logo

బాలికల్లో రక్తహీనత!

ఉమ్మడి గుంటూరులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంది. సగటున ఏ పాఠశాలలో చూసినా మొత్తం అమ్మాయిల్లో మైల్డ్‌, మోడరేట్‌ మధ్య ఉన్నవారే సగం మంది ఉంటున్నారు.

Published : 29 May 2023 04:35 IST

అధిగమించేందుకు మొక్కుబడి చర్యలు
ట్యాబ్లెట్లు వేసుకోకున్నా పట్టించుకోరు
ఈనాడు, అమరావతి

మ్మడి గుంటూరులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంది. సగటున ఏ పాఠశాలలో చూసినా మొత్తం అమ్మాయిల్లో మైల్డ్‌, మోడరేట్‌ మధ్య ఉన్నవారే సగం మంది ఉంటున్నారు. ఇంత మంది రక్తహీనతతో బాధపడుతున్నారని గుర్తించినా దానిని అధిగమించేందుకు విద్య, వైద్య, ఆరోగ్యశాఖలు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం లేదు.

ఇటీవల పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్‌ గుంటూరు జిల్లా నారాకోడూరు జడ్పీ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అప్పట్లో ఆయన పిల్లల హెల్త్‌ రికార్డ్స్‌ పరిశీలించగా చాలా మందిలో రక్తహీనత ఉన్నట్లు తెలుసుకున్నారు. పాఠశాలలకు సెలవులు అయినా అసలు విద్యార్థినులకు ట్యాబ్లెట్లు పంపిణీ చేశారా లేదా? వాటిని వేసుకుంటున్నారా లేదా అని నేరుగా పిల్లల ఇళ్ల వద్దకు వెళ్లి ఆరా తీశారు. ఓ విద్యార్థిని అయితే అసలు ట్యాబ్లెట్‌ షీట్లు ఇచ్చినవి ఇచ్చినట్లు పక్కన పెటినట్లు ఆయన పరిశీలనలో వెలుగుజూసింది. కొందరికి ఆ ట్యాబ్లెట్లు సైతం పంపిణీ చేయలేదు.

ఏప్రిల్‌ 28 నుంచి పాఠశాలలకు సెలవులిచ్చారు. కొందరు హెచ్‌ఎంలు ముందుగానే మేల్కొని వేసవి సెలవుల్లోనూ ఇళ్ల వద్దే ఉంటూ మందులు వేసుకోవాలని సూచించారు. ఆ మేరకు వారి పరిధిలోని పీహెచ్‌సీ వైద్యాధికారులకు చెప్పి పంపిణీ చేయించారు. అయితే సరిపడా ఔషధ నిల్వలు లేవని అరకొరగా ఇచ్చారు. నెలకు ఒక్కో విద్యార్థికి మూడు షీట్లు ఇవ్వాలి. అలాంటిది అత్యధిక పీహెచ్‌సీల పరిధిలో ఒకటి, రెండు షీట్లకు మించి ఇవ్వలేదని సత్తెనపల్లి డివిజన్‌కు చెందిన ప్రధానోపాధ్యాయుడొకరు వివరించారు.

మరోవైపు వైద్యులు తమకు ఫ్యామిలీ ఫిజీషియన్‌ సేవలు అందించడానికి శిక్షణకు వెళుతున్నామని, సీఎం పర్యటన సభల వద్ద డ్యూటీలు ఉన్నాయని చెప్పి ఆ మందులు ఇవ్వలేదు. మరికొద్ది రోజుల్లో వేసవి సెలవుల అనంతరం తిరిగి జూన్‌ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండడంతో చాలా మంది హెచ్‌ఎంల్లో ఆందోళన నెలకొంది. ట్యాబ్లెట్లు మింగని కారణంగా సమస్య ఇంకాపెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.


ప్రవీణ్‌ ప్రకాష్‌ పర్యటనలతో హడల్‌

కవైపు జేవీకే కిట్ల నాణ్యత, పాఠ్య పుస్తకాలు ఏ మేరకు వచ్చాయో తెలుసుకోవడానికి ప్రవీణ్‌ ప్రకాష్‌ పర్యటనలు చేస్తున్నారని, నారాకోడూరులో మాదిరి మిగిలిన స్కూళ్ల పరిధిలో కూడా ఆయన పర్యటనలకు వెళితే ట్యాబ్లెట్ల లేమి వంటి సమస్యలు బయటపడతాయని తెలిపారు. ఇది వైద్యాధికారుల తప్పిదమేనని, పిల్లలకు ఎన్ని షీట్లు అవసరమో గుర్తించి ఆ మేరకు నిల్వలు సమకూర్చుకోవాల్సిన బాధ్యత వారిదేనని, తమకు పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారని వైద్యుల తీరుపై ఉపాధ్యాయ వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కొన్నిచోట్ల అయితే ట్యాబ్లెట్లే పంపిణీ చేయలేదు. వేసవి సెలవులు అయినా నాడు-నేడు పాఠశాలల పనులు, ప్రవేశాల డ్రైవ్‌, పది ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు బోధించడానికి హెచ్‌ఎం, క్లాస్‌ టీచర్లు, సబ్జెక్టు టీచర్లు నిత్యం ఎవరో ఒకరు అందుబాటులోనే ఉంటున్నారు. కనీసం ఇప్పుడు ఇచ్చినా వాటిని తామే పిల్లలు ఇళ్లకు వెళ్లి అందజేస్తామని చెబుతున్నా మా మొర ఆలకించడం లేదని అంటున్నారు.


సమస్య పెరుగుతుందేమోనని ఆందోళన

వాస్తవానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి పిల్లల్లో రక్తహీనత సమస్య ఏమైనా తగ్గిందా లేదా తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు చేయించాలి. చివరిగా ఫిబ్రవరిలో నిర్వహించారు. వేసవి సెలవులు ముగియగానే స్కూళ్లు తెరిచిన తర్వాత జూన్‌లో పరీక్షలు చేయించాల్సి ఉంటుందని, వాస్తవానికి ఈ సెలవుల్లో ట్యాబ్లెట్లు ఉన్నా ఇంటి వద్ద సరిగా వేసుకోక, కొందరికి అవి వేసుకోవాలనుకున్నా మందులు ఇవ్వని కారణంగా సమస్య మరింత పెరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రతి గురువారం పిల్లల్లో ఎనీమిక్‌ సమస్య గుర్తించడానికి స్థానికంగా ఉండే పీహెచ్‌సీ వైద్యులు, వారి సిబ్బంది, గ్రామాల్లో ఉండే ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ, ఆశా, ఎంపీహెచ్‌డబ్లూ (ఫిమేల్‌), సచివాలయంలో ఉండే ఆరోగ్య కార్యకర్తలు వీరంతా ఒక బృందంగా ఏర్పడి ఎనీమిక్‌ పరీక్షలు నిర్వహిస్తారు. 9-12 గ్రాముల మధ్య రక్తం ఉండే వారికి ఎలాంటి ట్యాబ్లెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంతకన్నా తగ్గితే మాత్రం వారిని మైల్డ్‌, మోడరేట్‌, సివియర్‌ (మూడు కేటగిరీలు)గా నిర్ధారిస్తారు. ఆ మేరకు డోసులు పెంచి పోలిక్‌ యాసిడ్‌, టెర్రా సల్ఫేడ్‌ టా యబ్లెట్లు ఇచ్చి అవి వాడాలని సూచిస్తారు. ఈ ట్యాబ్లెట్లు పిల్లలు వేసుకుంటున్నారా లేదా అనేది నిత్యం అటెండెన్స్‌ యాప్‌లో నమోదు చేయాలి. మైల్డ్‌, మోడరేట్‌ వాళ్లు రోజుకు ఒకటి, సీవియర్‌గా ఉన్నవాళ్లకు రోజుకు రెండు చొప్పున వాటిని వేస్తారు.


బీకాంప్లెక్సు ఇవ్వాలంటున్న హెచ్‌ఎంలు

పిల్లల్లో అభ్యసనా సామర్థ్యాలు లోపించినా, వారు ఉత్తీర్ణులు కాకపోయినా, రక్తహీనతతో బాధపడుతున్నా అన్నింటికి క్లాస్‌ టీచర్‌, హెచ్‌ఎంలను బాధ్యులను చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు పౌష్టికాహారం పెట్టాలి. వైద్యులు ఇచ్చే మందులు పిల్లలు వేసుకునేలా చూడాలి. రక్తహీనత సమస్య అధిగమించాలంటే ప్రస్తుతం ఇచ్చే ట్యాబ్లెట్లకు అదనంగా బీకాంప్లెక్సు మందులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎంలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని