logo

ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు

ఎండ వేడికి తాళలేక అన్ని వయస్సుల వారు ఠారెత్తుతున్నారు. చిన్నారులు,  మహిళలు, యువత, గర్భిణులు, బాలింతలు, వృద్ధులే కాదు.

Published : 29 May 2023 04:35 IST

ఎండ వేడికి తాళలేక అన్ని వయస్సుల వారు ఠారెత్తుతున్నారు. చిన్నారులు,  మహిళలు, యువత, గర్భిణులు, బాలింతలు, వృద్ధులే కాదు.. దీర్ఘకాలిక రోగాలకు ఔషధాలు తీసుకునే వారు... అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు.

అధిక రక్తపోటుతో పాటు హృద్రోగం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయ సంబంధిత వ్యాధులకు వాడే ఔషధాలు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. వాటిని తీసుకుంటే ఎక్కువ సార్లు మూత్రవిసర్జనకు పోతుంటారు. ఫలితంగా శరీరంలోని నీటి శాతం పడిపోతుంది.

ఈ సమయంలో ఎండలో తిరిగితే మరింత ప్రమాదం. జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే వడదెబ్బ బారిన పడే ప్రమాదం. మందులు వాడుతున్న వారు వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు డోసు మార్చుకోవాలి. ఇంట్లో ఉన్నా సరే నీటిని తాగుతూ ఉండాలి.

పార్కిన్సన్స్‌(వణుకుడు) వ్యాది నివారణకు ఔషధాలు తీసుకునే వారు సైతం అప్రమత్తంగా ఉండాలి. ఈ మందుల కారణంగా శరీరంలోని స్వేదరంధ్రాల పనితీరు తగ్గుతుంది. బయటకు చెమట రాక శరీరం పొడి బారుతుంది. సాధారణంగా బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం సహజంగా బయటకు చెమట విడుదల చేస్తుంది. దీంతో శరీరం చల్లబడి సమతుల్యం చేస్తుంది. ఈ మందులతో చెమట బయటకు రాకపోతే ఉష్ణోగ్రతలు పెరిగిపోయి.. తొందరగా వడదెబ్బకు గురవుతారు. ఈ మందులు వాడే రోగులు వైద్యుల సూచనల మేరకు డోసు తగ్గించుకోవాలి.

మానసిక వ్యాధులకు మందులు తీసుకునే వారిలోనూ డీహైడ్రేషన్‌ ముప్పు పొంచి ఉంటుంది. వీరు కూడా వైద్యులను సంప్రదించి వాడే ఔషధాల డోసు తగ్గించుకోవడం మంచిది. అత్యవసరమైతే గొడుగు తీసుకెళ్లడం, టోపీ పెట్టుకోవడం ముఖ్యం. ఉదయం 8 గంటల తర్వాత సాయంత్రం 4లోపు బయట తిరగక పోవడమే మంచిది.

కొన్ని రకాల యాంటీబయోటిక్స్‌తో పాటు మధుమేహం నియంత్రణకు ఇచ్చే మందుల వల్ల చర్మం నల్లబడుతుంది. ఇలాంటి వారు ఎండలోకి వెళ్లే చర్మ సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశంతో పాటు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అత్యవసరమైతే అధిక ఎస్‌పీఎఫ్‌ ఉండే క్రీములు శరీరానికి పూసుకోవడం.. లేదంటే శరీరంపై ఎండ తగలకుండా దుస్తులు ధరించాలి.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని