రాజధానిలో మట్టి పెళ్లనూ పెకిలించలేరు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... అన్నదాతలు చేస్తున్న ఉద్యమం శుక్రవారంతో 1200 రోజులు పూర్తి చేసుకుంది. పోలీసు కేసులు, ఆంక్షలు, నిర్బంధాలను దాటుకొని మొక్కవోని దీక్షతో రైతులు, రైతు కూలీలు, మహిళలు పోరుబాట కొనసాగిస్తున్నారు.
మందడం శిబిరంలో వక్తలు 1200వ రోజుకు రాజధాని ఉద్యమం
తుళ్లూరు, అమరావతి - న్యూస్టుడే
జై అమరావతి అంటూ రైతు మహిళల నినాదాలు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... అన్నదాతలు చేస్తున్న ఉద్యమం శుక్రవారంతో 1200 రోజులు పూర్తి చేసుకుంది. పోలీసు కేసులు, ఆంక్షలు, నిర్బంధాలను దాటుకొని మొక్కవోని దీక్షతో రైతులు, రైతు కూలీలు, మహిళలు పోరుబాట కొనసాగిస్తున్నారు. అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని, ఆంధ్రప్రదేశ్ను కాపాడాలని పలు రూపాల్లో నిరసనలు, దీక్షలు, ఆందోళనలు చేస్తున్న రైతన్నలు... మరో వైపు రాజధానిపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై నిరంతరం న్యాయ పోరాటం చేస్తున్నారు.
ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి మాత్రమేనని, దానిని తరలించడం కాదు... మట్టి పెళ్లను కూడా పెకిలించలేరని వివిధ రాజకీయ పార్టీల నాయకులు అన్నారు. ఉద్యమం 1200 రోజులకు చేరుకున్న సందర్భంగా శుక్రవారం మందడం శిబిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి కుల, మత, వర్గ, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా నాయకులు తరలివచ్చి మద్దతు తెలిపారు. తెదేపా, భాజపా, కాంగ్రెస్, జనసేన, సీపీఎం, సీపీఐ, జైభీం తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ముక్తకంఠంతో నినదించారు. ఆంధ్రులంతా ఒక్కటే, అమరావతి ఒక్కటే, ముఖ్యమంత్రి మొండి వైఖరి నశించాలి, జై అమరావతి అనే నినాదాలతో హోరెత్తించారు.
భాజపా నాయకుడు సత్యకుమార్కు పూలదండ వేసి సత్కరిస్తున్న అమరావతి మహిళలు
రాజధానికి మద్దతుగా నిలిచాం
ఒకసారి అవకాశమివ్వమని అడిగినందుకు రాష్ట్ర ప్రజలు జగన్ను నమ్మి గెలిపిస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. మరో సారి అవకాశమిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. భాజపాపై అపోహలు ఉన్నా.. నాయకులుగా మేమంతా రాజధానికి మద్దతుగా నిలిచాం.
పాతూరు నాగభూషణం, భాజపా నాయకుడు
జగన్ను ఓడించడం ఒకటే మార్గం
రాజధాని విషయంలో న్యాయ వ్యవస్థలు ఇచ్చిన తీర్పులు అమల్లోకి రావాలంటే జగన్ను ఓడించడం ఒక్కటే మార్గం. జగన్ ఉంటే ఆ తీర్పులను ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేయరు. అమరావతి ఉద్యమం భారత దేశ స్థాయికి చేరింది. అమరావతి ఉండాలంటే జగన్ను ఓడించడానికి రైతులు, మహిళలు కంకణం కట్టుకోవాలి
వీవీ లక్ష్మీనారాయణ, న్యాయవాది
రైతుల ఆశయం గొప్పది
అమరావతి రైతుల ఆశయం గొప్పది. ఉద్యమాన్ని 1200 రోజులకు తీసుకొచ్చిన ఘనత మహిళలకే దక్కుతుంది. భాజపా అండగా ఉంటుంది. అమరావతి వచ్చిన భాజపా ప్రముఖులంతా రాజధానికి మద్దతు పలికారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి.
వల్లూరి జయప్రకాష్ నారాయణ, కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్
రాజకీయ పబ్బం గడుపుకుంటుంది
ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎందుకు మాట్లాడటం లేదు. రాష్ట్ర భాజపా నాయకులు మద్దతు ప్రకటించినా... కేంద్రం నుంచి ఏం రాబట్టారు. మోదీ శిలాఫలకం వేసిన దగ్గర నిరాహార దీక్షలకు కూర్చుందామా? సమస్యను పరిష్కరించకుండా భాజపా రాజకీయ పబ్బం గడుపుకుంటోంది. రాజకీయ ఐకాస ద్వారా 175 నియోజకవర్గాల్లో ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారి తీరాల్సిందే. రెండే రెండు ముఖాముఖి పోటీలు జరగాలి .
ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
శాంతియుత మార్గం పనికి రాదు
రాజధాని రైతులు సంయమనంతో ఉంటే జగన్మోహనరెడ్డి దిగిరారు. మెడలో పచ్చ కండువాతో పాటు ఎర్ర కండువా కూడా వేయాల్సిందే. అమరావతిని రక్షించుకోవాలంటే తప్పకుండా కర్ర పట్టుకోక తప్పని పరిస్థితి నెలకొంది. కృష్ణా, గుంటూరు పౌరులు చేసిన పనివల్లే ఈ గతి దాపురించింది. అన్ని వేళల్లో శాంతియుత మార్గం పనికి రాదని రాజధాని రైతులు గుర్తించాలి.
గాదె వెంకటేశ్వరరావు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు
కేంద్రం ఏం చేసింది?
రాజధాని రైతులు త్యాగం చేసిన భూముల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు నెలకొల్పడానికి వారికి అడ్డు ఏమిటి? ఏడు బడ్జెట్లలో రాజధాని నిర్మాణానికి ఎన్ని రూ.కోట్లు మంజూరు చేశారో చెప్పాలి. ఏకైక రాజధాని అమరావతి మాత్రమే ఉండాలని కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఎందుకు చెప్పడం లేదు. రైతుల డిమాండ్ల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలి.
పాశం రామారావు, సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి
‘జగన్ ఇంటికిపోతేనే అమరావతి అభివృద్ధి’
జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
మంగళగిరి, న్యూస్టుడే: ‘ఈ నెల మూడో తేదీన సీఎం జగన్ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసి ముందస్తు ఎన్నికల విషయం చెబుతారని అంటున్నారు. అదే నిజమైతే ప్రతిపక్షాల నెత్తిన పాలుపోసినట్లే. జగన్ ఇంటికి పోయి రాష్ట్రానికి విముక్తి లభిస్తుంది’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అమరావతి ఉద్యమం 1200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజధాని రైతులకు సంఘీభావం తెలుపుతూ మందడంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీపీఐ నాయకులు, కార్యకర్తలు మంగళగిరి నుంచి శుక్రవారం ద్విచక్రవాహనాలతో ప్రదర్శనగా వెళ్లారు. ప్రదర్శనను రామకృష్ణ ప్రారంభించారు. తరువాత సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జంగాల అజయ్కుమార్, అక్కినేని వనజతో కలిసి విలేకర్లతో మాట్లాడుతూ.. ‘తొందరగా ఎన్నికలు పెట్టమని కోరుతున్నాం. జగన్ ఇంటికిపోతే అమరావతి అభివృద్ధి అవుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. పోలవరానికి నిధులు, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు కేంద్రం మెడలు వంచుతానని చెప్పి మోదీ మోకాళ్ల వద్ద కూర్చుంటున్నావు. కేంద్రం పదే పదే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నప్పటికీ మాట్లాడలేని ముఖ్యమంత్రిగా మిగిలిపోయావు. రైతులు, మహిళలపై కేసులు పెట్టించారు. అయినా సరే ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా పోరాడుతున్నారనంటే ఇప్పటికైనా అర్థం చేసుకొని విజ్ఞత ప్రదర్శించాలి’ అని సూచించారు. అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు స్పష్టంగా తీర్పునిచ్చింది. సుప్రీం కోర్టుకు వెళితే స్టే ఇవ్వడానికి కూడా నిరాకరించింది. మూడు రాజధానుల డ్రామా ఎవరూ నమ్మడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ప్రభుత్వానికి బుద్ధి చెప్పినప్పటికీ ఏ మాత్రం పట్టడం లేదు. కేంద్రం కూడా ఎలాంటి సలహా ఇవ్వడం లేదు. ఇక్కడ భాజపా నాయకులు పాదయాత్రలో పాల్గొంటూ దిల్లీలో మాట్లాడకుండా డబుల్గేమ్ ఆడుతున్నారు. జగన్మోహన్రెడ్డికి వత్తాసు పలుకుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
ECI: 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
-
Politics News
Raghurama: బాబాయ్కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ
-
Crime News
America: అమెరికాలో ఇందూరు వాసి మృతి
-
Ap-top-news News
Heat waves: సన్డే.. మండే.. ఏపీలో భగభగలే
-
Ap-top-news News
YSRCP: లాగిపడేయండి.. సస్పెండ్ చేస్తా: అధికార పార్టీ కార్పొరేటర్పై మేయర్ వ్యాఖ్యలు
-
India News
Indian Railway Accidents: భారతీయ రైల్వేలో మహా విషాదాలివీ..