు పంపిణీ చేశారు. అనంతరం మధ్యాహ్నం చరవాణి మరమ్మతు చేయించుకోవాలని చెప్పి స్నేహితులు కార్తీకరెడ్డి, నాగనితిన్‌రెడ్డితో కలిసి అమరావతి వచ్చారు. అమరేశ్వరఘాట్‌ సమీపంలోని కృష్ణానదిలో ఈతకు వెళ్లారు. అక్కడ లోతు తెలియకపోవడంతో మల్లికార్జునరెడ్డి, రాజశేఖరరెడ్డి నీటిలో మునిగిపోయారు. మిగిలిన ఇద్దరు స్నేహితులు భయంతో కేకలు వేయగా సమీపంలోని స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఇద్దరూ మృత్యువాత పడ్డారు. రాజశేఖరెడ్డి తండ్రి అంకిరెడ్డి మృతి చెందగా తల్లి కుటుంబ బాధ్యతలు మోస్తూ తన ఇద్దరు కుమారులను చదివిస్తోంది. రామలింగారెడ్డి రెండో కుమారుడు మల్లికార్జునరెడ్డి. వీరిది వ్యవసాయం కుటుంబం. సెలవులకు ఇంటికి వచ్చిన ఇద్దరూ విగతజీవులుగా మారడంతో ఆ కుటుంబాలు విషాదంలో మునిగాయి. 75 త్యాళ్లూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మట్టి వంతెనే కారణం

అమరావతి రీచ్‌లో తవ్వకాలు జరిపిన ఇసుక రవాణా కోసం కృష్ణానదికి అడ్డుగా మట్టి వంతెన వేశారు. ఈ వంతెన కోసం ఇరువైపులా సుమారు 20 అడుగుల లోతు మేర గుంతలు తవ్వారు. ఆ గుంతలు ప్రమాదకరంగా మారాయి. వంతెన కింద తూములు వేయడంతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. నీటి నిల్వ ఎక్కువగా ఉండటంతో ఈత కొట్టడానికి అనువుగా ఉందని భావించి విద్యార్థులకు వంతెన వద్ద దిగారు. ఇసుక రీచ్‌ నిర్వాహకులు అడ్డగోలుగా గుంతలు తవ్వేయడంతో ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని