logo

కొలువు పోతుందనే బెంగతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలవన్మరణం

చేస్తున్న ఉద్యోగంలో ఒత్తిడితో పాటు.. ఉన్న ఉద్యోగం ఎప్పుడు పోతుందోనన్న బెంగతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Published : 01 Apr 2023 05:38 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: చేస్తున్న ఉద్యోగంలో ఒత్తిడితో పాటు.. ఉన్న ఉద్యోగం ఎప్పుడు పోతుందోనన్న బెంగతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో చోటు చేసుకుంది. నార్సింగి అడ్మిన్‌ ఎస్సై బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు పట్టణానికి చెందిన వినోద్‌కుమార్‌(32)కు ఐదేళ్ల క్రితం పెళ్లయింది. భార్య, కుమార్తె(3) ఉన్నారు. వినోద్‌ గచ్చిబౌలిలోని వెరిజాన్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకు గుంటూరులోని ఇంటి నుంచి విధులు నిర్వహించిన వినోద్‌.. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి అల్కాపూర్‌ కాలనీ, రోడ్డు నెం.1లో ఉంటున్న సోదరుడు రాజేష్‌ ఇంట్లో ఉంటూ విధులకు వెళ్తున్నాడు. ఉద్యోగ భద్రతపై, కొత్త టూల్స్‌ నేర్చుకోవడం ఇబ్బందిగా ఉందంటూ తమ్ముడితో తరచూ చర్చించే వాడు. గురువారం మధ్యాహ్నం తమ్ముడు, మరదలు బయటికి వెళ్లగా వినోద్‌ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంత సమయం తర్వాత ఇంటికి వచ్చిన సోదరుడు గమనించి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం గుంటూరు తీసుకెళ్లారని కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై సమరం రెడ్డి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని